Monday, July 8, 2013

Duties of A.P medical council,ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ విధులు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Duties of A.P medical council,ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ విధులు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవలు అందించాలనుకునే వారెవరైనా 'ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌'లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే. ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక రిజిస్టర్‌ చేసుకుంటేనే వారికి ప్రాక్టీసు చేసుకోవటానికి అర్హత లభిస్తుంది. వైద్య వృత్తికీ, ప్రభుత్వానికీ మధ్య వైద్యమండలి అనుసంధానంగా, నియంత్రణ సంస్థగా పని చేస్తుంది. రాష్ట్ర వైద్యమండలి ప్రధాన కర్తవ్యం వైద్యుల పేర్ల నమోదుతో పాటు వైద్యులంతా నియమ నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా చూడటం. అలాగే చికిత్సలో నిర్లక్ష్యం మూలంగా తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించి కలెక్టర్‌, ఎస్పీ, డీజీపీ, ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి ఇలా ఎవరికి ఫిర్యాదు చేసినా.. చివరికి జరిగింది 'తప్పో ఒప్పో' నిర్ణయించేది కూడా వైద్యమండలే. ఈ బాధ్యతను దేశంలో 'ఎంసీఐ', రాష్ట్రంలో 'ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌' నిర్వహిస్తాయి. ఎవరైనా వైద్యులు తప్పుచేసినట్టు రుజువైతే చర్యతీసుకునే అధికారం కూడా దీనికి ఉంది.

* ఎవరైనా వైద్యుల నిర్లక్ష్యం మూలంగా తమకు చికిత్సలో అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే అది ముందుగా వైద్యమండలి ఛైర్మన్‌కు అందుతుంది. ఆయన దాన్ని 'నైతిక ప్రమాణాల కమిటీ'కి పంపిస్తారు. ఇందులోని సభ్యుల్లో ఇద్దరు మినహా అందరూ వైద్యమండలికి చెందినవారే ఉంటారు. ఆ ఇద్దరినీ పేరు పొందిన నిపుణుల నుంచి ఎంపిక చేసి నియమిస్తారు. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఆ కమిటీ దానిపై తన అభిప్రాయాన్ని అందిస్తుంది. ఫిర్యాదుకు సంబంధించి ఏదైనా సందేహముంటే ఈ కమిటీ ఇతర నిపుణుల సలహాలను కూడా తీసుకుంటుంది. నైతిక కమిటీ అభిప్రాయంపై వైద్య మండలి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తిరిగి చర్చిస్తుంది. అనంతరం సర్వసభ్య బృందం కూడా దాన్ని పరిశీలిస్తుంది. అవసరమైతే మరోసారి నిపుణుల సలహానూ అడుగుతుంది.

* ఫిర్యాదు అందిన తర్వాత ఫిర్యాదు చేసినవారినీ, సంబంధిత వైద్యుని కూడా పిలిచి మండలి ప్రశ్నిస్తుంది. సంజాయిషీ కోరుతుంది. ఒకవేళ పిలిచిన సమయానికి సంబంధిత వైద్యుడు హాజరు కాకపోతే దాన్ని మరో నెలకు వాయిదా వేయాల్సి రావొచ్చు. అందువల్ల మొత్తమ్మీద ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవటానికి 6 నెలల నుంచి ఏడాది వరకూ పట్టొచ్చు. అయితే వీలైనంత త్వరగానే ఫిర్యాదును పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు.

* ఏటా కౌన్సిల్‌కు 30-40 ఫిర్యాదులు వస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు కూడా. వైద్యులను సస్పెండ్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి.

* గత ఆరున్నరేళ్లలో ఏపీ వైద్యమండలికి 180కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 140 కేసులను పరిష్కరించారు. 18 మంది వైద్యులపై చర్యలు తీసుకున్నారు. చిన్న తప్పుకైతే హెచ్చరిస్తారు. పెద్ద తప్పు అయితే సస్పెన్షన్‌ కూడా చేస్తారు.

* వైద్యులపై ఫిర్యాదు చేయాలనుకునేవారు రూ.20 స్టాంపు పేపరుపై రాసి వైద్యమండలికి పంపించాలి. కేస్‌ వివరాలు, డిశ్చార్జి పత్రాలు జతచేయాలి. దొంగ డిగ్రీలను ప్రకటించుకున్నారని ఫిర్యాదు చేస్తే.. ఆ డాక్టర్‌ పేరుతో నడుస్తున్న ఆసుపత్రి బోర్డు ఫొటో, ప్రిస్కిప్షన్‌లను పంపించొచ్చు. విచారణకు పిలిచినపుడు ఫిర్యాదుదారులు తప్పకుండా స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిర్యాదుదారు హాజరుకాకపోతే ఆ ఫిర్యాదును కొట్టేస్తారు.

* ప్రస్తుతం చాలామంది ఎంబీబీఎస్‌ వైద్యులు కూడా తమకుతాము 'డయాబెటాలజిస్టు'లుగా రాసుకుంటున్నారు. నిజానికి మన దేశంలో 'డీఎం, ఎండోక్రైనాలజీ' చేసినవారు మాత్రమే డయాబెటాలజీలో ప్రత్యేక నిపుణులు. ఎంబీబీఎస్‌లో జనరల్‌ మెడిసిన్‌లో ఎండీ చేసినవారూ మధుమేహానికి చికిత్స చేయొచ్చు. అయినా వారు 'డయాబెటాలజిస్టు'లమని ప్రకటించుకునే అధికారం లేదు. అలా ప్రచారం చేసుకోవటం వల్ల అందులో ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన వైద్య నిపుణుడిగా ప్రజలు పొరపడే అవకాశముంది. అలా ఎవరైనా ప్రకటించుకుంటే ఫిర్యాదు చెయ్యచ్చు కూడా.

* మనదేశంలో ఇచ్చే 'ఫెలోషిప్‌'లేవీ గుర్తింపు పొందిన డిగ్రీలు కావు. విదేశాల్లో ఫెలోషిప్‌ అంటే మూడు, నాలుగేళ్ల పాటు ఎండీలాగా శిక్షణపొందుతారు. కానీ మన దేశంలో ఫెలోషిప్‌లు ఆరు నెలలు, ఏడాది మాత్రమే కొనసాగుతాయి. ఇవి మూడేళ్ల కోర్సులు కావు కాబట్టి వీటికి డిగ్రీలుగా గుర్తింపు లేదు. ఈ ఫెలోషిప్‌ల పేరుతో ప్రచారం సరికాదు.

* త్వరలో ఒక ఆసుపత్రి ప్రారంభం అవుతుందనో, ఫలానా కొత్త డాక్టర్‌ తమ ఆసుపత్రికి వచ్చారనో, ఒక డాక్టర్‌ కొత్తగా డిగ్రీ పొందారనో.. ఇలాంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయటానికి ప్రచారం చేసుకోవచ్చు. అంతేగానీ వైద్యులు ప్రచారం చేసుకోవటానికి అనుమతి లేదు. ప్రత్యేకంగా హెల్త్‌ ఎడ్యుకేషన్‌ పేరు మీద వైద్యులు రోజూ టీవీల్లో ప్రచారం చేసుకోవటమూ అనైతికమే.

* రష్యా, ఉక్రెయిన్‌ వంటి దేశాల్లో ఎండీ అనే డిగ్రీ ఇచ్చినా అది మన ఎంబీబీఎస్‌తో సమానమనే గుర్తించాలి. ఆ దేశాల్లో ఎంబీబీఎస్‌ డిగ్రీనే 'ఎండీ' అని ఇస్తారు. ఇలాంటి వైద్యులు ఎండీ పేరుతో ఇక్కడ చలామణి అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నివారించేందుకు రష్యా, ఉక్రెయిన్‌లో ఎండీ చదివిన వారి పేరును రిజిస్టర్‌ చేసుకునే సమయంలోనే ఆ డిగ్రీ ఎంబీబీఎస్‌తో సమానమని రాష్ట్ర వైద్యమండలి ప్రత్యేకంగా పేర్కొంటోంది కూడా. ఆ విషయాన్ని బోర్డులపైనా, ప్రిస్కిప్షన్‌ల పైనా పేర్కొనాలని సూచిస్తోంది.
వైద్యపరమైన నిరాదరణకు, వైద్యుల అనైతిక ప్రవర్తనలకు గురైనట్లు భావించేవారు తమ ఫిర్యాదును ఈ చిరునామాకు పంపించొచ్చు.

చిరునామా : ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ --పోస్ట్‌బాక్స్‌ నంబర్‌: 523, --సుల్తాన్‌బజార్‌, -హైదరాబాద్‌-500095, ఆంధ్రప్రదేశ్‌

courtesy with : Dr.E.Ravinder Reddy , chairman -AP medical council@eenadu sukhibhava.
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.