Saturday, January 21, 2012

Fasting or heavy meal not good for health,ఆహారం మానేసినా నష్టమే.. అతిగా తిన్నా నష్టమే

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Meals-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర.. మనిషికి ఈ రెండూ చాలంటారు! కానీ ఈ ఆధునిక కాలంలో.. మారుతున్న జీవనశైలి కారణంగా మొదటగా నిద్ర దెబ్బతింది. ఇప్పుడు తిండి వంతొచ్చింది. తినటానికి సమయం లేకపోవటం.. మరోవైపు తినటానికి రకరకాల కొవ్వులు, స్వీట్లతో చేసిన పదార్ధాలు అందుబాటులో ఉండటం.. ఈ రెండూ ఇక్కట్లు తెచ్చిపెట్టేవే. ఫలితంగా చాలామంది ఏదో పూట తిండి మానేస్తున్నారు.. ఆ వారం రెండోపూట అనారోగ్యకరమైన ఆహారాన్ని దండిగా, కడుపు నిండుగా లాగిస్తున్నారు! మనిషికి ఇంతకంటే జరగాల్సిన నష్టం మరోటి ఉండదు. ఆహారం మానేసినా నష్టమే.. అతిగా తిన్నా నష్టమే. చక్కటి సమతౌల్యంతో... పోషకాలన్నీ సమతులంగా ఉన్న ఆహారం తీసుకోవటం... నేటి అవసరం.

  • 1. పొద్దున్నే మానేస్తే.. శక్తి హీనం
ఉరుకుల పరుగుల జీవితాల్లో తరచూ వినిపించే పదం 'బ్రంచ్‌'. అంటే వీళ్లు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌- రెండింటి బదులూ ఒక్కసారే ఏదో ముక్కూనోటా కొట్టుకుంటున్నారన్నమాట. ఇది అస్సలు మంచి పని కాదు. ఉదయం టిఫిన్‌ ఎంత ముఖ్యమో, మధ్యాహ్న భోజనమూ అంతే ముఖ్యం. ఉదయం లేచిన తర్వాత ఒకటి రెండు గంటల్లో టిఫిన్‌ తినకపోతే చాలా అనర్ధాలున్నాయని పోషకాహార నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వాస్తవానికి రాత్రంతా ఆహారం లేకుండా ఖాళీగా ఉండటంతో శరీరంలో జీవక్రియలన్నీ మందగిస్తాయి. శక్తి కూడా సన్నగిల్లుతుంది. మనం ఉదయాన్నే టిఫిన్‌ తినటం వల్ల ఆ జీవక్రియలు వేగం పుంజుకుంటాయి. శక్తి కూడా ఉత్తేజితమవుతుంది. ఇక రోజంతా అలాగే కొనసాగుతుంది. కాబట్టి అల్పాహారం మన శరీరంలో రోజంతా జరగాల్సిన జీవక్రియలను గాడిలో పెడుతుందని, చక్కటి ఉత్ప్రేరకంగా పని చేస్తుందని గుర్తించాలి. పెద్దలతో పాటు పిల్లలకు ముఖ్యంగా యవ్వనదశలో ఉన్నవారికి ఇది అత్యంత అవసరం. ఉదయం అల్పాహారం తినకుండా స్కూలుకు, ఆఫీసులకు వచ్చిన వారిలో చురుకుదనం మందగించి, చదువుల్లో, పనిలో సామర్థ్యం కొరవడుతున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే- ఎక్కువసేపు పనిచేసే సామర్ధ్యాన్నిస్తుంది, కొలెస్ట్రాల్‌ మోతాదును తగ్గించటంతో పాటు మనసును ఆహ్లాదంగా కూడా ఉంచుతుంది. టిఫిన్‌ తినకపోతే మధ్యాహ్నానికి ఆకలి పెరిగిపోయి నియంత్రణ లేకుండా తినే ప్రమాదమూ ఉంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయం పూట చక్కటి అల్పాహారం తీసుకోవటం మరవరాదు. ఇందులో బలవర్ధకమైన మాంసకృత్తులు, పప్పులతో చేసిన పదార్ధాలు, పీచు ఎక్కువగా ఉండేవి తీసుకోవటం మంచిది. మాంసకృత్తులు కడుపు నిండిన భావన కలిగించి త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. కాబట్టి అల్పాహారంలో పొట్టుతీయని ధాన్యాలు, కొవ్వు తీసిన పాలు, గుడ్లు, పండ్ల వంటివి ఉండేలా చూసుకోవాలి.
  • 2. మధ్యాహ్నం మానేస్తే మొదటికే మోసం
కార్పొరేట్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలు విస్తరించటం మొదలైన తర్వాత పని ఒత్తిడిలో పడిపోయి మధ్యాహ్న భోజనం మానేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు పని చేస్తుంటే శరీరంలోని శక్తి క్షీణిస్తూ పని సామర్థ్యం తగ్గిపోతుంది. పైగా మధ్యాహ్న భోజనం మానేస్తే గ్యాస్‌, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలూ పెరుగుతాయి. ఇక బరువు తగ్గటం కోసం మధ్యాహ్న భోజనం మానేసే వారూ చాలామంది ఉన్నారు. దీనితో ప్రయోజనం శూన్యం. ఎందుకంటే భోజనం తర్వాత దాదాపు 2 గంటల వరకూ కూడా మనలో జీవక్రియలు 20-30% వేగవంతమవుతాయి. భోజనం మానేస్తే ఇవి మందగిస్తాయి. పైగా మధ్యాహ్న భోజనం మానేసినవాళ్లు- సాయంత్రం అయ్యేసరికి ఉండలేక రకరకాల స్నాక్స్‌ ఆబగా తినేస్తారు, దీంతో క్యాలరీల మోతాదూ పెరిగిపోతుంది. ఆఫీసుల్లో సాయంత్రం టీ సమయంలో సమోసాలు, పకోడీల వంటి నూనెలతో నిండిన రకరకాల పదార్థాలను దండిగా తింటుంటారు. క్యాలరీల పరంగా చూస్తే కొన్నిసార్లు ఇవి భోజనం మోతాదునూ మించిపోతాయి! ఒకవేళ సాయంత్రం స్నాక్స్‌ తినకపోతే- మధ్యాహ్నం భోజనంలేదు కాబట్టి రాత్రి భోజనానికి కూచున్నప్పుడు వేగంగా తినేస్తుంటారు. ఇదీ మంచిది కాదు. ఇక మధ్యాహ్నం పూట ఆకలి మంటలను చల్లార్చుకునేందుకు టీ, కాఫీల వంటివాటినీ ఆశ్రయిస్తుంటారు. ఇవి ఆ సమయంలో ఆకలిని చంపి, ఉత్తేజాన్నిచ్చినట్టే ఉంటాయిగానీ జీర్ణాశయానికి హాని చేస్తాయి. వీటివల్ల శరీరం పోషకాలను సరిగా గ్రహించలేని పరిస్థితి కూడా వస్తుంది. మధ్యాహ్న భోజనం మానితే ఇన్ని అనర్ధాలు. అందుకే మితంగా చక్కటి పోషకాహారం తినటం ఉత్తమం!
  • 3. ఆరోగ్యానికి హరివిల్లు
మనం తినే ఆహారం ఎంత వర్ణరంజితంగా.. రంగురంగులుగా.. ఎంత వైవిధ్య భరితంగా ఉంటే అంత ప్రయోజనకరమని పోషకాహార నిపుణులంతా చెబుతున్నారు. రకరకాల రంగు రంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కంటికీ, ఒంటికీ కూడా విందు చేస్తుంది. ఈ రంగురంగుల వృక్ష సంబంధ ఆహారంలో- కీలక పోషకాలైన కెరొటినాయిడ్లు, బయోఫ్లావనాయిడ్ల వంటివి ఉంటాయి. ఇవి మన శరీరంలో విశృంఖల కణాల (ఫ్రీర్యాడికల్స్‌) దాడికి అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా కెరొటినాయిడ్లలో భాగమైన లైకోపేన్‌, లూటిన్‌, బీటా కెరొటీన్‌ వంటివి- వయసుతో పాటు శరీరంలో, కణజాలంలో వచ్చేక్షీణతను నిలువరించే ప్రయత్నం చేస్తాయి. టమోటా, పుచ్చకాయ, ద్రాక్ష, అంజీరా వంటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపేన్‌.. కణాల్లో ఒత్తిడిని తగ్గించే 'యాంటీ ఆక్సిడెంట్‌'గా పనిచేస్తుంది, రోగనిరోధక శక్తి పెరిగేందుకూ దోహదపడుతుంది. మామిడి, బొప్పాయి, క్యారెట్లు, చిలగడ దుంప వంటి పసుపు, నారింజ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటాకెరోటిన్‌ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్‌-ఏ లోపం రాకుండానే కాదు, క్యాన్సర్‌ నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఇక మసాలా దినుసులు, పసుపు, గ్రీన్‌టీ, బత్తాయి, నారింజ వంటి పండ్లు, దుంపలు, కూరగాయల్లో అధికంగా ఉండే బయోఫ్లావనాయిడ్లు గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఇలా సహజంగా లభ్యమయ్యే అన్ని రంగుల పదార్ధాలకూ ఏదోఆరోగ్య ప్రయోజనం ఉంది. కాబట్టి ఎన్ని రంగుల పదార్ధాలు తింటే.. అంత మంచిదని గుర్తించండి.
  • 4. ఉపవాసం.. లంఖణం కాదు!
భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని మర్చిపోవద్దు. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.
  • 5. నీరు.. నిర్లక్ష్యం తగదు
చాలామంది నీళ్లు సరిగా తాగరు. నీళ్లను ఆహారంలో ఒక ముఖ్యభాగంగా పరిగణించకుండా.. తిన్నది గొంతు దిగటం కోసమే నీళ్లు అన్నట్టు వ్యవహరిస్తుంటారు. నీళ్లలో పోషకాలుండని మాట నిజమేగానీ మన శరీర బరువులో మూడింట రెండొంతులు నీళ్లే. మన మెదడు కణజాలంలో అయితే 70-80% వరకూ నీరే ఉంటుంది. కాబట్టి మన శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువ. మన ఒంట్లో 2% నీళ్లు తగ్గినా 'డీహైడ్రేషన్‌'కు దారి తీస్తుంది. చాలామందికి తెలియదుగానీ పగటిపూట నిస్సత్తువకు అతిముఖ్య కారణం- ఒంట్లో తగినంత నీరు లేక.. ఓ మోస్తరు 'డీహైడ్రేషన్‌'తో గడుపుతుండటం! కాబట్టి తగినన్ని నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో అవసరం. మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలన్నా, అందులోని పోషకాలు ఒంటబట్టాలన్నా నీరు అత్యవసరం. కండరాలు పట్టేయకుండా నివారించటం, కీళ్లు సాఫీగా కదిలేందుకూ దోహదం చేయటం, చర్మం ముడతలు పడకుండా జీవత్వంతో నిగనిగలాడటం, ఒంట్లోని మలినాలను-వ్యర్థాలను బయటకు పంపించటం, రక్తసరఫరాను మెరుగుపరచటం, మలవిసర్జన సాఫీగా జరిగేలా చూడటం.. ఇలా నీటి ప్రయోజనాలు అనంతం. మనకు దాహంగా అనిపిస్తోందంటే అప్పటికే ఒంట్లో ఎంతోకొంత నీటి శాతం తగ్గిందని అర్థం. కాబట్టి పరిస్థితి దాహం అనిపించేంత వరకూ రాకుండా.. రోజంతా అప్పుడప్పుడు నీరు తాగుతుండటం ఉత్తమం. అంతా రోజుకి కనీసం 2 లీటర్లు, లేదా 8 గ్లాసుల నీళ్లు తాగాలన్నది నిపుణుల సూచన. వ్యాయామం వంటి శారీరకశ్రమ చేసేవారైతే మరింత ఎక్కువ తాగాలి. భోజనానికి ముందు గ్లాసు నీళ్లు తాగితే ఆహారం మరీ ఎక్కువగా తినకుండానూ చూసుకోవచ్చు. దీంతో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. కొందరు బాగా దాహంగా అనిపించినప్పుడు నీళ్లకు బదులు కూల్‌డ్రింకుల వంటివి తాగుతుంటారు. వీటితో దాహం సరిగా తీరదు, పైగా అనవసరంగా క్యాలరీలూ పెరిగిపోతాయి. నిజానికి దాహం వేసినప్పుడు శరీరం కోరుకునేది- నీరు!
  • 6. తక్కువ సైజు.. ఎక్కువ సార్లు
మనలో చాలామందికి మూడు పూట్లే తినటం, ఆ తిన్నది దండిగా తినటంబాగా అలవాటు. అలాగే మధ్యమధ్యలో చిరుతిండ్లు మంచిది కాదన్న నమ్మకమూ ఉంది. కానీ ఇలా రోజు మొత్తమ్మీద తక్కువసార్లు తినటం, ఆ తిన్నప్పుడు కడుపు నిండేలా పెద్దమొత్తంలో తినటం కాకుండా తక్కువ తక్కువగా.. ఎక్కువసార్లు తినటం శ్రేయస్కరమని ఆధునిక పరిశోధనలన్నీ చెబుతున్నాయి. ఇలా తింటే ఒంట్లో శక్తి తగ్గదు, శరీరం బరువు పెరగదు! రోజుకి 4-5 సార్లు భోజనం లేదా చిరుతిండ్లు తినేవారిలో ఆకలి, బరువు నియంత్రణలో ఉంటున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు. ఇలా తినేటప్పుడు ప్రతిసారీ ఆహారంలో తగినన్ని మాంసకృత్తులు అంటే పప్పు పదార్ధాలు, కొద్దిగా మాంసం వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావననిస్తాయి. కండరాలు బలోపేతమయ్యేలా, కొవ్వు కరిగేలా ప్రోత్సహిస్తాయి. కాబట్టి చేపల వంటి సముద్ర ఆహారం, కోడిగుడ్డులోని తెల్లసొన, సోయా, కంది మినుము వంటి పప్పులు, బీన్స్‌ వంటి ఆరోగ్యకర ప్రోటీన్లు గలవాటిని తీసుకోవాలి. చిరుతిండ్లు అంటే రెడీమేడ్‌, జంక్‌ఫుడ్‌ కాదు. చాలామంది జంక్‌ఫుడ్‌ అంటే పిజ్జాలు, బర్గర్లు మాత్రమేనని అపోహ పడుతున్నారు. బజారులో దొరికే చాలా పదార్థాల్లో నూనెలు, ఉప్పు ఎక్కుగా ఉంటాయి. అలాగే నూనెలో బాగా వేయించినవి కూడా హాని కారకాలే. కాబట్టి పప్పులు, పిండి వంటివాటితో ఇంట్లో చేసిన బలవర్ధకమైన వాటిని చిరుతిండ్లుగా తీసుకోవచ్చు.
  • 7. ఆదుర్దాతో అనర్థం.. తక్కువతోనే తృప్తి
కొందరు భోజనం ముందు కూర్చుంటారో లేదో... ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా వేగంగా ప్లేటు ఖాళీ చేసేస్తారు. పక్కవాళ్లు పది ముద్దలు కూడా తినక ముందే మొత్తం ముగించేసే ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదు. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి, ఆస్వాదిస్తూ తినాలి. ఎందుకంటే వేగంగా తినే వారికి ఎంత తిన్నా కడుపు నిండిన భావనే కలగదు. ఎందుకో చూద్దాం. మన కడుపు ఖాళీగా ఉందా? నిండిందా? వంటి సమాచారాన్ని మెదడుకు చేరవేసేందుకు ఒక వ్యవస్థ ఉంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఘ్రెలిన్‌ అనే హార్మోన్‌ విడుదలై ఆకలి వేస్తోందనే సమాచారాన్ని మెదడుకు చేరుస్తుంది. మనం ఆహారం తీసుకోవటం మొదలుపెట్టి కడుపు నిండగానే.. ఆకలి తగ్గిందనే విషయాన్నీ పంపిస్తుంది. ఈ సమాచారం మెదడుకు చేరటానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. అయితే గబగబా తినేవారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తమవుతుంది. దీంతో కడుపు నిండినా ఆకలి తగ్గిందన్న భావన కలగక... తృప్తి అనిపించక.. ఇంకా తినేస్తూనే ఉంటారు. ఫలితంగా అవసరాన్ని మించి ఎక్కువ తినటం, ఊబకాయం బారినపడటం.. తథ్యం! ఇలా ఆబగా తినే అలవాటు చాలా వరకూ చిన్నతనంలోనే అలవడుతుంది. ఇది పెద్దయ్యాకా కొనసాగుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పట్నుంచే నెమ్మదిగా, బాగా నమిలి, ఆస్వాదిస్తూ తినటం నేర్పించాలి. దీనివల్ల తక్కువే తిన్నా.. తృప్తి కలుగుతుంది.
  • 8. మితంగా తింటేనే.. మన్నికైన జీవితం!
చాలామంది కంచం ముందు కూర్చుంటే కడుపు నిండిపోయే వరకూ కూడా ఆగలేరు. జిహ్వ చాపల్యంతో ఇలా పొట్ట నింపెయ్యటం కాదు.. భోజనం మొత్తం ముగించిన తర్వాత కూడా కడుపులో మరో నాలుగైదు ముద్దలకు చోటుండాలన్నది మన పెద్దల మాట. ఈ మాటలు అక్షర సత్యాలని ఇప్పుడు ఆధునిక పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. కడుపు నిండా కాకుండా.. నాలుగు ముద్దలు తక్కువ తినేవారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోందని, జీవిత చరమాంకంలో కూడా వీరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలేమీ ఉండటం లేదని పరిశోధకులు గుర్తించారు. స్వీట్లు, కొవ్వు, తీపి పదార్ధాల వంటి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్ధాలు బాగా తగ్గించేసి.. చిన్నతనం నుంచీ పీచుతో సహా చక్కటి పోషకాలుండే పండ్లు, కూరగాయల వంటివి మితంగా తీసుకుంటుండేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారనీ, ముఖ్యంగా వీరిలో మతిమరుపు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి తిండి మానెయ్యద్దు... అలాగని ఎక్కువ తినొద్దు. సాధ్యమైనంత మితంగా తినటం, ఆ తినేదానిలో కూడా సాధ్యమైనంత చక్కటి పోషకాహారం ఉండేలా చూసుకోవటం.. అత్యుత్తమ జీవన సూత్రం!

Source : 17/01/2012 సుఖీభవ.
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.