Thursday, June 13, 2013

Coronary artery blocks,గుండె రక్తనాళాల్లో పూడికలు,గుండెలో బ్లాకులు,Blocks in heart

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Coronary artery blocks,గుండె రక్తనాళాల్లో పూడికలు,గుండెలో బ్లాకులు,Blocks in heart
-
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    కొందరు పొట్టలో, ఛాతీలో ఏ కొంచెం నొప్పి వచ్చినా అది 'గుండెపోటు' నొప్పేనేమో అని తీవ్రంగా గాభరా పడిపోతుంటారు. వీళ్లను ఆ భయంవెన్నాడుతూనే ఉంటుంది.  ఇటువంటి వారు కూడా ఒకసారి వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకుని సందేహాలను నివృత్తి చేసుకోవటం మంచిది. నాలుగు పదుల జీవితం హాయిగా నడిచిపోతుంటుంది. ఇంటాబయటా నిశ్చింత. ఇంతలో మన పక్కనే ఒక పిడుగు పడుతుంది. ప్రతి రోజూ కలిసే తోటి ఉద్యోగికో.. తరచూ పలకరించే ఎదురింటి మిత్రుడికో హఠాత్తుగా 'గుండె పోటు' ముంచుకొచ్చి.. పరిస్థితి చాలా 'సీరియస్‌' అవుతుంది. గుండెలోని రక్తనాళాల్లో  'బ్లాకులు'న్నాయని.. వాటికి స్టెంటు పెట్టాలనో, బైపాస్‌ ఆపరేషన్‌ చెయ్యాలనో చెబుతారు వైద్యులు.

ఇక అక్కడి నుంచీ మొదలవుతుంది మనకు గుండెల్లో గుబులు. ఏ క్షణాన్నైనా మనకూ గుండె పోటు రావచ్చేమో! మనకూ గుండెల్లో బ్లాకులున్నాయేమో..?రోజురోజుకూ అవి  పెరుగుతున్నాయేమో? ఏదో ఒకరోజు అవి మనల్నీ దెబ్బతీస్తాయేమో! ఇక ఈ దిగులుకు అంతుండదు.నిజానికి ఈ దిగులు, ఈ గుబులు అసహజమైనదేం కాదు. తరచుగా కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటూ, ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించే వారికి అంత భయం అక్కర్లేదుగానీ.. అది కొరవడినప్పుడు గుండెల్లో 'బ్లాకు'లు నిజంగానే ప్రమాదకరం. ఇలా పూడికలు వచ్చే ముప్పు ఎక్కువ ఉన్నవాళ్లు దీన్నంత తేలికగా తీసుకోవటానికి లేదు. అందుకే గుండెలో పూడికలు పెరిగే ముప్పు ఎవరికి ఎక్కువ? ఈ పూడికలు ఉన్నాయా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు ఇప్పుడున్న పరీక్షలు ఏమిటి? వీటిలో సమస్యను ఏవెంత కచ్చితంగా చెప్పగలుగుతాయన్నది తెలుసుకోవడం ముఖ్యము .

గుండెలో ఉండే రక్తనాళాల్లో పూడికలు వచ్చి... గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోవటం... ఎవరికైనా జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ఉపద్రవం! అదే గుండెపోటు!! ఆధునిక కాలంలో ఎంతోమంది ప్రాణాలను క్షణాల్లో హరించివేస్తున్న ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవటానికి లేదు. ఒకప్పుడు ఏదో పెద్దవయసులోనే వస్తుందనుకునే ఈ సమస్య ఇప్పుడు మధ్యవయసులో, ఇంకా చెప్పాలంటే చిన్నవయసులో కూడా ముంచుకొచ్చేస్తోంది. దీని బారినపడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే.. అసలీ పూడికలేమిటో.. ఇవెందుకు వస్తాయో అర్థం చేసుకోవటం చాలా అవసరం.

రక్తం మన ప్రాణం! రక్త సరఫరా లేకుండా మన శరీరంలో ఏ భాగమూ.. ఏ కణమూ కూడా పని చెయ్యలేదు. అందుకే మన గుండె శరీరం మొత్తానికి రక్తాన్నిపంపింగ్‌ చేస్తుంటుంది. అయితే ఇదే సూత్రం గుండెకూ వర్తిస్తుంది. మన గుండె నిరంతరం కొట్టుకుంటూ పనిచేస్తుండాలంటే.. దానికీ రక్త సరఫరా అవసరమే! ఆ పని చేసేవే గుండె గోడల్లో ఉండే 'కరోనరీ' ధమనులు. సున్నితమైన ఈ ధమనులు గుండె గోడల పైపొరల్లో ఉండి.. గుండె కండరం మొత్తానికి నిరంతరం రక్తాన్ని అందిస్తుంటాయి.ఇలా గుండెకు రక్తాన్ని అందించే ధమనులేమిటో చూద్దాం. కుడివైపు ఉండేది ఒకటి. దీన్ని 'రైట్‌ కరోనరీ ఆర్టరీ-ఆర్‌సీఏ' అంటారు. ఇక ఎడమవైపు వెళ్లేది లెఫ్ట్‌ కరోనరీ ఆర్టరీ. ఇది కొద్దిదూరం రాగానే రెండు పాయలుగా చీలుతుంది. వీటిలో ఒకదాన్ని సర్కమ్‌ఫ్లెక్స్‌, రెండోదాన్ని 'లెఫ్ట్‌ యాంటీరియర్‌ డిసెండింగ్‌ ఆర్టరీ-ఎల్‌ఏడీ' అంటారు. వీటిని స్థూలంగా చూస్తే- కుడి ధమని ఒకటి, ఎడమవైపు రెండు... ఇలా కరోనరీ ధమనులు మూడని చెప్పుకోవచ్చు. మన ఇళ్లలోని నీళ్ల గొట్టాల్లో పాచి పేరుకున్నట్టే... ఈ మూడింటిలో కొలెస్ట్రాల్‌ కొవ్వు ముద్దలు పేరుకుని.. అవి రక్త ప్రవాహానికి అడ్డుగా తయారవ్వచ్చు. వీటినే సాధారణంగా 'బ్లాక్‌'లని అంటుంటారు. ఈ బ్లాక్‌లు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏదైనా నాళంలో బ్లాక్‌ ఏర్పడితే.. దాని నుంచి కిందికి రక్తం వెళ్లక.. ఆ ప్రాంతం గుండె కండరం దెబ్బతింటుంది... గుండెపోటు ముంచుకొస్తుంది! అందుకే పూడికల విషయంలో చాలా జాగ్రత్త అవసరం.

పూడికలు వచ్చే ముప్పు ఎవరికి ఎక్కువ?
గుండెలో రక్తనాళాలు పూడుకుపోయి.. గుండెపోటు ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుందో ఇప్పుడు చాలామందికి తెలుసు. అయినా ఈ ముప్పుల పట్ల చాలామంది శ్రద్ధ తీసుకోవటం లేదు. ఈ కింద సమస్యలున్న వారంతా.. తమకు గుండె పోటు ముప్పు పొంచి ఉంటుందని గుర్తించటం అవసరం.

* మధుమేహులు
* హైబీపీ ఉన్నవాళ్లు
* కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు
* పొగతాగే అలవాటున్న వాళ్లు
* వూబకాయులు
* తగినంత శారీరక శ్రమ, వ్యాయామాలు చెయ్యనివారు
* వయసు: సాధారణంగా రక్తనాళాలు పూడుకుపోవటమన్నది 40-50 ఏళ్ల పైబడిన వారికే ఎక్కువ. కానీ ఇటీవలి కాలంలో ఇంకా చిన్నవయసులోనే అంటే 30-40 మధ్య వయసు వారిలో కూడా గుండె రక్తనాళాల్లో పూడికలు కనబడుతున్నాయి. కాబట్టి ఎటువంటి ముప్పులున్నా చిన్న వయసు నుంచీ జాగ్రత్తలు అవసరమని గుర్తించాలి.
* ఇవి కాకుండా రక్తంలో- లైపోప్రోటీన్‌-ఎ, హోమోసిస్టీన్‌, కార్డియోలిపిన్‌, ఫైబ్రినోజెన్‌ వంటివి ఉన్నవారికీ పూడికలు వచ్చే ముప్పు ఎక్కువ. సాధారణంగా గుండెకు సంబంధించిన పరీక్షల ప్యాకేజీల్లో ఇవీ ఉంటాయి. లేదూ అనుమానం బలంగా ఉన్నవారికి వైద్యులు ఈ పరీక్షలు చేయిస్తారు.

పూడికలున్నాయేమో పరీక్షలు ఎవరికి అవసరం?
* పైన చెప్పిన ముప్పుల్లో ఒకటి, రెండు కంటే ఎక్కువ ముప్పులున్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవటం అవసరం. ఇవే కాకుండా..
* కాస్త శ్రమ చేస్తే గుండెనొప్పి లేదా ఆయాసం వంటివి వస్తున్న వాళ్లు,
* కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవాళ్లు,
* శారీరకంగా అధికంగా శ్రమించే క్రీడాకారులు, పోలీసు వంటి ఉద్యోగాలకు 'ఫిట్‌నెస్‌' పరీక్షలకు వెళుతున్న వాళ్లు, అలాగే తరచూ ఫిట్‌నెస్‌ పరీక్షలు అవసరమయ్యే పైలెట్ల వంటి ఉద్యోగులు..
..వీరంతా కూడా గుండెలో 'పూడికలు' ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవటం చాలా అవసరం.

ప్రస్తుత పరిస్థితులను బట్టి 30-40 ఏళ్ల నుంచీ అందరూ కొన్ని ప్రాథమికమైన పరీక్షలు చేయించుకోవటం మంచిది. అందరికీ గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ అవసరం ఉండదుగానీ 'ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌'తో మాత్రం మంచి ప్రయోజనం ఉంటుంది. శారీరక వ్యాయామంతో కూడుకున్న ఈ పరీక్ష- గుండెలో అస్సలే పూడికలూ లేవని చెప్పలేకపోయినా.. దీని ఫలితాల ఆధారంగా చాలా వరకూ పెద్ద, ప్రమాదకరమైన పూడికలేమీ లేవని కచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. బీపీ, కొలెస్ట్రాల్‌, హైబీపీ వంటి ముప్పులేవైనా ఉండి, 40 ఏళ్ల పైబడిన వాళ్లు ప్రతి రెండేళ్లకు ఒకసారి; 50 ఏళ్లు పైబడిన వాళ్లు ఏటా ఒకసారి- ట్రెడ్‌మిల్‌, ఎకో, ఈసీజీ పరీక్షలు మూడూ చేయించుకోవటం మంచిది.

1. ఈసీజీ
మనిషిని విశ్రాంతిగా పడుకోబెట్టి.. ఛాతీ మీద కొన్ని వైర్లను అతికించి చేసే తేలికపాటి పరీక్ష ఇది. ఛాతీలో నొప్పిగా ఉన్న సమయంలో ఈ పరీక్ష చేస్తే.. దానిలో పూడికలకు సంబంధించిన తేడాలేమీ లేకపోతే.. అప్పుడు పూడికలు లేవని భావించవచ్చు. అంతేగానీ నొప్పి లేకుండా విశ్రాంతి సమయంలో ఈ పరీక్ష చేసి..పూడికలేమీ లేవని కచ్చితంగా చెప్పటం కష్టం.

ముఖ్యమైన విషయమేమంటే చాలామంది ఛాతీలో నొప్పి వచ్చిందని ఆసుపత్రికి వెళ్లి ఈసీజీ చేయించుకుంటారు. దానిలో ఏమీ లేదనగానే ఇక సమస్యేమీ లేదని నమ్మటం మొదలుపెడతారు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే ఈసీజీ చేయించుకోవటానికి వెళ్లేసరికి నొప్పి తగ్గిపోయి ఉంటుంది. నొప్పి తగ్గిపోయిన తర్వాత తీసే ఈసీజీలోమార్పులేమీ కనబడకపోవచ్చు. అంతా నార్మల్‌గానే ఉండొచ్చు. కానీ అది మళ్లీ ఏ సమయంలోనైనా తిరిగి ఆరంభం కావచ్చు. కాబట్టి 'ఈసీజీ' నార్మల్‌గా ఉన్నంత మాత్రాన గుండె రక్తనాళాల్లో ఎటువంటి పూడికా లేదని, బ్లాకులేమీ లేవని నూరు శాతం భరోసా ఏమీ ఉండదు. నొప్పి ఉన్నప్పుడు తీస్తే కొంత వరకూ చెప్పచ్చు. అందుకే ఎవరైనా నొప్పితో వస్తే వైద్యులు ఆసుపత్రిలో ఓ రోజు ఉంచి కొన్ని కొన్ని గంటల వ్యవధిలో పలుమార్లు ఈసీజీలు తీసి చూసి, అప్పుడు నిర్ధారిస్తారు.

2. ఎకో కార్డియోగ్రామ్‌ (ఎకో)
ఛాతీ మీది నుంచి అల్ట్రాసౌండ్‌ తరంగాల సాయంతో గుండెను పరిశీలించే ఈ 'ఎకో' పరీక్షతో చాలావరకూ గుండె గదుల మధ్య ఉండే కవాటాలు, గుండె పంపింగ్‌ సామర్థ్యం, అందులో పీడనాల వంటివి తెలుస్తాయి గానీ రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా? లేదా? అన్నది దీనిలో స్పష్టంగా తెలియదు. పూడికలకు సంబంధించిన సమాచారం కోసం ఇతరత్రా పరీక్షల మీద ఆధారపడాల్సిందే.

3. ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ (టీఎంటీ)
మనల్ని ట్రెడ్‌మిల్‌ మీద పరుగెత్తిస్తూ.. క్రమేపీ దాని వేగం పెంచుతూ.. వరసగా ఈసీజీలు తీస్తారు. శారీరక వ్యాయామం పెరుగుతున్న కొద్దీ గుండెలో వస్తున్న మార్పులను గుర్తించటం ఈ పరీక్ష లక్ష్యం. చాలాకాలంగా ఉన్న, గుండెలో పూడికలకు సంబంధించి విలువైన సమాచారాన్నిచ్చే మంచి పరీక్ష ఇది. వ్యాయామం చేస్తున్నప్పుడు మనందరికీ గుండె కొట్టుకునే వేగం, పంపింగ్‌, బీపీ వంటివి పెరుగుతాయి. ఈ సమయంలో గుండె ఎక్కువగా పని చెయ్యాల్సి వస్తుంది. దీంతో గుండెకు రక్తసరఫరా కూడా ఎక్కువగా అవసరమవుతుంది. గుండె మీద ఇంత ఒత్తిడి ఉన్నా సాధారణ ఆరోగ్యవంతులైతే 40-50 ఏళ్ల వయసులో కూడా కనీసం పది నిమిషాల పాటు వ్యాయామం చెయ్యగలుగుతారు. ఒకవేళ గుండెలోని రక్తనాళాల్లో ఎక్కడైనా పూడికలు వస్తే అక్కడ అవసరమైనంత స్థాయిలో రక్తసరఫరా జరగదు, అందుతున్న రక్తం సరిపోదు. దీంతో వాళ్లకు ఈసీజీలో తేడాలు కనబడతాయి. గుండెలో నొప్పి ఆరంభమవ్వచ్చు. కొన్నిసార్లు బీపీ తగ్గిపోతుండొచ్చు. ఈ లక్షణాలు మొదలైతే వెంటనే పరీక్ష ఆపేస్తారు. వీటన్నింటినీ బట్టి 'ట్రెడ్‌మిల్‌టెస్ట్‌ (టీఎంటీ) పాజిటివ్‌' అంటారు. ఇలా తేడా వస్తే గుండెలో పూడికలున్నట్టు బలంగా అనుమానించి.. రక్తనాళాల్లో పూడికలను కచ్చితంగా నిర్ధారించి చెప్పే 'యాంజియోగ్రామ్‌' పరీక్షకు పంపిస్తారు.

* మధుమేహం, హైబీపీ వంటి ఇతరత్రా ముప్పులుండి, ఎటువంటి గుండె నొప్పీ లేకపోతే.. అటువంటి వారిలో పూడికలేమైనా ఉన్నాయా? వస్తున్నాయా? అన్నది తెలుసుకునేందుకు ఈ టీఎంటీ బాగా ఉపయోగపడుతుంది.

* టీఎంటీలో ఎటువంటి తేడాలూ లేవని తేలినంత మాత్రాన.. గుండెల్లో ఎటువంటి పూడికలూ లేవని నూటికి నూరు శాతం చెప్పగలమా? అంటే లేదు. ఈ పరీక్షలో కూడా 60% వరకే ముప్పును చెప్పగలం. 40% కేసుల్లో పూడికలు ఉన్నా ఇది కచ్చితంగా పట్టుకోలేకపోవచ్చు. అలాగే ఒక రక్తనాళమే పూడుకున్నా కూడా అదీ పరీక్షలో బయటపడకపోవచ్చు. కనీసం 2 నాళాల్లో బ్లాకులు వస్తేనే దీనిలో 'పాజిటివ్‌' వస్తుంది. ఇటువంటి పరిమితులున్నాయి కాబట్టి... ఈ పరీక్షలో నార్మల్‌ వస్తే చాలావరకూ ఫర్వాలేదని చెప్పచ్చుగానీ నూరు శాతం పూడికలే లేవని చెప్పలేం.

* ట్రెడ్‌మిల్‌ పరీక్షతో మరికొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు బీపీ పెరుగుతోందంటే భవిష్యత్తులో బీపీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీన్నిబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే వ్యాయామం ఎంత వరకూ చెయ్యచ్చన్నది కూడా ఇందులో తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి 30 ఏళ్ల తర్వాత రెండేళ్లకోసారి అయినా ఈ పరీక్ష చేయించుకోవచ్చు.

* మొత్తానికి ఇప్పటి వరకూ గుండెపోటు లక్షణాలేవీ లేనివారికి.. పూడికలున్నాయేమో బలంగా అనుమానించటానికి ఉపయోగపడే పరీక్ష ఇది. ఇప్పటికే ఒకటి రెండు సార్లు గుండెలో నొప్పి వచ్చి ఉండి, అది చాలావరకూ గుండెపోటు నొప్పే అనిపిస్తున్న వాళ్లకు నేరుగా 'యాంజియోగ్రామ్‌' మేలు, టీఎంటీ అవసరం ఉండదు.

4. డొబిటమిన్‌ స్ట్రెస్‌ ఎకో
వ్యాయామాలు చెయ్యలేని వారికి చాలా ఉపయోగకరమైన పరీక్ష, కానీ దీని ప్రాధాన్యాన్ని చాలామంది గుర్తించటం లేదు. చాలామంది స్త్రీలు ట్రెడ్‌మిల్‌ మీద సరిగా నడవలేరు. వాళ్లకూ ఇది బాగా ఉపయోగపడుతుంది. మనిషిని పడుకోబెట్టి 'డొబిటమిన్‌' అనే మందు కొద్దికొద్దిగా ఇస్తూ.. మధ్యమధ్యలో 'ఈసీజీ', 'ఎకో' పరీక్షలు చేస్తుంటారు. ఈ మందు గుండె వేగాన్ని పెంచుతుంది. రక్తనాళాల్లో ఎక్కడైనా ఒక ప్రాంతంలో పూడిక వస్తే అక్కడ గుండె కొట్టుకోవటం తగ్గిపోతుంది. దీంతో ఆ ఒక్క ప్రాంతంలో తేడా స్పష్టంగా కనబడుతుంది. ఇది 15 నిమిషాల్లో పూర్తయిపోయే సున్నితమైన, కచ్చితమైన, సురక్షితమైన పరీక్ష. రక్తనాళాల్లో పూడికలు ఉంటే దీనిలో 85% వరకూ కచ్చితంగా పట్టుకోవచ్చు. ఈ పరీక్షలో నార్మల్‌ వస్తే తర్వాత 2-3 ఏళ్లలో గుండెపోటు వచ్చే రిస్కు చాలా తక్కువనే చెప్పచ్చు. ఇతరత్రా ఏవైనా ఆపరేషన్లకు వెళ్లే ముందు గుండెకు సంబంధించిన సమస్యలేమీ లేవని నిర్ధారించేందుకు కూడా ఈ పరీక్ష చేస్తుంటారు. దీనిలో నెగిటివ్‌ అని వస్తే ఆపరేషన్‌ సమయంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉండవనే చెప్పచ్చు. ఇది సురక్షితమైన పరీక్ష.

5. స్ట్రెస్‌ థాలియం
అమెరికా వంటి దేశాల్లో ట్రెడ్‌మిల్‌కు ప్రత్యామ్నాయంగా చాలా విరివిగా వాడేస్తున్న పరీక్ష ఇది. ఈ పరీక్ష 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. పూడికలుంటే 80% వరకూ కచ్చితత్వంతో చెబుతుంది. ట్రెడ్‌మిల్‌ మీద నడిపిస్తూ గుండె కట్టుకునే రేటు ఒక స్థాయికి చేరుకోగానే- 'థాలియం' అనే 'రేడియో ఐసోటోపు' పదార్థాన్ని ఇంజక్షన్‌ ఇచ్చి, అప్పుడు స్కానింగ్‌ చేస్తారు. బ్లాకులు లేకుండా రక్తప్రసారం బాగున్న ప్రాంతమంతటికీ థాలియం బాగా చేరిపోతుంది. బ్లాకులుండి, రక్తసరఫరా లేని చోటికి థాలియం చేరదు కాబట్టి స్కానింగ్‌లో ఆ ప్రాంతాలన్నీ మచ్చల్లా (కోల్డ్‌ స్పాట్స్‌) కనబడతాయి. గుండెలో ఎంత ప్రాంతానికి రక్తసరఫరా అందుతోందన్నది దీనిలో స్పష్టంగా తెలుస్తుంది. మిగతా పరీక్షల్లో రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా? లేవా? ఉంటే ఎంత శాతం ఉన్నాయన్నది తెలిస్తే దీనిలో
గుండెలో ఎంత ప్రాంతానికి రక్తప్రసారం తగ్గుతోందన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా   కచ్చితమైన పరీక్ష. కాకపోతే దీనిలో 'రేడియేషన్‌' ప్రభావం ఉంటుంది కాబట్టి మన దేశంలో అంత విరివిగా వాడటం లేదు.

6. సీటీ యాంజియోగ్రామ్‌
ఇది అత్యాధునికమైన పరీక్ష. అయోడిన్‌ రంగు పదార్థాన్ని ఇంజక్షన్‌ చేసి.. కొద్ది నిమిషాల తర్వాత గుండెకు 'సీటీ స్కాన్‌' చేస్తారు. పరీక్ష 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఆసుపత్రిలో చేరటం వంటి బాదరబందీలేమీ ఉండవు. చివరికి ఫలితం దాదాపు 'యాంజియోగ్రామ్‌' అంత స్పష్టంగా, అంత కచ్చితత్వంతో ఉంటుంది. పైగా యాంజియోగ్రామ్‌ కంటే ఖరీదు తక్కువ. ఇప్పుడిప్పుడే   ఏర్పడుతున్న పూడికలను కూడా ఇది కచ్చితంగా పట్టుకోగలుగుతుంది. రేడియేషన్‌ ప్రభావం మరీ ఎక్కువేమీ ఉండదు. కొత్తతరం యంత్రాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ రేడియేషన్‌ ప్రభావం మరింత తగ్గుతోంది కూడా. మొత్తానికి రేడియేషన్‌ ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని 35 ఏళ్ల లోపు వారికి దీన్ని చెయ్యరు. అలాగే 65-70 ఏళ్ల వారికి చేస్తే క్యాల్షియం పేరుకుపోయి రక్తనాళాలు గట్టిపడి ఉంటాయి కాబట్టి ఫలితాలు అంత స్పష్టంగా ఉండవు. కాబట్టి- గుండెలో రక్తనాళాలు   మూసుకుపోయే రిస్కు ఎక్కువగా ఉన్నవారికి, కుటుంబ చరిత్ర ఉన్న వారికి, తరచుగా ఛాతీలో నొప్పి వస్తున్న వారికి, గుండెపోటు భయం పీడిస్తున్న వారికి.. దీనితో చాలా ప్రయోజనం ఉంటుంది.

* ఈ 'సీటీ యాంజియో'లో చాలా ముందు దశలోనే పూడికలను గుర్తించొచ్చు. సాధారణ యాంజియోగ్రామ్‌లో రక్తనాళం లోపల ఎలా ఉందన్నదే తెలుస్తుందిగానీ.. సీటీ యాంజియోలో అయితే ఆ రక్తనాళం గోడలు, వాటిలో క్యాల్షియం పేరుకుందా? వంటి సమాచారం కూడా చాలావరకు తెలుస్తుంది.

* కొన్నిసార్లు రోగులెవరైనా తీవ్రమైన గుండె నొప్పితో ఆసుపత్రికి వచ్చినప్పుడు- అనుమానం బలంగా ఉంటే నేరుగా 'సీటీ యాంజియో' పరీక్ష చేసి... బ్లాకులు ఉన్నట్టు గుర్తిస్తే అప్పటికప్పుడే క్యాథ్‌ల్యాబ్‌కు తరలించి 'స్టెంట్‌' పెట్టిస్తారు. ఇప్పుడీ విధానం విస్తృతంగా వాడకంలోకి వస్తోంది.

7. యాంజియోగ్రామ్‌
గుండె రక్తనాళాల్లో పూడికలున్నాయా? లేదా? ఉంటే మూడు రక్తనాళాల్లో ఎన్నింటిలో పూడికలు వచ్చాయి? ఎన్ని చోట్ల పూడుకున్నాయి? ఎంత శాతం పూడుకున్నాయి? వాటితో ఇబ్బంది ఎంత ఉంటుంది? వంటి సమాచారాన్నంతా కచ్చితంగా చెప్పే అత్యంత ప్రామాణికమైన పరీక్ష ఇది. నేడు అందుబాటులో ఉన్న పరీక్షలన్నింటిలో కచ్చితత్వం దీనికే ఎక్కువ. కాకపోతే కాస్త ఖరీదైన పరీక్ష ఇది. 10-15 నిమిషాల సమయం పడుతుంది. గుండెలోకి గొట్టాలు  ప్రవేశపెట్టటం వంటివి అవసరమైన పరీక్ష కాబట్టి పరీక్ష పూర్తయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఆసుపత్రిలోనే పరిశీలనలో ఉంచి, తర్వాత ఇంటికి పంపించేస్తారు.

* దీనిలో రోగిని 'క్యాథ్‌ల్యాబ్‌'కు తీసుకువెళ్లి.. కాలి దగ్గర లేదా మణికట్టు దగ్గర ఉండే రక్తనాళం ద్వారా గుండెలోని కరోనరీ ధమనుల్లోకి సన్నటి గొట్టం పంపి.. దాని ద్వారా అయోడిన్‌ రంగు ద్రవం విడుదల చేస్తూ.. అదే సమయంలో వరసగా ఎక్స్‌-రేలు తీస్తూ రక్తనాళం లోపల ప్రవాహం ఎలా ఉంది? అవరోధాలు, పూడికలున్నాయా? అన్నది గుర్తిస్తారు.

* సాధారణంగా ఇతరత్రా సాధారణ పరీక్షల్లో పూడికలున్నాయని బలమైన అనుమానం వ్యక్తమైనప్పుడు- కచ్చితత్వంతో గుర్తించి నిర్ధారించుకునేందుకు ఈ యాంజియోగ్రామ్‌ పరీక్ష చేస్తారు. దీని ఫలితాల ఆధారంగా రోగికి స్టెంట్‌ అమర్చాలా? ఆపరేషన్‌ అవసరమా? చేస్తే ఎలాంటి చికిత్సలు చెయ్యాలన్నది కచ్చితంగా నిర్ధారించటం వీలవుతుంది. పూడికలు ఉన్నట్టు గుర్తిస్తే ఈ పరీక్షా సమయంలోనే 'స్టెంట్‌'లను కూడా అమర్చే వీలుంటుంది, దానికి అదనంగా మరో 30-40 నిమిషాలు పడుతుంది.

అత్యాధునికం
గుండెలోని రక్తనాళంలో పూడిక ఏర్పడితే- చికిత్స అందించటానికి ఆ పూడిక స్వభావం ఏమిటన్నది తెలుసుకోవటం అవసరం. ఇందుకు యాంజియోగ్రామ్‌ చెయ్యటానికి గుండెలోకి పంపించే గొట్టం చివర్లోనే చిన్న కెమేరా ఉండే 'కరోనరీ యాంజియోస్కోపీ', పూడికలో కొవ్వు ఎక్కువగా ఉందా.. దాని స్వభావమేంటో చెప్పే 'ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ', పూడికకు ముందు, ఆ తర్వాత రక్త ప్రవాహ పీడనంలో తేడా ఎంత ఉంది? దానికి స్టెంట్‌ అవసరమా? అన్నది తేల్చి చెప్పే 'డాప్లర్‌ ఫ్లో వైర్‌', రక్తనాళం లోపలే అల్ట్రాసౌండ్‌ తరంగాలు పంపించటం ద్వారా పూడిక ఎంత మేర ఉంది, దాని స్వభావం ఏమిటన్నది చెప్పే 'ఇంట్రా వ్యాస్క్యులర్‌ అల్ట్రాసౌండ్‌' వంటివి లోతైన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాయి.

చికిత్స
పూడికలుంటే యాంజియోగ్రామ్‌ పరీక్ష తర్వాత వాటిని ఓ మోస్తరు (50% కంటే తక్కువ), మధ్యస్తం (50-70%), తీవ్రం (70% కంటే ఎక్కువ) అని వర్గీకరిస్తారు. అలాగే పూడికలు ఒక రక్తనాళంలో ఉన్నాయా? రెంటిలో ఉన్నాయా? మూడింటిలోనూ ఉన్నాయా? అన్నది చూసి, వీటన్నింటి ఆధారంగా ఏ రకం చికిత్స చెయ్యాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా 40-60 మధ్య వయసు వారిలో ఒకటి గానీ, రెండు గానీ పూడికలు ఉంటే 'స్టెంట్‌'లు అమర్చి రక్తప్రసారాన్ని చక్కదిద్దచ్చు. 60 ఏళ్లు పైబడిన వారిలో మూడు నాళాల్లోనూ పూడికలుంటే 'బైపాస్‌' ఆపరేషన్‌ ఉత్తమం. 75 ఏళ్లు పైబడిన వారిలో పూడికలుంటే వాళ్లు పెద్దగా శారీరక శ్రమ చెయ్యరు కాబట్టి చాలా వరకూ మందులతో చికిత్స చేస్తారు.

* స్టెంట్‌, బైపాస్‌ రెండూ కుదరనప్పుడు 'కరోనరీ కౌంటర్‌ పల్సేషన్‌' చికిత్సతో ప్రయోజనం ఉంటుంది. ఇది శాస్త్రీయమైన చికిత్సే. మిగతా మార్గాలేవీ లేవనుకున్నప్పుడు, రోజూ నొప్పి వస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని రక్తనాళాలను గుండె కొట్టుకునే వేగానికి అభిముఖంగా ఆడిస్తూ వాటిలో ఒత్తిడి పెంచటం దీని ప్రత్యేకత. ఇది పూడికలను తొలగించలేదుగానీ దీనివల్ల పక్కనుండే చిన్న రక్తనాళాల్లోకి ప్రవాహం పెరిగి.. నొప్పి బాగా తగ్గుతుంది.

అపోహలు
* ఈసీజీగానీ, ఎకో పరీక్ష గానీ 'నార్మల్‌' అయితే గుండెలో పూడికలు లేవనేం కాదు. ట్రెడ్‌మిల్‌ పరీక్షలో నెగిటివ్‌ వస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువనేగానీ అస్సలుండవని కాదు.

* ఒకసారి స్టెంట్‌ పెట్టిన తర్వాత, లేదా బైపాస్‌ ఆపరేషన్‌ తర్వాత జబ్బు పూర్తిగా నయమైపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్‌ సాయంతో, లేదా బైపాస్‌ ఆపరేషన్‌ సాయంతో మనం... రక్తనాళంలో ఇప్పటికే ఉన్న అవరోధాన్ని తొలగించామేగానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా అదేమీ అడ్డుకోదు. పూడికలు రావటమన్నది ఒక్కసారితో నయం చేసేయటానికి వీలైన సమస్య కాదు. కాబట్టి స్టెంట్‌ పెట్టిన తర్వాత, లేదా బైపాస్‌ తర్వాత కూడా మళ్లీ పూడికలు రాకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూనే ఉండాలి.

జాగ్రత్తలు
1. నిత్యం పీచు ఎక్కువగా ఉండే శాకాహారం ఎక్కువగా తీసుకోవటం.
2. యోగా, ధ్యానం చెయ్యటం.
3. నిత్యం వ్యాయామం చెయ్యటం.
4. మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటివాటిని కచ్చితగా అదుపులో ఉంచుకోవటం.. ఇవి చాలాచాలా ముఖ్యం. స్టెంట్‌, బైపాస్‌ సర్జరీల వంటివి సాధ్యం కాకపోయినా... ఈ నాలుగు జాగ్రత్తలతో పూడికలు బాగా తగ్గుతున్నాయని మౌంట్‌అబూ, ఎయిమ్స్‌ అధ్యయనాల్లో నిర్ధారించారు కూడా. కాబట్టి వీటిని తక్కువగా అంచనా వెయ్యటానికి లేదు.

--Courtesy with Dr.A.V.Anjaneyulu -senior cardiologist ,Hyd.@eenadu sukhibhava
  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, June 2, 2013

What is AYUSH system of Medicine?,ఆయుష్ వైద్యవిధానము అంటే ఏమిటి ?

  •  
 image :courtesy with Intag(Indian development gateway)
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -What is AYUSH system of Medicine?,ఆయుష్ వైద్యవిధానము అంటే ఏమిటి ? - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 ఆయుష్ వైద్యవిధానము :

ఇండియాలో భారతీయ వైద్యవిధానము  మరియు హోమియోపతి (ISM&H) అనే ఒక ప్రభుత్వ శాఖ 1995 , మార్చి లో ప్రారంభంచబడినది. భారతదేశము లో ఆయుర్వేదము , యోగా & ప్రకృతివైద్యము , యునాని , సిద్ధ , హోమియోపతి (Ayurveda, Yoga & Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH) వైద్యవిధానాలపై శ్రద్ధ తీసుకునేందికు తగిన చర్యలు , ప్రణాళికలు , విధి విధానాలు అవలుచేయడము దీని ముఖ్య ఉద్దేశము . ఈ (ISM&H) ని (AYUSH) గా నవంబర్ 2003 లో పేరు మార్చారు.

విధులు : ఈ క్రింది వాటి అభివృద్ధిలో శ్రద్ధ చూపబడును ->
  • విధ్య మరియు పరిశోధన ,
  • విద్యా ప్రమాణాలు పరిరక్షణ,
  • మందుల నాణ్యత , ప్రమాణీకరణము ,
  • మెడిషనల్ మొక్కల , మూల పదార్ధాలు అందుబాటులో ఉంచడము ,
  • ఆయుష్ వైద్యం పై దేశ విదేశాలలో జ్ఞానము (awareness) కలుగజేయడములో చర్యలు చేపట్టడము

ఇందులో విధానాలు            
  •     ఆయుర్వేధ -Ayurveda  
  •     యోగా - Yoga
  •     ప్రకృతివైద్యము - Naturopathy
  •     యునాని - Unani
  •     సిద్ధ - Siddha
  •     హోమియోపతి - Homoeopathy
  •     సోవా.రిగ్పా - SOWA - RIGPA (ఇది ఆయుర్వేదము నకు సమానము గా ఉండును)

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/