Sunday, November 27, 2011

గ్రామాల్లో ఆరోగ్యం, Health in Villages(India)



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --గ్రామాల్లో ఆరోగ్యం, Health in Villages(India)-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • మనదేశంలో 60శాతం ప్రజలు పల్లెటూరి పరిసరాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నివసించేవారు వ్యవసాయంమీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిలో ఫాక్టరీల్లో కూడా పనిచేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యరీత్యా ఎలా నడుచుకోవాలనేది తెలిసుండాలి. ఎందుకంటే, వాతావరణ మార్పులు, మన ఆరోగ్యంమీద ప్రభావాన్ని చూపుతాయి కనుక.

పల్లెటూళ్లలో చెడు అలవాట్లు అంటే సారా, తాగుడు, గుట్కాలు తినడం, పాన్‌మసాలాలు తినడం ఎక్కువగానే కనిపిస్తుంది. అక్కడ చదువు తక్కువ, ధనార్జన తక్కువ. కానీ వ్యసనాలు ఎక్కువ. ధూమపానం, మత్తుపదార్థాలు విరివిగా దొరకడంవల్ల వాడకమూ ఎక్కువే. చదువు తక్కువ ఉన్నందువల్ల పరిసరాల అవగాహన తక్కువ. ఆరోగ్యంగా వుండాలంటే రోజూ ఉపయోగించే వాటిని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవాలి. గాలి, నీరు, ఆహారం, పురుగుమందుల వాడకంలో జాగ్రత్తలు, చేసే పనిలో, ఊళ్లో మంచి లేక అపాయాలు తెలిసుండాలి.

  • తాగే నీటిని గురించి: తాగే నీరు బావినుంచి గానీ, బోర్‌వెల్‌నుంచి గానీ లేక వేరే విధంగాగానీ లభిస్తోంది. అలా బైటినుండి వచ్చే నీటినుండి అందులో సూక్ష్మక్రిములు వుండొచ్చు.లేక వాటినుంచి వచ్చే కాలుష్యం తోడవవచ్చు. ఇక బావినీటిలో సూక్ష్మక్రిములు, పురుగుమందులు పొలాలనుంచి బావిలోకి చేరే ప్రమాదం వుంది. బైటి ప్రదేశాల్లో మలమూత్రాలు చేసినపుడు పరిసరాలలో ఉన్న జలాలు కలుషితమయ్యే అపాయం వుంది. వ్యవసాయంతో వుండే కలుషితాలు, పురుగుమందులు, నైట్రోజన్‌, ఫాస్ఫర్‌, సూక్ష్మక్రిములు ఇవన్నీ చేపలను చంపొచ్చు.ఊళ్లో వ్యక్తిగత శుభ్రత లోపించినపుడు పళ్లు పుచ్చిపోవడం ఎక్కువగా కనిపిస్తుంది పిల్లల్లో, పెద్దల్లో కూడా. పురుగుమందులు పొలంలో కొట్టినపుడు పిల్లలమీద ఎక్కువ ప్రభావం వుంటుంది. కళ్లు ఎర్రబడటం, దద్దుర్లు, కళ్లు తిరగడం, ఆయాసం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పురుగుమందులు చల్లేప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ మందులు పొలాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఎలుకలు, బొద్దింకలు చీమలు చంపడానికి ఉపయోగించే మందులు పిల్లలనుంచి దూరంగా ఉంచాలి. పొలంనుంచి తిరిగి వచ్చాక తమ బట్టలమీద, చెప్పులమీద పురుగుమందులు పొడి వుండే అవకాశం ఎక్కువ. అంటే ఆ మందులను అనుకోకుండానే ఇంటికి తీసుకొస్తున్నారు. అది అందరికీ నష్టమే. పురుగుమందులనుంచి ఎలా రక్షించుకోవాలో మన చేతిలో వుంది.

అవేంటంటే...
  • పొలంనుండి రాగానే చెప్పులు బాగా కడుక్కోవాలి.
  • వెంటనే స్నానంచేసి దుస్తులు మార్చుకోవాలి.
  • పొలంలో ధరించిన దుస్తులు విడిగా ఉతకాలి తప్ప అన్నింటిలోనూ కలపకూడదు.
  • ఆహారం తీసుకునేముందు శుభ్రంగా కాళ్లుచేతులు కడుక్కోవాలి. అలా కాకుండా ఆహారాన్ని ముందే ముట్టుకోకూడదు.
  • స్నానం చేయకుండానే పిల్లలను దగ్గరికి తీసుకోవడం, ఎత్తుకుని ముద్దుచేయడం కూడదు.

గ్రామాలలో వైద్యము - చికిత్స :
  • ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సిన వాటిలో అతి ప్రధానమైంది ఆరోగ్య భద్రత. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో బడ్జెట్ కేటాయింపులతోనే స్పష్టమౌతోంది. విదిల్చిన ఆ కొద్ది పాటిలో కనీసం 55 శాతం గ్రామీణ ప్రజల వైద్యసేవల కోసం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) కోసం కేటాయించాలి. ఆ మొత్తం సక్రమంగా ఖర్చయితే... కనీసం ఆ మేరకైనా మేలు కలుగుతుంది. అదీ నిరాశగానే మిగులుతోంది. 30 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా వాటినెవరూ పట్టించుకున్న దాఖలాల్లేవు.

తరచూ ప్రజల్ని పట్టిపీడించే వ్యాధుల్లో చాలా వాటికి మూల కారణాలు చాలా చిన్నవి. కొద్దిపాటి ముందు జాగ్రత్త వాటన్నింటినీ నివారించగలదు. పరిసరాల అపరిశుభ్రత, మురుగునీరు నిల్వ, చెత్తా చెదారం, తాగే నీటిని క్లోరినేషన్ , కాచి చల్లార్చిన నీటిని తీసుకోకపోవడం వంటి వాటిపై ప్రజల్ని చైతన్యపరిచే నాథుడు లేడు. వచ్చాక... ఏ పీహెచ్‌సీ, ఉప కేంద్రాలకు వెళ్లి చికిత్స చేయించుకుందామంటే అక్కడ సిబ్బంది, వైద్యులు సక్రమంగా విధులకు రారు. వచ్చినా... రోగులను పరీక్షించి ఇచ్చేది రెండు గోళీలే! అందుకే తల తాకట్టు పెట్టైనా ప్రైవేట్ వైద్యుల దగ్గరకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోవాల్సిన దుస్థితి. ప్రజారోగ్యం కోసం బడ్జెట్‌లో ఏటా వేల కోట్ల రూపాయల కేటాయింపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య విధాన ఆసుపత్రులు, సంచార వైద్యశాలలు... ఇవన్నీ ప్రభుత్వ ప్రకటనల్లో అద్భుతంగా కనిపిస్తాయి. వాస్తవానికి అందులో పదోవంతు కూడా ప్రజలకు అందవు.

  • నిబంధనల ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో పని చేసే సిబ్బంది, ఇతర సిబ్బంది స్థానికంగా ఉండాలి. ఉదయం 9 - 12 గంటల వరకు, సాయంత్రం 4 -6 వరకు ఆరోగ్య కేంద్రాలు తెరచి ఉంచాలి. ఆరోగ్య సేవలు అందించాలి. నిరంతర ఆరోగ్య సేవా కేంద్రాల ద్వారా 24 గంటలూ వైద్య సేవలు అందాలి. ప్రతి గ్రామ పంచాయతీలోని అయిదు వేల జనాభాకు ఇద్దరు చొప్పున ఆరోగ్య కార్యకర్తలు (ఎఎన్ఎం) ఉంటారు. వీరు స్థానిక నివాసం ఉండాలి. ప్రతీ బుధవారం, శనివారం వ్యాధి నిరోధక టీకాల ద్వారా ఏడు ప్రాణాంతక వ్యాధుల (క్షయ, ధనుర్వాతం, కోరింత దగ్గు, కంఠవాపు, పోలియో, తట్టు, పెపటైటిస్ 'బి')కు టీకాలు ఇవ్వాలి. గర్భిణులను గుర్తించి నెలల వారీగా ఆరోగ్య సేవలు అందించాలి. అవసరమైతే అంబులెన్స్‌లో సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యసేవలు అందేలా చూడాలి. వారికి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం జరిగేలా సహకరించాలి. ఇవేవీ సక్రమంగా జరగవు... ఎందుకంటే వైద్యులు, అధికారులు, సిబ్బంది... ఒక్కరు కూడా స్థానికంగా ఉండరు. వీలున్నప్పుడు వస్తూ పోతుంటారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తారన్న భయమూ లేదు. ఎందుకంటే ఆ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలవుతాయని వాళ్లకు తెలుసు.

కుటుంబ నియంత్రణ
  • ఒకరు లేదా ఇద్దరు పిల్లల తరువాత ఈ ఆపరేషన్ చేయించుకున్న వారికి పారితోషికం ఇస్తారు. దీంతో పాటు జననీ సురక్ష యోజన డబ్బులు కూడా లబ్ధిదారులకు చాలా చోట్ల ఇవ్వకుండా మింగేస్తున్నారు.

దారిద్య్రరేఖకు ------దిగువ --------ఎగువ
పురుషులకు- రూ.1450 --------రూ.1100
స్త్రీలకు ------రూ.880 ---------రూ.250

  • సొమ్ములన్నీ హుష్ కాకి!
గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య పథకం కింద ప్రతీ గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన రూ.10,000 చొప్పున విడుదల చేస్తారు. వీటిని గ్రామ సర్పంచి ఎ.ఎన్.ఎం. ఉమ్మడి ఖాతాలో వేసి కాల్వలు శుభ్ర పరచడానికి, బ్లీచింగ్ పౌడర్ కొని, బావులను, మంచినీటి వనరులను క్లోరినేషన్ చేయడానికి వాడవచ్చు. కాని గ్రామ సర్పంచి ఎ.ఎన్.ఎంలు కలిసి పనులు చేయకుండా చేసినట్లు రికార్డులు సృష్టించి అందినంత దోచుకు తింటున్నారు.

  • మొక్కుబడి శిబిరాలు
వర్షాకాలంలో సాధారణంగా వచ్చేవి మలేరియా, డెంగీ, గన్యా, విష జ్వరాలు. కొద్ది పాటి ముందు జాగ్రత్త, సాధారణ చికిత్సలతో నయమవ్వాల్సిన వీటి వల్ల కూడా ఏటా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువగా అంటు వ్యాధులు ప్రబలే గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. మల, మూత్ర, రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధిని గుర్తించి, చికిత్స అందించాలి. ఆ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తెలియజెప్పాలి. కానీ ఈ ఆరోగ్య శిబిరాలు తూతూ మంత్రంగా జరపడం, వైద్యులు రాకపోవడం, మందులు పంపిణీ చేయకపోవడం... రికార్డుల్లో బ్రహ్మాండంగా చేసినట్టు రాసుకోవడం సాధారణం.

  • సుద్ద గోలీలే దిక్కు
ధర్మాసుపత్రులకు మందులు సరఫరాలో లెక్కలేనన్ని అక్రమాలు! ప్రభుత్వ ఆసుపత్రులకు డ్రగ్ కార్పొరేషన్ నుంచి విడతల వారీగా మందులు సరఫరా చేస్తారు. కానీ కొందరు అధికారుల చేతి వాటం వల్ల వాటిలో చాలా భాగం నల్లబజారుకు తరలుతున్నాయి. అందువల్లనే ప్రజలకు ఏ జబ్బు వచ్చినా రెండు సుద్ద గోలీలే దిక్కవుతున్నాయి.

  • కమిటీలే సరిగా ఉంటే...
వైద్యశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతీ పి.హెచ్.సికి ఏటా రూ.1.75 నుంచి రూ. 2 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తుంది. పి.హెచ్.సి స్థాయిలో ఉండే సలహా సంఘం ఈ నిధులను ఖర్చు చేయాలి. కాని ఈ సంఘం సభ్యులు, వైద్యాధికారులు కుమ్మకై వాటిని స్వాహా చేస్తున్నారు. కొన్ని చోట్ల సభ్యులు, అధికారుల విభేదాలు కూడా చేటుగా మారాయి.

  • ఏం అడగొచ్చు?
* పీహెచ్‌సీ, ఉపకేంద్రాల్లో అందించే వైద్య సేవల వివరాలు, పని చేసే వేళలు
* రోగుల వైద్య సేవలకు సంబంధించిన రికార్డులు, ఫైళ్లు
* సరఫరా అయిన వాక్సిన్‌లు, ఔషధాల నిల్వ, పంపిణీ చేసిన వాటి వివరాలు
* జననీ సురక్ష పథకం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న లబ్ధ్దిదారుల జాబితా, వారికి చెల్లించిన ప్రోత్సాహకాల వివరాలు
* పీహెచ్‌సీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ఖర్చు నివేదికలు
* ఆసుపత్రి అభివృద్ధికి విడుదలైన నిధులు, ఖర్చు నివేదికలు
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఉప కేంద్రాలకు విడుదలైన నిధుల వివరాలు, ఖర్చు వివరాలు, బిల్లుల వివరాలు
* పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పేరు, హోదా, జీతభత్యాలు, వారి నివాసం వివరాలు
* డెంగీ, ఎయిడ్స్, క్షయ అనుమానితుల సంఖ్య, మరణాల సంఖ్య, నివారణా చర్యలు, ఖర్చు నివేదికలు... ఈ సమాచారాన్ని సహ ద్వారా పొందవచ్చు.

  • ఎవరిని ఆడగాలి
పీ.హెచ్.సి. డీఎంహెచ్‌వో
పీఐవో: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పరిపాలనా అధికారి
ఏపీఐవో: సీనియర్ అసిస్టెంట్ పర్యవేక్షకులు అప్పీలేట్
అధికారి: మెడికల్ ఆఫీసర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

  • ఇవన్నీ జరిగితే...!
అయిదువేల జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక ఆరోగ్య ఉప కేంద్రం ఉండాలి. వీటిలో ఒక ఆరోగ్య కార్యకర్త / సహాయ మంత్రసాని (యాక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్ ఎఎన్ఎం) పురుష ఆరోగ్య కార్యకర్త ఉంటారు. అంటే అయిదువేల జనాభాకు ఇద్దరు కార్యకర్తలు మాత్రమే వైద్యసేవలు అందిస్తుంటారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో 4 - 6 పడకలు ఉంటాయి. ఒక వైద్యాధికారి, 14 మంది పారా మెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు. ఇది ఆరు ఉపకేంద్రాలకు రిఫరల్ ఆసుపత్రిగా పని చేస్తుంది.
ఆశ: గ్రామ జనాభాను బట్టి ఒకరు లేదా ఇద్దరిని ఆశ కార్యకర్తలుగా ఎంపిక చేస్తారు. వీరు గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, సంతాన నిరోధం, టీకాల అవశ్యకత తెలుపుతూ అతిసార రోగులకు వైద్య సహాయం, చిన్న గాయాలకు, జ్వరంతో బాధపడేవారిని వైద్య కేంద్రాలకు తీసుకెళ్లడం వంటి సేవలు చేయాలి.
సంచార వైద్యం: గిరిజన, మారుమూల ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కోసం జాతీయ ఆరోగ్య మిషన్ సంచార వైద్యశాల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని కోసం మన రాష్ట్రానికి 92 సంచార వైద్య కేంద్రాల్ని మంజూరు చేశారు. 2007 నుంచి ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వాహనానికి ఏటా రూ.10 లక్షలు ఖర్చవుతున్నాయి. పర్యవేక్షణ కొరవడటంతో ఇవి పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదు.

  • జననీ సురక్ష యోజన
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు ఈ పథకం ద్వారా రూ. 700, 'సుఖీభవ' కింద రూ.300 మొత్తం రూ.1000 పారితోషికం ఇస్తారు (ఇద్దరు పిల్లలకు మాత్రమే). ఇవీ పక్కదారి పడుతున్నాయి.

370 కోట్లు!
పన్నెండో ఆర్థిక సంఘం తాగునీటి పథకాలు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం గ్రామ పంచాయతీలకు రూ.370 కోట్లు అందజేస్తోంది. వీటిలో కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు మళ్లిస్తోంది. ఇక మిగిలిందే పంచాయతీలకు!

  • బడ్జెట్‌లో ఆరోగ్యం
రాష్ట్రం - రూ.3,821 కోట్లు
(ఇందులో ఆరోగ్యశ్రీకి - రూ.925 కోట్లు)
కేంద్రం: రూ21,113 కోట్లు

  • టోల్‌ఫ్రీ నంబర్లు
ఆరోగ్యశ్రీ: 1800-425- 7788,
భూమిక: 1800- 425- 2908,
హెచ్.ఐ.వి., ఎయిడ్స్ బాధితులకు: 1097,
అత్యవసర ఆరోగ్య రవాణా సర్వీసు (108),
ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసు (104),
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.