Sunday, July 5, 2009

మధుమేహము , Diabetes


insulin production------------------------------------------------ Exercise .
  • ==========================================
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారము మధు మేహానికి ఇండియా కేంద్రబిందువు గా మారినది . సుమారు 4%-5% వరకు మధుమేహ రోగులు ఉన్నారు . 2025 నాటికి ఈ సంఖ్యా 10% కి పెరగవచ్చును .
  • మధుమేహముఅంటేఏమిటి ? :
రక్తం లో షుగర్ స్తాయి అదుపు తప్పి అసాధారణ స్థితికి చేరినందువల్ల తలెత్తే పర్ష్టితిని దయాబిటిస్ లేదా షుగర్ వ్యాధి అంటాము . ఇది బయటకు కనిపించని ప్రాణాంతక వ్యాధి . ఈ వ్యాధిని నియంత్రించకపోతే క్రమంగా దాని ప్రభావాన శరీరం లోని మిగిలిన ప్రధాన అంగాలన్ని తమ సమర్ధతను కోల్పోతాయి . గుండె ,మెదడు ,కళ్లు , మూత్రపిండాలు , పాదాలు , నాడులు ,వగైరా అన్ని షుగర్ వ్యాధి వల్ల కుంటుపడే అవకాశముంది . ఒక సారి షుగర్ జబ్బు వస్తే దాన్ని పూర్తిగా తగ్గంచే మార్గం లేదు ... అదుపులో ఉంచికుని కాలం నెట్టుకురావటం మాత్రమే చేయగలము .
  • ఎందుకువస్తుంది ?:
శరీరంలోని క్లోమగ్రంది నుండి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది . మానవుడు తీసుకున్న ఆహారంలోని పిందిపదార్దములు(Carbohydrates) రక్తం లో షుగర్ రూపం లో ఉండి శరీర కణాలకు , అంగాలకు అంది .. శరీరానికు అవసరమైన శక్తిని ఇస్తుంది . అలా అందజేయడానికి " ఇన్సులిన్" పాత్ర ఉంటుంది , ఇన్సులిన్ చర్య వల్ల షుగర్ శరీర భాగాల కణాలకు చేరుతుంది . ఎపుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుందో లేక తగినంత ఉత్పత్తి కాదో ..అపుడు రక్తం లోని చెక్కెర శరీర కణాలకు చేరకుండా రక్తం లోనే ఉండిపోయి .. రక్తం లో షుగర్ లెవల్(levels) ఎక్కువైపోవడాన్నే దయాబిటిస్ (షుగర్ వ్యాధి) వచ్చిందని అంటారు . దీని వలన రెండు రకాల నష్టాలు .. ఒకటి తిన్న ఆహారము నుండి శరీర అంగాలకు శక్తి రవాణా అవదు . రెండు రక్తంలో గ్లూకోజ్  స్థితి మారిపోతుంది .
  • యూరిన్షుగర్అంటేఏమిటి ?:
రక్తాన్ని వడగట్టే మూత్రపిండాలు మూత్రం ద్వారా ఎక్కువగా ఉన్న షుగర్ ని బయటకు పంపుతాయి , చెక్కెరతో కూడిన రక్తాన్ని వడగట్టేందుకు మూత్రపిండాలు మరింతగా శ్రమించాల్చి ఉంటుంది . దీన్నే యూరిన్ షుగర్ అంటాము .. అందువలన మూత్రపిండాలు దెబ్బతింటాయి . ఆ పైన కళ్లు , మెదడు , గుండె , నరాలు , రక్తనాళాలు దెబ్బతింటాయి . గాయం తగిలితే తొందర గా మానదు . వ్యదినిరోధక శక్తి తగ్గినందున ఇంఫెక్సన్ చేరి గాయము గాంగ్రీన్ గా మారి ప్రాణాపాయము సంభవించవచ్చు .

వ్యాధి లక్షణాలు :
  • అతి మూత్ర విసర్జన .
  • అతి గా ఆకలి ,
  • దాహము ఎక్కువగా వేయడం ,
  • ఎటువంటి కారణాలు లేకుండా హఠాత్తుగా బరువు తగ్గడం ,
  • అలసట, అరికాళ్ళలో తిమ్మిరులు , మంటలు ,
  • మర్మంగాల లో దురద , మంట ,
  • గాయాలు తొందర గా మానక పోవడం ,
  • నీరసం , నిస్సత్తువ , చిక్కిపోవడం ,
అయితే ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే కొన్నిసమయాల్లో రొటీన్ గా చేసే పరీక్షల వల్ల Diabetes బయటపడవచ్చు .

వ్యాధి రకాలు :
ఇది మధ్య వయస్సు వారి వ్యాధి గా పేర్కొంటారు . చిన్న పిల్లలలో అరుదు గా కనిపించవచ్చును . అందుచే ఈ వ్యాధి 4 రకాలు .. టైపు 1 , టైపు 2. అనే రెండు రకాలు .3. డయాబిటీస్ ఇన్‌సిపిడస్ , 4. జెస్టేషన్‌ డయాబిటీస్

టైపు 1 = దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ దయబిటిస్ (insulin dipendent) అని అంటాము ... ఇది ఎ వయసు లోనైనా కలుగ వచ్చును . . . కాని ఎక్కువ గా పిల్లల లో వస్తుంది . ఈ తరహా దయబిటిస్ లో insulin ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది . కారణాలు ఎన్నో .. క్లోమగ్రంది (Pancreas)దెబ్బతిని insulin ఉత్పత్తి చెయ్యదు . కాబట్టి insulin ఇంజెక్షన్ లు తీసుకోవడం తప్ప వేరే ట్రీట్మెంట్ లేదు .

టైపు 2 = మద్య వయసు వాళ్ళకి వచ్చేది .. ఇది వంశ పారంపర్యం గా వచ్చే వ్యాధి . ఈ తరహ వ్యాధి లో insulin ఉత్పత్తి జరుగుతున్నా దాని ప్రభావం కణాల మీద ఉండదు . కణాలకు చేరాల్చిన షుగర్ రక్తం లో నిలిచిపోతుంది . టైప్-2 డయాబిటీస్  వచ్చినవారు ముందు 10 - 15 సంవత్సారాలు నోటి ద్వారా ఇచ్చే మందుల తో నియంత్రించిన  తర్వాత బ్రతికి ఉంటే insulin తీసుకోక తప్పనిసరి పరిస్తితి ఏర్పడుతుంది . టైపు 2 దయబిటిస్ లో మరో రకము--meturity onset Diabetes.= ఇది 25 ఎల్ల వయసు లోపు వారికి వస్తుంది . మూడు తరాలుగా Diabetes కలిగిన కుటుంబాలలో ఈ తరహా డయాబెటీస్ వస్తుంది .

gestational Diabetes : ఇది గర్భిణి గా ఉన్నపుడు మొదటి సరిగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి . రక్తం లో షుగర్ నియంత్రించేందుకు insulin ఇంజక్షన్‌ లూ ఆహారపు నియమాలు రెండు కలిపి పాటించాలి . ప్రసవం అయిన తరువాత ఇది తగ్గిపోతుంది ... కొంత మంది లో టైపు 2 డయబిటీస్ గా కొనసాగే అవకాసం ఉంది .

జాగ్రత్తలు :
  • తల్లి దండ్రులలో ఎ ఒక్కరికైనా డయాబెటిస్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాసము 35 శాతము వరకు ఉంటుంది . తల్లిదండ్రులిద్దరకి డయాబెటిస్ ఉంటే ఆ అవకాసము 60 శాతము ఉండును .
  • శారీరక శ్రమ  చేయకుండా ఒకే చోట కూర్చొని పనిచేసేవారికి డయబిటీస్ వచ్చే అవకాసము ఉంటుంది .
  • ఆహారపు అలవాట్లు , ఆహారము పై నియంత్రణ , వ్యాయామము ద్వార డయాబెటిస్ కొంత మేరకు దూరము చేయవచ్చును .
  • మధ్య వయసుకు చేరిన వారు ప్రతి మూడు మాసములకు రక్తపరేక్షలు చేయించుకోవాలి .
  • డయాబెటిస్ రోగులు వారి పాదాలను జాగ్రత్తగా రక్షించుకోవాలి , ఎవ్విదమైన దెబ్బలు తగులకుండా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ దరిచేరకుండా జాగ్రత్తలూ తీసుకోవాలి .

చికిత్స :

1. ఆహారపు అలవాట్లు ...
  • తినే ఆహారము వీలైనంతవరకు తగ్గించుకోవాలి . ఎక్కువగా పీచుపదర్దములు తీసుకోవాలి. తీపిగా ఉన్నవి అతిగా తినకూడదు . ఆకుకూరలు , కాయకురాలు ఎక్కువగా తినాలి. నీరు ఎక్కువగా త్రాగాలి .
2. వ్యాయామము :
  • ప్రతిరొజూ తప్పని సరిగా వ్యామము చేయాలి .. ఒక మోస్తరు నడక చాలా మంచిది. శరీరము బాగా అలిసిపోకుండా ఉండే ఆటను ఏదైనా ఆడుకోవచ్చును. వ్యామములో క్రమము తప్పకూడదు .
౩. మందులు :
  • a). acarbose : ఇవి పిండి పదార్దములు జీర్ణం చేసే రసాయనాలను (enzymes) జీర్ణ వాహిక లో తగ్గించడం ద్వార carbohydrates రక్తం లోనికి absorb అవకుండా నిరోదిస్తాయి . ఆవిధంగా ఆకలి మందగించి తక్కువ ఆహారము తీసుకోవడము  జరుగుతుంది.
  • b).ఇన్సులిన్ సేన్సిటైజేర్స్ (insulin sensitizers): టైపు 2 డయాబిటీస్  లో తగినంత insulin వున్నా దాన్ని ఉపయోగించుకునే సమర్ధత లేకపోవడం వలన షుగర్స్ వినియోగం లోనికి రావడమా లేదు . ఉన్న insulin ని సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి ఈ insulin సేన్సిటైజెర్స్ఉపయోగ పడతాయి . pioglitazone , rosiglitazone , metformin .. ముఖ్యమైనవి .
c). Sulfonylureas : ఇవి pancreas లో iletcells నుండి insulin ఉత్పత్తిని ఎక్కువ చేయును .
  • Drugs in this class--
ఫస్ట్ జనరేషన్---

  • * Acetohexamide
  • * Chlorpropamide
  • * Tolbutamide
  • * Tolazamide
సెకండ్ జనరేషన్
  • * Glipizide
  • * Gliclazide
  • * Glibenclamide (glyburide)
  • * Gliquidone
  • * Glyclopyramide
థర్డ్ జనరేషన్
  • * Glimepiride
============================
Updates :
=============================

నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ త్వరగా సోకే ప్రమాదముంది. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్ర పోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్ నియంత్రణగా గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్లు ఎక్కువసేపు మెలకువతో వుండే విద్యార్థులు గుర్తించాల్సిన విషయం ఇది.
అయితే వయసులో ఉండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ప్రమాదముంది. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించినవారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. నిద్రలేమి వారి కొంప ముంచుతుంది.దీనివల్ల హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకెళ్లే ప్రమాదముంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర విషయంలో తగిన జాగ్రత్త వహించడం మరువకూడదు.
  • మధుమేహులకు నిద్రరక్ష , Good sleep protects Diabetics--
కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నది తెలిసిన విషయమే. మిగతావారి సంగతెలా ఉన్నా ఇది మధుమేహులకు మాత్రం అత్యంత అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడేవారికి సరిగా నిద్ర పట్టకపోతే రక్తంలో గ్లూకోజు శాతం పెరుగుతున్నట్టు.. తద్వారా వ్యాధి నియంత్రణ కష్టం అవుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. మధుమేహానికి నిద్రలేమికి సంబంధం ఉంటున్నట్టు గతంలోనే బయటపడింది. అయితే దీనికి నిద్రించే సమయం, కంటినిండా నిద్రపోవటం వంటివాటికి ఏమైనా సంబంధం ఉందా? అనే దానిపై ఇటీవల ఒక పరిశోధన చేశారు. టైప్‌ 2 మధుమేహులతో పాటు ఆరోగ్యంగా ఉన్నవారినీ ఎంచుకొని పరిశీలించారు. వాళ్లు రాత్రిపూట హాయిగా న్రిద్రపోతున్నారా? లేదా? అనేది తెలుసుకోవటానికి మణికట్టు వద్ద కదలికలను పసిగట్టే పరికరాలను అమర్చారు. నిద్ర బాగా పట్టిన మధుమేహులతో పోలిస్తే.. నిద్ర సరిగాపోనివారిలో పరగడుపున రక్తంలో గ్లూకోజు మోతాదు 25 శాతం, ఇన్స్‌లిన్‌ మోతాదు 50 శాతం ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అలాగే ఇన్స్‌లిన్‌ నిరోధకత 80% అధికంగా ఉంటోంది కూడా. నిద్రలేమి కారణంగా రక్తంలో గ్లూకోజు పెరుగుతోందా? గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టటం లేదా? లేకపోతే ఇతరేతర అంశాలేవైనా దోహదం చేస్తున్నాయా? అన్నది మాత్రం తేలలేదు. ఏదేమైనా నిద్ర విషయంలో మధుమేహులు జాగ్రత్తగా ఉండటం మంచిదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.


మధుమేహ వ్యాయామం
మధుమేహం గలవారు వ్యాయామం చేయటం మంచిదే గానీ.. ఎలాంటి వ్యాయామాలు చేయాలనేదీ ముఖ్యమే. కొన్నిసార్లు బలమైన వ్యాయామాలు... మంచి కన్నా చెడు చేసే అవకాశమే ఎక్కువ. కాబట్టి వ్యాయామాల ఎంపికలో జాగ్రత్త అవసరం.
* మధుమేహంలో దృష్టిసమస్య (రెటినోపతి) ఉన్నవారు అధికంగా బరువులెత్తే వ్యాయామాలు మానెయ్యాలి. ఇవి కంట్లోని సున్నితమైన రక్తనాళాలను దెబ్బతీయొచ్చు.
* కాళ్ల స్పర్శ సమస్య (పెరిఫెరల్‌ న్యూరోపతీ) గలవారు నాణ్యమైన, మెత్తటి పాదరక్షలను ధరించాలి.
* కొవ్వు ఎక్కువగా ఉన్నవారు, గుండెపోటు వచ్చినవారు వ్యాయామాలు ప్రారంభించే ముందు గుండె పరీక్షలు చేయించుకోవటం మంచిది.
* మూత్రంలో కీటోన్లు పోతుంటే.. కాళ్లల్లో నొప్పి, మొద్దుబారటం వంటివి ఉంటే వ్యాయామం చేయకూడదు.
* అలాగే పెద్దమొత్తంలో మందులు వేసుకుంటున్నా వ్యాయామం మానెయ్యాలి.

  • మధుమేహానికి 'పిండి' ముప్పు
చీజ్‌, మాంసం వంటి కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచివి కావని తెలిసిన సంగతే. కేవలం ఇవే కాదు పాలిష్‌ పట్టిన బియ్యం, శుద్ధిచేసిన గోధుమలతో తయారైన బ్రెడ్డు కూడా వాటికేమీ తీసిపోవటం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

కొవ్వు పదార్థాలు మన శరీరంలో ట్రైగిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) మోతాదు పెరిగేలా చేస్తాయి. అంతేకాదు మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌)ను తగ్గిస్తాయి కూడా. దీంతో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. ఒకవేళ ఈ సంతృప్త కొవ్వులకు బదులు శుద్ధి చేసిన పిండి పదార్థాలను తీసుకుంటే.. పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. పాలిష్‌ పట్టిన తెల్లటి బియ్యం, శుద్ధిచేసిన గోధుమలతో చేసిన బ్రెడ్డు వంటి వాటిని పెద్ద మొత్తంలో చాలాకాలం పాటు తీసుకుంటుంటే మధుమేహం రావటానికి కారణమవుతాయి. తెల్లటి బియ్యానికి బదులు దంపుడు బియ్యాన్ని తింటే టైప్‌ 2 మధుమేహం వచ్చే అవకాశం 16% తగ్గుతుందని ఇటీవల హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ (హెచ్‌ఎస్‌పీహెచ్‌) చేసిన అధ్యయనంలో వెల్లడైంది కూడా. నెలలో రెండుసార్లు దంపుడు బియ్యం తిన్నా కూడా మధుమేహం ముప్పు 11 శాతం తగ్గుతున్నట్టు బయటపడింది. తెల్లటి బియ్యాన్ని కొద్దిగా అంటే వారానికి 150 గ్రాములు తీసుకున్నా మధుమేహం వచ్చే అవకాశం 17 శాతం పెరుగుతుండటం గమనార్హం. ఇక రకరకాల ముడిధాన్యాలను కలిపి తీసుకుంటే మధుమేహం వచ్చే ముప్పు 36 శాతం తక్కువగా ఉంటున్నట్టు 'హెచ్‌ఎస్‌పీహెచ్‌' అధ్యయనంలో తేలింది.

బియ్యాన్ని బాగా పాలిష్‌ పట్టినపుడు దాని పైన ఉండే తవుడు, పోషకాల వంటివి పూర్తిగా తొలగిపోతాయి. తవుడులోని పీచు, మెగ్నీషియం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటానికి బాగా తోడ్పడతాయి. తెల్లటి బియ్యం రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని త్వరగా పెంచేందుకు దోహదం చేస్తాయి. ఈ స్థాయిని 'గ్త్లెసెమిక్‌ ఇండెక్స్‌' ద్వారా సూచిస్తుంటారు. తెల్లటి బియ్యంలో ఈ సూచి 65 కాగా.. దంపుడు బియ్యంలో ఇది 55 మాత్రమే. అందుకే బాగా పాలిష్‌ పట్టిన తెల్లటి బియ్యం, పొట్టుతీసిన గోధుమలతో చేసిన బ్రెడ్డు వంటి వాటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మేలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొవ్వు పదార్థాలు తీసుకోవటం లేదనే ధీమాతో వీటిని ఎక్కువెక్కువగా తిన్నా ప్రమాదమేనని సూచిస్తున్నారు.
  • మెగ్నీషియంతో మధుమేహం దూరం!
మధుమేహం ముప్పు నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఆహారంలో మెగ్నీషియం తగు మోతాదులో ఉండే పదార్థాలను ఎంచుకోండి. మెగ్నీషియం తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునేవారితో పోలిస్తే.. అధికంగా గల పదార్థాలు, మాత్రలు తీసుకునేవారిలో మధుమేహం ముప్పు సుమారు సగానికి తగ్గుతున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. వివిధ ఎంజైములు తగురీతిలో పనిచేయటానికి మెగ్నీషియం ఎంతో అవసరం. ఇది గ్లూకోజును వినియోగించుకోవటంలో శరీరానికి తోడ్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మధుమేహం, మెగ్నీషియం మధ్యగల సంబంధాన్ని తెలుసుకోవటానికి నార్త్‌ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. ఇందుకు మధుమేహం లేని 18-30 వయసు గల 4,497 మందిని ఎంచుకున్నారు. 20 ఏళ్ల తర్వాత వీరిని పరిశీలించినపుడు వీరిలో 330 మంది మధుమేహం బారినపడ్డట్టు గుర్తించారు. మెగ్నీషియం అధికంగా తీసుకుంటున్నవారు అంటే ప్రతి వెయ్యి కేలరీల శక్తినిచ్చే ఆహారంలో సుమారు 200 మి.గ్రా. మెగ్నీషియం ఉండేలా చూసుకున్నవారిలో 47 శాతం మధుమేహం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. మెగ్నీషియం ఎక్కువగా తీసుకునేవారిలో వివిధ వాపు సూచికల స్థాయులు కూడా తగ్గుముఖం పట్టాయి. ''మెగ్నీషియం ఎక్కువగా తీసుకుంటే ఇన్స్‌లిన్‌ను శరీరం బాగా గ్రహించటానికి.. వాపు, మధుమేహం ముప్పును తగ్గించటానికి తోడ్పడొచ్చు'' అని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంతకీ మెగ్నీషియం ఎందులో ఎక్కువగా ఉంటుందో తెలుసా? ముడిధాన్యాల్లో. నిజానికి మధుమేహం గలవారు ముడిధాన్యాలు తినటం మంచిదని డాక్టర్లు ఎప్పట్నుంచో చెబుతున్నారు. అయితే ఇవి మధుమేహం రాకుండానూ చూస్తాయని తేలటం విశేషం.
  • మధుమేహం నివారణ సాధ్యమే! updated on 19/10/2010
మధుమేహం.. ఆధునిక ఉపద్రవం! ఇది ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వెన్నంటి వస్తుంది. అంతే కాదు.. మరెన్నోప్రమాదాలను మోసుకొస్తుంది. ఇదెంత ప్రమాదకరమైనదైనా.. తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని బారినపడకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
  • శారీరకశ్రమ ప్రధానం
మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే ముందు శరీరబరువుని నియంత్రణలో పెట్టుకోవటం ఎంతో అవసరం. సాధ్యమైనంత ఎక్కువగా శారీరకశ్రమ చేయటానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
1. రోజుకి సుమారు అరగంట సేపు నడవటం గానీ ఏరోబిక్‌లాంటి వ్యాయామాలు గానీ ఏదైనా  చేయటం మరవరాదు. ఇలా వారంలో కనీసం ఐదుసార్లు చేస్తే మధుమేహం నివారణకు తొలి అడుగు వేసినట్టేం

2. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవటం తప్పనిసరి. ఒకవేళ అధికబరువు గలవారైతే అందులో 5-7 శాతం తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. కనీసం 2-3 కిలోలు తగ్గినా గణనీయమైన ఫలితం కనబడుతుంది తెలుసా?

* మధుమేహం వచ్చే అవకాశం అధికంగా గలవారు సైతం తగు జాగ్రత్తలో దానిని రాకుండా చూసుకోవచ్చని ఎన్నో పరిశోధనలు సూచిస్తున్నాయి.
  • ముప్పు ఎవరికి?
మధుమేహం వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువో తెలుసుకొని ఉండటం ఎంతో అవసరం. దీనిపై అవగాహన పెంచుకుంటే ముందుగానే జాగ్రత్తపడేందుకు దోహదపడుతుంది.
1. మీరు అధికబరువు గలవారైతే. మీ ఎత్తు, బరువు నిష్పత్తి (బీఎంఐ) 23 కన్నా ఎక్కువుంటే.
2. మీ తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మ, నాన్నమ్మ, సోదరులు, అక్కా చెల్లెల్లు, బాబాయిలు, మామయ్యలు ఇలా మీ కుటుంబసభ్యుల్లో ఎవరైనా మధుమేహంతో బాధపడుతుంటే. వీరిలో ఎవరైనా గతంలో మధుమేహంతో బాధపడి ఉంటే.
3. మీరు తల్లులైతే.. నాలుగు కిలోల కన్నా ఎక్కువ బరువుగల శిశువును కనుంటే.
4. గర్భిణిగా ఉన్నప్పుడు మధుమేహం బారినపడుంటే.. లేదా ఆ సమయంలో రక్తంలో గ్లూకోజు శాతం కొద్దిగానైనా పెరిగి ఉంటే.
5. శారీరకశ్రమ చేసే అవకాశం అంతగా లేనివారైతే.. వారంలో మూడుసార్ల కన్నా తక్కువగా వ్యాయామం చేస్తుంటే.

6. అధిక రక్తపోటు బాధితులైతే.
7. మధుమేహం ముందు దశ (ప్రి డయాబెటీస్‌) లక్షణాలు కలిగుంటే.
8. ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్‌ మోతాదులు మామూలు కన్నా ఎక్కువగా ఉంటే.

  • మధుమేహం ముందు దశ అంటే?
రక్తలో గ్లూకోజు శాతం మామూలుకన్నా ఎక్కువగా ఉండటమే మధుమేహం ముందు దశ. అయితే మధుమేహంలో ఉన్నట్టుగా ఇందులో గ్లూకోజు శాతం మరీ ఎక్కువగా ఉండదు. మధుమేహం ముందు దశ దీర్ఘకాలం కొనసాగితే శరీరంపై దుష్ప్రభావాలు చూపిస్తుంది. వీరికి మధుమేహంతో పాటు గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం అధికం. ఆహారం, విహారం, వ్యాయామం వంటి జీవనశైలి మార్పులతో ఈ గ్లూకోజు శాతాన్ని తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావొచ్చు.
  • మధుమేహం లో శస్త్ర చికిత్స (surgical Treatment) :
సర్జరీలో ఏం చేస్తారు?
  • * మన చిన్నపేగు సుమారుగా 20 అడుగుల పొడవుండే ఒక పొడవాటి గొట్టం! ఇది జీర్ణాశయం కిందనే మొదలై.. పెద్దపేగుకు కలుస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమై, ఆ పోషకాలు మన ఒంట బట్టటానికి ఇదే కీలకం. ఈ చిన్నపేగును వైద్యపరిభాషలో మూడు భాగాలుగా చూస్తారు. మొదటి భాగాన్ని 'డియోడినం' అంటారు. మధ్య భాగాన్ని 'జెజునం' అంటారు. చివరి భాగాన్ని 'ఇలియం' అంటారు. చూడ్డానికి ఒకటే గొట్టం అయినా.. తిన్న ఆహారంలోని పోషకాలను గ్రహించటంలో ఒక్కో భాగం ఒక్కో తీరులో పనిచేస్తుంది.


సర్జరీలో ప్రధానంగా 3 భాగాలున్నాయి.
1. మొదటిది: 'ఇలియల్‌ ట్రాన్స్‌పొజిషన్‌'. చిన్నపేగు చివరి భాగంలోని (ఇలియం) కొంత భాగాన్ని తీసుకు వచ్చి.. జీర్ణాశయానికి దగ్గరగా అతుకుతారు. (హైండ్‌ గట్‌ థియరీ) ఇలా మార్చినప్పుడు- ఇలియం జీర్ణాశయానికి దగ్గరగా వస్తుంది కాబట్టి.. ఇలియంలో తయారయ్యే కొన్ని రకాల హార్మోన్లు.. తీసుకున్న ఆహారంలో చాలా త్వరగా కలుస్తాయి. ఈ హార్మోన్లు క్లోమ గ్రంథికి వెళ్లి.. దాన్ని ప్రేరేపించటం ద్వారా ఇన్సులిన్‌ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది.

2. రెండోది: జీర్ణాశయంలోని కొంత భాగాన్ని తొలగించటం. జీర్ణాశయంలో ఫండస్‌ భాగం నుంచి 'ఘ్రెలిన్‌' అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్‌ నిరోధకత పెరగటానికి ఈ 'ఘ్రెలిన్‌' అనేది కీలకం. సర్జరీలో భాగంగా జీర్ణాశయంలో కొంత భాగం తొలగిస్తారు (ఫోర్‌ గట్‌ థియరీ) కాబట్టి ఘ్రెలిన్‌ తగ్గిపోయి.. ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతుంది, మధుమేహం మెరుగవుతుంది.

3. మూడోది- కాలేయం, క్లోమాలకు వెళుతుండే నాడిలోని భాగాలను కట్‌ చెయ్యటం. (సింపాతెక్టమీ)
-----------------------------------------------------
from 09/11/2010 Sukheebhava (Eenadu):

మధుమేహం అపోహల వలయం!
డా|| పి.వి.రావు,హెడ్‌, డయాబెటాలజీ,నిమ్స్‌, హైదరాబాద్‌( సుఖీభవ.)

మధుమేహం అంటేనే ఓ అపోహల పుట్ట. అదో అనుమానాల తుట్టె. మన సమాజంలో మధుమేహ బాధితులకు అడుగడుగునా ఉచిత సలహాలు ఎదురవుతూనే ఉంటాయి. ఉదయం లేస్తూనే కాఫీ కప్పుతో మొదలయ్యే ఈ సందేహ పరంపర.. రాత్రి శయనించే వరకూ ప్రతి అడుగులోనూ మనసుని తొలుస్తూనే ఉంటుంది. కాఫీలో పంచదార వేసుకోవాలా? వద్దా? పండ్లు తినాలా? వద్దా? వ్యాయామం చెయ్యాలా? యోగా చెయ్యాలా? మందులు వేసుకోవాలా? వద్దా..? ఇలా ఎన్నెన్నో సందేహాలు గండుచీమల్లా మనసుని పీక్కుతింటూనే ఉంటాయి. అందుకే ఈ ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా అపోహలు, సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూ..

* మధుమేహం ఎక్కువగా లావుగా ఉన్న వారికే వస్తుందా?
వూబకాయులకు మధుమేహం రిస్కు ఎక్కువన్నది వాస్తవమేగానీ.. లావుగా ఉన్న వారిలో 30% మందికే మధుమేహం వస్తోంది, అలాగే మధుమేహం ఉన్న వారిలో 30% మందే లావుగా ఉంటున్నారు. కాబట్టి లావుగా ఉన్న ప్రతి ఒక్కరికీ మధుమేహం వస్తుందనీ, లావుగా లేని వారికి రాదనీ అనుకోవటానికి లేదు. మధుమేహ బాధితుల్లో 70% మంది లావుగా లేనివారే ఉంటున్నారన్నది ఇక్కడ గుర్తించాల్సిన అంశం.

* సన్నగా ఉన్న వారికి మధుమేహం వచ్చినా పెద్ద ఇబ్బందేం ఉండదా?
ఇది పూర్తిగా అపోహ. సన్నగా ఉన్నవారు మధుమేహం గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా రకాల మధుమేహం మందులు వీరికి పని చెయ్యవు. వీరిలో ఇన్సులిన్‌ నిరోధకత ఎక్కువ ఉంటుంది. ఇటీవలి వరకూ కూడా.. లావుగా ఉన్నవారికి, ఒంట్లో కొవ్వు ఎక్కువ ఉన్న వారికే నిరోధకత ఎక్కువ అనుకునే వారు. లావుగా ఉండే వారిలో కొవ్వుకు సంబంధించిన నిరోధకత ఎక్కువగా ఉంటే సన్నగా ఉండే వారిలో కండరాల్లో, కాలేయంలో నిరోధకత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా భారతీయ సంతతి వారు సన్నగా ఉంటారు, ఒంట్లో పెద్దగా కొవ్వు ఉండదు.. అయినా వీరిలో ఇన్సులిన్‌ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరికి ఇన్సులిన్‌ కూడా చాలా ఎక్కువ మోతాదుల్లో ఇవ్వాల్సి వస్తుంటుంది.

తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే పిల్లలకూ వస్తుందా?
మధుమేహం వంశపారంపర్య వ్యాధి కాదు. మధుమేహం జన్యుపరంగా వస్తుందని చెప్పటానికి ఇప్పటి వరకూ ఎటువంటి జన్యువులనూ కనుక్కోలేదు. ఇది కొన్ని వందల జన్యువులకు సంబంధించిన సమస్య. కాబట్టి దీన్ని వంశపారంపర్యం అని చెప్పేందుకు ఏ ఆధారమూ లేదు. ఒక తరంలో వస్తే తర్వాతి తరానికి వస్తుందని చెప్పలేం, తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తుందనీ, అలాగే తల్లిదండ్రులకు లేకపోతే పిల్లలకు రాదనీ చెప్పలేం. కాకపోతే కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనబడటమనేది మాత్రం గుర్తించాల్సిన అంశం.

గర్భిణికి మధుమేహం వస్తే పుట్టే పిల్లలకు కూడా వస్తుందా?
గర్భిణి మధుమేహం బిడ్డకు వచ్చే అవకాశం ఉండదు. కాన్పు కాగానే తల్లికి కూడా మధుమేహం తగ్గిపోతుందిగానీ.. ఆమెకు తిరిగి ఐదేళ్లలో మధుమేహం వచ్చే అవకాశాలు 50% వరకూ ఉంటాయి.

మధుమేహాన్ని మందుల అవసరం లేకుండా పూర్తి ఆహారంతోనే నియంత్రించుకోవచ్చా?
ఇది పెద్ద అపోహ. మధుమేహ బాధితులకు ఆహారపరమైన జాగ్రత్తలు తప్పనిసరి. అయితే దాన్ని పూర్తిగా ఆహారం, వ్యాయామాలతోనే నియంత్రణలో పెట్టుకోవటం కష్టం. ఈ జీవనశైలి జాగ్రత్తలతో ఎవరికీ ఏడాదికి మించి మధుమేహం నియంత్రణలో ఉండటం లేదని అధ్యయనాల్లో తేలింది. అలాగే గతంలో మధుమేహం వచ్చిందని తెలిగానే మూడు నెలల పాటు ఆహారం, వ్యాయామం వంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి, వాటితో నియంత్రణలోకి రాకపోతే అప్పుడు మందులు మొదలుపెట్టేవారు. కానీ మధుమేహం వచ్చిందని గుర్తించిన మొదటి రోజు నుంచే మందులు వాడాలన్నది ప్రస్తుత అవగాహన.

చిన్న వయసులో మధుమేహం వస్తే ఇన్సులిన్‌ ఇవ్వాల్సిందేనా?
15 ఏళ్ల వయసు లోపు మధుమేహం వచ్చిన దాదాపు అందరికీ ఇన్సులిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అదే 15-25 ఏళ్ల లోపువారికి మధుమేహం వస్తే- అందరికీ ఇన్సులిన్‌ అవసరం ఉండదు. వీరికి 1. సి పెప్త్టెడ్‌ 2. గ్యాడ్‌ యాంటీబోడీ 3. ఇన్సులిన్‌ యాంటీబోడీ 4. ఐలెట్‌సెల్‌ యాంటీ బోడీ- అనే నాలుగు రకాల పరీక్షలూ చేసి వీటి ఆధారంగా ఇన్సులిన్‌ ఇవ్వాలా? అక్కర్లేదా? అన్నది నిర్ధారిస్తారు. కాబట్టి చిన్నపిల్లల్లో మధుమేహం వచ్చిన అందరికీ ఇన్సులిన్‌ ఇవ్వాల్సి వస్తుందన్నది అపోహే.

పెద్దల్లో మధుమేహాన్ని పూర్తిగా మాత్రలతోనే నియంత్రిచుకోవచ్చా?
ఇదీ అపోహే. ఒకప్పుడు 30 ఏళ్లలోపు వారికి వచ్చిన మధుమేహాన్ని టైప్‌-1 అనీ, దానికి ఇన్సులిన్‌ తప్పదనీ; అలాగే 30 ఏళ్లు దాటిన తర్వాత వచ్చేది టైప్‌-2 అనీ, దీనికి ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించేవారు. కానీ ఇది మారిపోయింది. పిల్లల్లో ఇన్సులిన్‌ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. అలాగే పెద్దల్లో అందరూ మధుమేహాన్ని పూర్తిగా మాత్రలతోనే నియంత్రణ చేసుకోగలరన్నదీ అపోహే. మఖ్యంగా సన్నగా, బరువు తక్కువగా, బీఎంఐ 19 కంటే తక్కువ ఉన్నవారికి.. 30 ఏళ్ల తర్వాత మధుమేహం వచ్చినా కూడా జీవితాంతం వారు ఇన్సులినే తీసుకోవాలి. వీరు మాత్రల మీద ఆధారపడకూడదు. కాబట్టి 30 ఏళ్లు దాటిన అందరికీ మాత్రలు పనిచేస్తాయన్నది అపోహే.

ఒకసారి ఇన్సులిన్‌ మొదలుపెడితే ఇక జీవితాంతం ఇన్సులిన్‌ తప్పదా?
ఇది పూర్తి అపోహ. ఎందుకంటే శరీరం ఇన్సులిన్‌కు అలవాటు పడటమన్నదేమీ ఉండదు. వైద్యపరంగా కొందరు తాత్కాలికంగా, కొందరు శాశ్వతంగా ఇన్సులిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. పరగడుపున రక్త పరీక్షలో షుగర్‌ 250 కన్నా ఎక్కువున్నా, ఆహారం తిన్న రెండు గంటల తర్వాత పరీక్షలో 500 కన్నా ఎక్కువున్నా, మూడు నెలల సగటును చెప్పే 'హెచ్‌బీ ఏ1సీ' 10% కంటే ఎక్కువున్నా, ట్రైగ్లిజరైడ్లు 600 కన్నా ఎక్కువున్నా.. వీరికి తాత్కాలికంగా 3 నెల్లపాటు మాత్రమే ఇన్సులిన్‌ ఇస్తారు. తర్వాత క్రమేపీ మాత్రలకు మారిపోవచ్చు. వీరు శాశ్వతంగా ఇన్సులిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక- మూత్రంలో మైక్రోఆల్బుమిన్‌ 30 కంటే ఎక్కువున్నా, ఈసీజీలో గుండె సంబంధ సమస్యలున్నాయని అనుమానం వ్యక్తమైనా, ఛాతీ ఎక్స్‌రేలో టీబీ లక్షణాలు కనబడినా, కంటి రెటీనా పొర మీద రక్తనాళాలు దెబ్బతింటాయేమోనన్న అనుమానంగా ఉన్నా... వీరంతా జీవితాంతం శాశ్వతంగా ఇన్సులిన్‌ తీసుకోవటం తప్పనిసరి. అలాగే ఆపరేషన్‌ సమయంలో మధుమేహ నియంత్రణకు ఇన్సులిన్‌కు మారుస్తారు. ఆపరేషన్‌ తర్వాత.. అంతకు ముందులాగే ఆహారం తీసుకుంటూ, అంతకు ముందులాగే అన్ని పనులూ చేసుకుంటూ.. శరీరం మీద ఎక్కడా గాయాలు, చీము లేకుండా, ఒంట్లో కృత్రిమ రాడ్లు, స్క్రూల వంటివేమీ లేకపోతే.. వీరు తిరిగి మాత్రలకు మారిపోవచ్చు. కాబట్టి ఒకసారి ఇన్సులిన్‌ మొదలుపెడితే ఎప్పుడూ దాన్నే వాడాల్సి వస్తుందన్నది అపోహ.

మధుమేహానికి కొన్నేళ్ల పాటు చికిత్స తీసుకున్న తర్వాత అది పూర్తిగా నయమైపోతుందా?
మధుమేహం జీవితాంతం ఉండే సమస్య. దానికి చికిత్స కూడా జీవితాంతం తీసుకోవాల్సిందే. ఒకవేళ కొన్నేళ్లుగా మధుమేహం ఉండి, ఇప్పుడు ఏ చికిత్సా తీసుకోకుండానే అది కనబడటం లేదంటే వెంటనే కాలేయమో, మూత్రపిండాలో దెబ్బతింటున్నాయని అనుమానించటం అవసరం. పదేళ్లకంటే ఎక్కువకాలం మధుమేహానికి చికిత్స తీసుకుంటూ మీకు ఇప్పుడు రక్తంలో గ్లూకోజు ఏ చికిత్సా అవసరం లేకుండా నార్మల్‌ అయినట్లయితే మధుమేహం తగ్గిపోయినట్టు కాదు. మీకు శరీరంలో లివర్‌, కిడ్నీల్లో తయారవ్వాల్సిన గ్లూకోజు తయారవ్వటం లేదని అర్థం. కాబట్టి దీన్ని గురించి తప్పనిసరిగా పట్టించుకోవాలి.

కాఫీ, టీల్లో పంచదార వేసుకోవటం ప్రమాదకరమా?
కాఫీ, టీలు ఎక్కువగా తాగేవారు అందులో చక్కెర వేసుకోవటం తగ్గించుకుంటే మంచిది. రోజుకి ఒకట్రెండు కప్పులు తాగేవారైతే చక్కెర గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మధుమేహులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది చక్కెర కంటే కూడా నూనె, నెయ్యి, కొవ్వులు మరింత ఎక్కువ శక్తినిస్తాయి. వాటిని బాగా తగ్గించుకోవటం అవసరం.

మధుమేహ నియంత్రణ కోసం ప్రత్యేకంగా 'డైటింగ్‌' అవసరమా?
మధుమేహం కోసమంటూ ప్రత్యేకంగా ఎటువంటి ఆహారమూ, డైటింగులూ ఉండవు. మనకు ఉన్నదల్లా మంచి ఆహారం, చెడ్డ ఆహారం.. రెండే! మంచి ఆహారం అందరికీ మంచే. చెడ్డ ఆహారం విషయంలో మధుమేహులతో సహా అందరూ జాగ్రత్త పడాల్సిందే. ఆరోగ్యంగా ఉండాలనుకునే అందరూ తీపి, కొవ్వు తగ్గించాల్సిందే. కూరగాయలు, ముడిధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం అందరికీ మంచిదే. కాబట్టి మధుమేహం కోసం అంటూ కొన్ని పదార్థాలు మానెయ్యటం, కొన్ని ఎక్కువగా తినటం, ప్రత్యేకంగా డైటింగ్‌లేమీ ఉండవు.

నిత్యం వ్యాయామం, ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ మధుమేహం రాకుండా నివారించుకోవచ్చా?
జీవనశైలిని మార్చుకోవటం ద్వారా 50% వరకూ మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. లేదంటే అది దరిజేరకుండా చాలాకాలం వాయిదా వేసుకోవచ్చు. మధుమేహం రాకుండా చూసుకోవటానికే కాదు, ఇతరత్రా ప్రమాదకర వ్యాధులు దరిజేరకుండా ఉండేందుకు కూడా వ్యాయామం, ఆహారపరమైన జాగ్రత్తలు అవసరం.

యోగాతో మధుమేహం తగ్గించుకోవచ్చా?
మధుమేహం రావటానికి ఆహారం, వ్యాయామం, జీన్స్‌ వంటివన్నీ కూడా దోహదం చేసేది 30 శాతానికే! మిగతా 70 శాతం మూలకారణం మనం ఎదుర్కొనే 'సామాజిక మానసిక ఒత్తిడి' (సైకో సోషల్‌ స్ట్రెస్‌). కాబట్టి ఆ ఒత్తిడిని తగ్గించుకోవటం అవసరం. అందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో యోగా కూడా ఒకటి. యోగాలో ప్రాణాయామం, ఆసనాలు, సూర్యనమస్కారాలు, కపాల భస్త్రికలు.. ఇలా చాలా రకాలున్నాయి. ఏ రకం 'యోగా' అయినా మన శరీరాన్ని కష్టపెట్టకూడదు. కొందరు కొన్నికొన్ని ఆసనాలు వేస్తే మన పాంక్రియాస్‌ గ్రంథి ప్రేరేపితమై వెంటనే ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుందని చెబుతుంటారుగానీ ఇప్పటి వరకూ ఎటువంటి ఆసనాలు, యోగాల వల్ల క్లోమగ్రంథి స్టిమ్యులేట్‌ అవుతుందని చెప్పేందుకు ఎటువంటి నిరూపణలూ లేవు. కాబట్టి మధుమేహం తగ్గటానికి ప్రత్యేకమైన ఒక ఆసనమంటూ ఏదీ లేదు. కాకపోతే యోగాతో ఒత్తిడి కారణంగా వచ్చే దుష్ప్రభావాలు తగ్గుతాయి. అలాగే యోగా చేస్తున్నామనిచెప్పి నడక వంటి శారీరక వ్యాయామాలను మానెయ్యటం మంచిది కాదు. దేనికదే ప్రాధాన్యమున్న అంశాలివి.

మధుమేహులు వరి అన్నం మానేసి గోధుమ వంటివాటికి మారటం మంచిదా?
కుటుంబపరంగా, అలవాటుగా వస్తున్న ఆహార పద్ధతులను మధుమేహ నియంత్రణ కోసమంటూ ప్రత్యేకంగా మార్చుకోవాల్సిన పని లేదు. బియ్యం, గోధుమ, జొన్న, రాగులు, ఓట్స్‌ అన్నింటిలోనూ పిండిపదార్థం (గ్లూకోజు) 70-80 శాతం ఉంటుంది. కాబట్టి అంతిమంగా వీటితో అందే ఫలితం దాదాపు ఒకే తీరులో ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా వరి మానేసి చపాతీలు, పుల్కాలకు మారక్కర్లేదు. పైగా జీర్ణశక్తి సరిగాలేనివారు, పళ్లు సరిగా లేని వృద్ధులు.. ఇలా అలవాట్లు మార్చుకోవటం మంచిది కూడా కాదు. కాకపోతే ఎవరైనా ముడి ధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది కాబట్టి వీలైతే, శరీరం సహకరిస్తే వాటికి మారచ్చు.

మధుమేహులు స్వీట్లు, తీపిపదార్థాలు మానేసి కారం పదార్థాలు నిశ్చితంగా తినొచ్చా?
మధుమేహుల్లో చాలామంది తీపి పదార్థాలు తగ్గిస్తారుగానీ.. బూందీ, మిక్సర్‌ వంటి ఖారా పదార్థాలతో ఏ ఇబ్బందీ ఉండదని వాటిని ఎక్కువ తింటుంటారు. ఇది సరి కాదు. తీపి పదార్థాల్లో చక్కెరతో పాటు కొవ్వు ఉన్నట్టుగానే.. కారప్పూస, బూందీ వంటి ఖారాల్లోనూ కొవ్వు పదార్థం ఉంటుంది. మన చేతికి నేరుగా తగలకపోయినా.. పకోడి, సమోసా, మిక్సర్‌ వంటి వాటిల్లో 30% వరకూ కొవ్వు ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి బెల్లం, చక్కెరతో చేసినవైనా, కారంగా ఉండేవైనా సరే.. వీటిల్లోని కొవ్వు పదార్థమే ఎక్కువ అనర్థదాయకమని మరవరాదు. మధుమేహులు పూర్తిగా తీపి పదార్థాలను మానెయ్యాల్సిన అవసరం లేదు. అలాగని కారంగా ఉండేవి ఎక్కువగా తీసుకోవాలని చూడటమూ మంచిది కాదు. దేన్నైనా మితంగా తీసుకోవాలి.

మధుమేహులు పండ్లు తినొచ్చా?
చక్కటి ఆరోగ్యానికి ఎవరైనా పండ్లు తినటం చాలా అవసరం. మధుమేహులు పండ్లలో చక్కెర చాల ఎక్కువగా ఉంటుందని భావిస్తూ వాటిని పూర్తిగా మానేయాల్సిన పని లేదు. అనాస, సీతాఫలం వంటి పండ్లన్నింటిలోనూ కూడా పిండి (తీపి) పదార్థం 10 శాతమే ఉంటుంది. నోటికి చాలా తీయగా అనిపించే ద్రాక్షపండ్లలో కూడా ఇది 13 శాతమే ఉంటుంది. పండ్లు అన్నింటిలోనూ కూడా నీరే అధికంగా ఉంటుంది. కాబట్టి పండ్లు తినటం వల్ల శరీరానికి గ్లూకోజు అంత ఎక్కువగా ఏమీ అందదు. అంటే నోటికి తీయగా అనిపించినా వీటిద్వారా శరీరానికి అందే చక్కెర తక్కువే అన్నమాట. పైగా పండ్లతో క్యాన్సర్‌ నివారణ వంటి ఇతరత్రా ప్రయోజనాలు చాలా ఉన్నాయి కాబట్టి మితంగా, తరచుగా, కాలానుగణంగా వచ్చే పండ్లను తీసుకోవటం మంచిది. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండే వాళ్లు మాత్రం అరటిపండ్లు, ఆపిల్‌, మామిడి పండ్ల వంటివి తినటంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిల్లో పిండి పదార్థం ఎక్కువ. ఖర్జూరం, అంజూరా, ఎండుద్రాక్ష వంటి వాటిల్లో నీరు అస్సలుండదు కాబట్టి వీటిలో 80 శాతం తీపి పదార్థమే ఉంటుంది. పైగా ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా. కాబట్టి వీటిని మధుమేహులు  పూర్తిగా మానెయ్యటమే మేలు. జీడిపప్పు, వేరుశెనగపప్పుల వంటి పలుకుగింజల్లో కొవ్వు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి వీటినీ బాగా మితంగా తినాలి.

మధుమేహం ఉన్నవారు పెళ్లి చేసుకుంటే ఇబ్బందులుంటాయా?
ఇది వట్టి అపోహే. మధుమేహం ఉన్న స్త్రీపురుషులు ఎలాంటి అనుమానాలూ లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. మధుమేహం వల్ల సంతానావకాశాలేమీ తగ్గవు. దాంపత్య జీవితంలో ఇబ్బందేమీ ఉండదు. మధుమేహం నియంత్రణలో లేకపోతే జననాంగ ఇన్ఫెక్షన్ల వంటివి రావచ్చుగానీ మధుమేహ నియంత్రణతో వాటిని తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో మాత్రం స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నియంత్రణ లేకపోతే పురుషుల్లో 'ట్యుబర్‌క్యులోసిస్‌ ఎపిడిడిమైటిస్‌' వంటివాటి మూలంగా సంతాన రాహిత్యం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి.

మధుమేహులలో లైంగిక సామర్థ్య సమస్యలు ఎక్కువా?
మధుమేహం కారణంగా సంతాన రాహిత్యమైతే రాదు. ఇక మధుమేహం దీర్ఘకాలం నియంత్రణలో లేనివారికి అంగస్తంభన సమస్యల వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా వీటి బారి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్‌ ఇంజెక్లన్లు తీసుకునే వారికి అంగస్తంభన సమస్యల వంటివి వచ్చే అవకాశాలు మరింత తక్కువ. మెట్‌ఫార్మిన్‌, సల్ఫనైల్‌ యూరియా వంటి మాత్రలు రక్తంలో గ్లూకోజును తగ్గించేందుకు తోడ్పడతాయి గానీ అంగస్తంభన విషయంలో పెద్దగా పనిచేయవు.

మధుమేహుల కోసం ప్రత్యేకంగా చేసిన స్వీట్లు మంచివేనా?
ప్రత్యేకంగా మధుమేహుల కోసమంటూ కృత్రిమ తీపి పదార్ధాలతో చేసిన స్వీట్లు, బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు బాగా మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో తీపి కోసం వాడే శాఖరీన్‌, సుక్రలోజ్‌ వంటివి మంచివి కావు. ముఖ్యంగా సుక్రలోజ్‌ వల్ల మధుమేహం కారణంగా వచ్చే దుష్ప్రభావాలన్నీ మరింత త్వరగా, తీవ్రంగా వస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. రెండోది- వీటిలో తీపి కోసమైతే కృత్రిమ పదార్థాలు వాడుతున్నారుగానీ నూనె, నెయ్యి, కోవా వంటి కొవ్వు పదార్థాలు మాత్రం సాధారణ స్వీట్లలో మాదిరే ఎక్కువగానే ఉంటున్నాయి. అవి మరింత ప్రమాదకరం. కాబట్టి ఈ స్వీట్లతో ఎటువంటి నష్టం ఉండదని, ఇవి తమకోసమే ప్రత్యేకంగా చేశారనుకుని వీటిని ఎక్కువగా తింటే నష్టమూ చాలా ఎక్కువగానే జరుగుతుందని గుర్తించాలి.

మధుమేహం ఉన్నవారు వ్యాయామం ఎక్కువగా చేస్తే రక్తంలో గ్లూకోజు నియంత్రణలోకి వస్తుందా?
ఇది అపోహ. వ్యాయామం అన్నది షుగర్‌ను తగ్గించే ప్రక్రియ కాదు, వ్యాయమం చేస్తే అది తగ్గుతుందనుకోకూడదు. కానీ మధుమేహం కారణంగా దీర్ఘకాలంలో ముంచుకొచ్చే ప్రమాదకరమైన గుండె జబ్బు, మెదడుకు సంబంధించి పక్షవాతం, కాళ్ల స్పర్శలు మారిపోవటం వంటి రకరకాల తీవ్రస్థాయి సమస్యలను నివారించుకోవటానికి వ్యాయామం చాలా చాలా అవసరం. అది బాగా ఉపయోగపడుతుంది.


మధుమేహం ఉన్నవారు కేవలం రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించుకుంటుంటే సరిపోతుందా?

మధుమేహులు రక్తంలో గ్లూకోజు మోతాదును మాత్రమే కాదు... మూణ్నెల్లకు ఒకసారి హెచ్‌బీఏ1సీ, ఆర్నెల్లకు ఒకసారి కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, మూత్రంలో మైక్రో ఆల్బుమిన్‌, అలాగే యేడాదికి ఒకసారి ఈసీజీ, ఎక్స్‌రే, కంటి పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఒకవేళ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు అధికంగా ఉన్నట్లయితే కేవలం ఆహార నియమాలతోనే కాకుండా.. వాటిని మందులతో తగ్గించుకునే ప్రయత్నం చేయటం అవసరం. అలా మందులు వాడుతూ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు తగ్గుతున్నాయో లేదో తెలుసుకోవటానికి నెలకోసారి వాటికి సంబంధించిన రక్తపరీక్షలూ చేయించుకుని చూసుకుంటూ ఉండాలి.

రక్తంలో చక్కెర కొద్దిగా ఎక్కువుంటే ఏం ఫర్వాలేదా?
రక్తంలో గ్లూకోజు మోతాదు పరగడుపున 100 నుంచి 125 లోపు.. తిన్న తర్వాత 140-200 వరకు ఉండటాన్ని 'ప్రి క్లినికల్‌ డయాబెటిస్‌' అంటారు. ఇది ముందస్తు మధుమేహ దశ. వీరిలో 50% మందికి ఐదేళ్లలో మధుమేహం రావొచ్చు. అయితే.. ఇటీవల జరిగిన పరిశోధనలో ఇలాంటి ముందస్తు దశలో ఉన్నవారికీ మధుమేహుల్లో తలెత్తే సమస్యలు కనిపిస్తున్నాయని బయటపడింది. అందుకే మున్ముందు రక్తంలో గ్లూకోజు fasting 100కు మించితే మధుమేహంగానే గుర్తించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధుమేహం ముందస్తు దశలోని వారు రక్తంలో గ్లూకోజును నియంత్రించుకునేందుకు మందులు వేసుకోకపోయినా.. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటివి అధికంగా ఉంటే మాత్రం వాటిని తగ్గించుకునేందుకు తప్పకుండా మందులు వాడాలి. లేదంటే మధుమేహుల్లో మాదిరిగానే వీరిలోనూ అన్ని సమస్యలు దాడి చేసే ప్రమాదం ఉంది.

నిన్నామొన్న పండ్లు, స్వీట్లు తిని ఇవాళ రక్తపరీక్ష చేయించుకుంటే వాటి ప్రభావం ఈ రోజు షుగరు పరీక్షల మీదా ఉంటుందా?
ఎప్పుడైనా ఒకసారి ప్రసాదం, ఆహారంలో స్వీటు, కొబ్బరి, కేక్‌ వంటివి తింటే రక్తంలో సుగర్‌ పెరుగుతుంది, దాని గురించి కంగారు పడాల్సిన పనిలేదు. ఆ రోజు రక్తపరీక్ష చేయించుకోకూడదు. ఏదో రెండు మూడు రోజుల క్రితం తిన్న ఆహారం వల్ల ఇవాళ రక్తంలో షుగర్‌ పెరిగి ఉండటమన్నది ఉండదు. మనం తిన్న ఆహారం ప్రభావం రక్తంలో ఐదు గంటలు మాత్రమే ఉంటుంది. ఆ ఆహారం ప్రభావం ఐదు గంటల్లో అయిపోతుంది. కాబట్టి మనం తీసుకున్న ఆహారానికీ, రక్తంలో షుగర్‌కూ సంబంధం ఐదు గంటలే. కాబట్టి మొన్న ఎప్పుడో తిన్న ఆహారానికి ఇవాళ షుగర్‌ పెరుగుతుందని అనుకోకూడదు. సగటున మనకు గత మూడునెలల కాలంలో షుగర్‌ నియంత్రణలో ఉందా? లేదా? అన్నది కచ్చితంగా చెప్పేది.. మూడు నెలలకు ఒకసారి చేసే హెచ్‌బీఏ1సీ పరీక్ష. అందుకే నెలనెలా రక్తపరీక్షతో పాటు మూడు నెలలకు ఒకసారి చేయించుకునే ఈ పరీక్షకు కూడా అంతటి ప్రాధాన్యం ఉంది.

మధుమేహులు కాఫీ, టీల్లో పంచదార వేసుకోవటం ప్రమాదకరమా?
కాఫీ, టీలు మరీ ఎక్కువగా తాగేవారు అందులో చక్కెర వేసుకోవటం తగ్గించుకుంటే మంచిది. రోజుకి కేవలం ఒకట్రెండు కప్పులు తాగేవారైతే చక్కెర గురించి మరీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మధుమేహులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది చక్కెర కంటే కూడా నూనె, నెయ్యి, కొవ్వులు మరిన్ని ఎక్కువ క్యాలరీలను, శక్తినిస్తాయి. వాటిని బాగా తగ్గించుకోవటం అవసరం. స్వీట్లలో చక్కెరతో పాటు కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.

గ్లూకోజును తగ్గించే నీరు , water drinking reduce blood glucose

నీళ్లు ఎక్కువగా తాగటం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఈ అలవాటు.. రక్తంలో గ్లూకోజు మోతాదు పెరగకుండా (హైపర్‌గ్త్లెసీమియా) కూడా కాపాడుతుందని పరిశోధకులు గుర్తించారు. రోజుకి అరలీటరు కన్నా తక్కువ నీరు తాగేవారితో పోలిస్తే.. లీటరు కన్నా ఎక్కువ నీళ్లు తాగేవారిలో హైపర్‌గ్త్లెసీమియా ఏర్పడే అవకాశం 21% తక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అయితే ఇలా ఎందుకు జరగుతుందోననేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. అమెరికన్‌ డయాబెటీస్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో ఈ పరిశోధన ఫలితాలను వెల్లడించారు. మధుమేహానికి, శరీరంలో నీటి మోతాదును నియత్రించే హార్మోన్‌ ''వాసోప్రెసిన్‌''కు సంబంధం ఉన్న విషయాన్ని ఈ అధ్యయనం మరింత బలపరిచింది.
-----------------------------------------------------------------------------
మధుమేహులకు 'తీపి' కబురు---సూదిమందుకు చెల్లు... మిఠాయిలూ తినొచ్చు---'ఐలెట్‌' కణాల మార్పిడి ద్వారా కొత్త చికిత్స--ఏషియన్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యుల విజయం--ఆసియాలో మొట్టమొదటి చికిత్సా కేంద్రం--డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి వెల్లడి
మధుమేహ రోగులకు శుభవార్త... వైద్యరంగంలో ఒక కొత్త శకం... అంతర్జాతీయంగా మధుమేహ చికిత్సల్లో అద్భుత విజయాన్ని మన రాష్ట్ర వైద్యులు సాధించారు. కొత్త విధానంలో చికిత్స చేయించుకుంటే.. మధుమేహం ఉన్నవారు ఎలాంటి మందులు వాడే పని ఉండదు... మిగిలిన వారిలాగా స్వీట్లు కూడా తింటూ హాయిగా ఉండవచ్చు. హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి అధ్యర్యంలో డాక్టర్‌ జి.వి.రావు, డాక్టర్‌ శశికళ తదితరులు ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. వారం రోజుల్లో ఈ విధానంలో రోగులకు చికిత్సలు కూడా ప్రారంభిస్తున్నారు. విదేశాల్లో ప్రస్తుతం ఇలాంటి చికిత్సలు జరుగుతున్నా, వాటికి భారీగా ఖర్చవుతోంది. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని, మనవాళ్లు ఒక ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేశారు. 'ఐలెట్‌' కణాల మార్పిడి ద్వారా జరిగే ఈ తరహా చికిత్స అంతర్జాతీయస్థాయిలో ఇదే మొదటిదని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి గురువారం పాత్రికేయుల సమావేశంలో ప్రకటించారు. విదేశాల్లో ఐలెట్‌ కణాల మార్పిడి జరుగుతున్న విధానాలతో పోలిస్తే, ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన విధానానికి అయ్యే ఖర్చు చాలా తక్కువని చెప్పారు. దీనికోసం ఆసియాలో తొలిసారిగా హైదరాబాద్‌లోని ఏషియన్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆస్పత్రిలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు. దీనికి సంబంధించి ఐలెట్‌ కణాల మార్పిడికి సంబంధించి దేశ, విదేశాలకు చెందిన 250 మంది నిపుణులతో ఈనెల 14, 15 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆధునిక విధానాలపై చర్చించి, పరిశోధనలను ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. పందుల నుంచి కణాలను తీసుకుని కూడా మనిషికి మార్పిడి చేసే విధానాలపై అమెరికాలో పరిశోధనలు జరుగుతున్నాయని అంతర్జాతీయ క్లోమగ్రంధి సంఘం అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ సలౌజా చెప్పారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న అంతర్జాతీయ వైద్యులు డాక్టర్‌ డేవిడ్‌ కూపర్‌, డాక్టర్‌ మీలాన్‌ బెలిన్‌, డాక్టర్‌ పియాటర్‌లు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి 'న్యూస్‌టుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు, ఆయన మాటల్లోనే...
క్లోమంలోని ఐలెట్‌ కణాల్లోని బీటా కణాల నుంచి ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతుంది. బీటా కణాలు సరిగా పని చేయకపోవడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గితే మధుమేహ వ్యాధిగా గుర్తిస్తారు. శరీరంలో మిగిలిన అవయవాలు పని చేయకపోతే, అవయవ మార్పిడి చేసుకునే సదుపాయం ఉంది. ఆ విధంగా క్లోమం మార్పిడి చేయడానికి కుదరడం లేదు. ఇది చాలా సున్నితమైన భాగం. ఇందులోని ప్రభావంతమైన ఎంజైముల గాఢత చాలా ఎక్కువ. ఒక చుక్క ఎంజైము శరీరంలో ఎక్కడైనా పడితే, అది అక్కడి కండరాన్ని తినేస్తుంది. క్లోమాన్ని బయటకు తీసి ఉంచితే, కొద్దిసేపట్లోనే అందులోని ఎంజైములు దాన్ని కరిగించేస్తాయి (అటాలసిస్‌). అందుకే క్లోమాన్ని మార్పిడి చేయడం కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఈ కారణంగానే మధుమేహానికి మందులు, ఇన్సులిన్‌ సూదిమందు ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో టైప్‌ 1, టైప్‌ 2, టైప్‌ 3 అని మూడు రకాలున్నాయి.

* టైప్‌ 1: పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. క్లోమంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి చాలా తక్కువ.

* టైప్‌ 2: సాధారణంగా 30 సం|| పైబడిన వారిలో వూబకాయం, వంశానుగతంగా ఎక్కువ మందిలో వస్తోంది. వీరిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి జరుగుతున్నా, ఇది అవసరమైన మేరకు అందకుండా శరీరం అడ్డుకుంటూ ఉంటుంది.

* టైప్‌ 3: వివిధ కారణాల వల్ల క్లోమం దెబ్బతినడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి ఉండదు.

వీటిలో టైప్‌ 1, టైప్‌ 3 లకు ప్రస్తుతం ఇన్సులిన్‌ సూదిమందు వాడుతున్నారు. వీరికి క్లోమంలోని ఐలెట్‌ కణాలను నేరుగా కాలేయంలోకి మార్పిడి చేసి విదేశాల్లో చికిత్సలు చేస్తున్నారు. అవి పరిశోధన దశల్లో ఉన్నాయి. ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. అమెరికాలోని మిన్నెసొటా విశ్వవిద్యాలయంలో దీనిపై పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని ఏషియన్‌ ఇనిసిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీలోని వైద్యులు, ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న ఏషియన్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌లు జాతీయ పౌష్ఠికాహార సంస్థ, డిపార్టుమెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, భారతీయ పరిశోధన మండలి సహకారంతో మూడేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో 'థెరసైట్‌' (ఒక చిన్న క్యాప్య్సూల్‌ లాంటి దాంట్లో)లో ఐలెట్‌ కణాలను కోతుల్లో పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయి. ఆ తరవాత దీన్ని ఇన్సులిన్‌ సూది మందు మాత్రమే వాడుతున్న టైప్‌ 1, టైప్‌ 3 మధుమేహ రోగులకు ఇచ్చి చూడగా అద్భుతంగా పనిచేస్తోంది. టైప్‌ 2 రోగుల విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదికి వీరికీ ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

'ఐలెట్‌' కణాలు మార్పిడి
థెరసైట్‌ (రెండు అంగుళాల పొడవు, అర్థ అంగుళం వెడల్పు ఉండే ఒక చిన్న క్యాప్య్సూల్‌)లో 'ఐలెట్‌' కణాలు మార్పిడి చేసి శరీరంలో అమరుస్తారు. అందులో నుంచి ఐలెట్‌ కణాలు శరీరానికి కావలసిన ఇన్సులిన్‌ను అందిస్తాయి. ఒకసారి ఐలెట్‌ కణాలు మార్పిడి చేయించుకుంటే అయిదారు సంవత్సరాలకు పైగా పనిచేస్తాయి. ఆ తరవాత ఐలెట్‌ కణాలు తగ్గితే మళ్లీ ఎక్కించుకోవచ్చు. భవిష్యత్తులో దీని కాలపరిమితిని పెంచడంపై అధ్యయనం చేస్తున్నాం. ప్రస్తుతం మధుమేహం ఉన్న వారి పాంక్రియాస్  నుంచి ప్రత్యేక పరికరం ద్వారా 'ఐలెట్‌' కణాలు సేకరించి, వాటిని శుద్ధిచేసి తిరిగి వారికే ఇస్తున్నాం. దీంతో పాటు ప్రమాదాల్లో బ్రెయిన్‌ డెడ్‌ కేసులు, ఇతర శస్త్రచికిత్సల్లో క్లోమం తొలగిస్తే, వాటి నుంచి ఐలెట్‌ కణాలు సేకరించి... మార్పిడి చేయడానికి అవకాశం ఉంది. ఒక క్లోమం నుంచి ముగ్గురికి ఐలెట్‌ కణాలు మార్పిడి చేయడానికి అవకాశం ఉంది.

ఎలా పని చేస్తుంది: 'ఐలెట్‌' కణాలతో కూడిన థైరసైట్‌ను మనిషికి ఎక్కడ అమర్చడానికి వీలుగా ఉంటే ఆ ప్రాంతానికి మాత్రమే మత్తు మందు ఇచ్చి, శరీరంలో అమరిస్తే చాలు... కొద్ది రోజుల్లోనే దీనిచుట్టూ రక్తకణాలు కవచంలాగా ఏర్పడతాయి. దీనివల్ల శరీరంలోని ద్రవాలు ఇందులోంచి వెళతాయి. కానీ బీటా కణాలు మాత్రం బయటకు రావు. అదే ఇందులోని ప్రత్యేకత. ప్రస్తుత అంచనాల ప్రకారం ఒకసారి ఐలెట్‌ కణాలు మార్పిడి చేసుకుంటే.. మధుమేహం ఉన్నవారు ఆరేడు సంవత్సరాలకు పైగా ఎలాంటి మందులు వాడకుండా హాయిగా ఉండవచ్చు. కొత్త విధానంలో ఐలెట్‌ కణాల మార్పిడి వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవు. రోగి నుంచి ఐలెట్‌ కణాలు తీయడానికి ఒక గంట, తిరిగి వాటిని మార్పిడి చేయడానికి 45 నిమిషాలు... మొత్తం రెండు గంటల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. ఆస్పత్రిలో మూడురోజులు ఉండాల్సి ఉంటుంది.

ఈ తరహా చికిత్సలు ఎక్కడ జరుగుతున్నాయి: ప్రపంచవ్యాప్తంగా అయిదు చోట్ల జరుగుతున్నాయి. అమెరికాలో మిన్నెసొటా, హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌; కెనడాలోని ఎండ్‌మెంటన్‌, బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లోని విశ్వవిద్యాలయ ఆస్పత్రుల్లో ఈ సదుపాయాలున్నాయి. భారత్‌-అమెరికా శాస్త్ర సాంకేతిక మార్పిడిలో భాగంగా ఆసియా ఖండంలో మొదటిసారిగా ఏషియన్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ 'ఐలెట్‌' కణాల మార్పిడి విధానాన్ని మరింతగా లోతుగా పరిశోధించి కొత్త విధానాన్ని అభివృద్ధి చేశాం. ప్రస్తుతం ఈ తరహా చికిత్సకు రూ. 2 లక్షల వరకు అవుతోంది. థెరసైట్‌ పరికరం ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో దేశీయంగా తయారు చేయడానికి ఒక అంగీకారానికి వచ్చాం. మరో సంవత్సరంలో దేశీయంగా ఉత్పత్తి జరుగుతుంది. అప్పుడు ఐలెట్‌ మార్పిడి ఖర్చును రూ. 50 వేలలో పూర్తి చేయగలమనే నమ్మకం ఉంది. ఈ ఖర్చును ఇంకా బాగా తగ్గించాలనేదే మా ఆశయం. లక్ష్యం.

త్వరలో మరో నాలుగు చికిత్సా కేంద్రాలు: ఏషియన్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఈ చికిత్సలు విస్తృతి పెరిగిన తరవాత భారతీయ వైద్యపరిశోధన మండలి, బయోటెక్నాలజీశాఖల సహకారంతో భవిష్యత్తులో చెన్నై, ముంబయి, కలకత్తా, ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థలో ఐలెట్‌ మార్పిడి చికిత్సా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.

ప్రధానాంశాలు:
* 2030 నాటికి భారతదేశం మధుమేహ వ్యాధిగ్రస్తులకు అంతర్జాతీయ రాజధానిగా మారిపోతుందని వైద్యనిపుణుల అంచనా. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 6.40 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.

* పరిశోధనల్లో కోతిలో థైరసైట్‌ ఉంచి ఒక ఏడాది తరవాత పరీక్షించగా అందులోని బీటా కణాలు దాదాపు రెట్టింపు అయ్యాయి.
* హైదరాబాద్‌ నగరంలో 16 శాతం మందిలో మధుమేహం ఉంది.
అమెరికాలో బోలెడంత ఖర్చు
అమెరికాలోని మినిసొటాలో టైప్‌ 1 మధుమేహం ఉన్న వారికి ఐలెట్‌ మార్పిడికి కోటి రూపాయలు, టైప్‌ 3 మధుమేహం వారికి ఐలెట్‌ మార్పిడి చేస్తే రూ.50 లక్షలు వరకు ఖర్చవుతోంది. హైదరాబాద్‌లో థైరసైట్‌ ద్వారా మార్పిడికి రూ. 2 లక్షల లోపు ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని ఇంకా తగ్గించడానికి చేస్తున్న పరిశోధనలు అద్భుతంగా ఉన్నాయి.
  • - డాక్టర్‌ బాలమురగన్‌--(అమెరికాలోని మినిసొటా విశ్వవిద్యాలయంలో ఐలెట్‌ మార్పిడి పరిశోధకులు)@Eenadu daily news paper

  • ========================================
Visit my website at _ Dr.Seshagirirao-MBBS

1 comment:

Your comment is very important to improve the Web blog.