Showing posts with label Drug Exploitation. Show all posts
Showing posts with label Drug Exploitation. Show all posts

Friday, December 14, 2012

Medicine looty,Drug Exploitation,Medicine Robbery-ఔషధన దోపిడీ


image : courtesy with Eenadu newspaper.

  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఔషధన దోపిడీ-  గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




కంపెనీల పడగనీడలో మందులు-సుప్రీంకోర్టు తీర్పునకు తూట్లు పొడిచే యత్నం . ధరల నిర్ణాయక సంస్థపై ఒత్తిడి , నియంత్రణ పరిధిలోకి రాకుండా రకరకాల యత్నాలు, స్పష్టమైన నిబంధనలతోనే అడ్డుకట్ట వేయగలమంటున్న నిపుణులు

ఏ వ్యాపారంలోనైనా వందశాతం లాభం వస్తుందంటే దానిని ఎంతో ఆకర్షణీయమైన రంగంగా భావిస్తాం. కానీ, 5,000 శాతం లాభం వస్తే..? ఆశ్చర్యపోకండి.. నిజంగానే ఐదువేలశాతం లాభం. అంటే వంద రూపాయలు ఖర్చు చేస్తే ఐదువేల రూపాయల రాబడి అన్నమాట. ఇక్కడ ఎవరికైనా ఒక ధర్మసందేహం రావచ్చు. వంద రూపాయల ఖర్చుతో 5,000 రూపాయలు సంపాదించటం వ్యాపారం ఎలా అవుతుంది? దోపిడీలోనో దొంగతనంలోనో తప్ప మరెక్కడ సాధ్యమవుతుంది? అని ప్రశ్నించవచ్చు. కానీ, మనదేశంలో మాత్రం దశాబ్దాలుగా ఇది చట్టబద్ధంగా సాగిపోతోంది. మరెక్కడో కాదు... ప్రాణాలను నిలిపే ఔషధ తయారీ రంగంలో.

* జలుబు, అలర్జీలకు ఉపయోగించే సిట్రిజిన్‌ మాత్రలను పదింటిని తయారుచేయటానికి 75 పైసలు ఖర్చవుతుంది. కానీ ఔషధ కంపెనీలు వీటిని రూ.34- 37కు అమ్ముతున్నాయి. కంపెనీలకు 4,533 శాతం నుంచి 4,933 శాతం లాభం వస్తోంది.

* నొప్పి నివారణకు ఉపయోగించే నిమ్స్‌లైడ్‌ మందు తయారీకి అయ్యే ఖర్చు రూ.1.95 పైసలు (15 మాత్రలకు). కానీ, ఒక ప్రముఖ కంపెనీ ఇదే ఔషధం 15 బిళ్లల ప్యాక్‌ను రూ.52.30కు అమ్ముతుండగా, మరో కంపెనీ రూ.58కు విక్రయిస్తోంది. ఈ కంపెనీలకు వచ్చే లాభం 2,682-2,974 శాతం.

ఈ పరిస్థితిని వివరిస్తూ ఆల్‌ ఇండియా డ్రగ్స్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రాణాధార మందులను ఈ ధరాఘాతం నుంచి తప్పించాలని, లేదంటే సామాన్యుడికి ప్రాణాలు నిలుపుకోవటం కష్టసాధ్యమవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధరల నియంత్రణ జాబితాలో ఉండే అత్యవసర మందులను 74 నుంచి 348కి పెంచాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది అక్టోబర్‌లో తీర్పునిచ్చింది. ఈ మేరకు జాతీయ ఔషధాల ధరల నిర్ణాయక సంస్థ తగినచర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఔషధ కంపెనీలు ఈ సంస్థపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తూ నిర్ణయం తీసుకోకుండా అడ్డుపడుతున్నట్లు సమాచారం.



  • పరిశ్రమ ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కారు

ఉత్పత్తి వ్యయంతో పోల్చితే అనేక రెట్లు అధికంగా మందులను విక్రయిస్తూ ప్రజలను ఔషధ కంపెనీలు నిట్టనిలువునా దోచుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం గతంలో కొన్ని చర్యలు చేపట్టింది. 1974లో హాథి కమిటీని నియమించింది. ఈ కమిటీ 347 రకాలమందులు ధరల నియంత్రణ విధానంలో ఉండాలని సిఫారసు చేసింది. 1979 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల చాలా నష్టపోతున్నామని, కొన్ని మందులను జాబితా నుంచి మినహాయించాలని ఔషధ పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి చేయటంతో 1987లో వీటిని 142కి తగ్గించారు. ఆ తరవాత సరళీకరణ ఆర్థిక విధానాల నేపథ్యంలో 1995లో ఈ సంఖ్య 74కు చేరుకుంది. తాజాగా సుప్రీంకోర్టు వీటిని 348కు పెంచాలని ఆదేశించింది. అంతేకాదు, మందుల ధరలను ప్రభుత్వం 1999లో ఏర్పాటుచేసిన విధానం మేరకు నిర్ణయించాలని కూడా స్పష్టం చేసిందని అఖిలభారత ఔషధ నియంత్రణ అధికారుల సమాఖ్య సెక్రటరీ జనరల్‌ రావి ఉదయ్‌భాస్కర్‌ 'ఈనాడు'తో చెప్పారు. 1999 విధానం ప్రకారం ఉత్పత్తి వ్యయానికి గరిష్ఠంగా 100 శాతం లాభం కలిపి ధరను నిర్ణయించాలి. కానీ, ఈ విధానం అమలు కాకుండా మందుల కంపెనీలు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నాయని ఉదయభాస్కర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ధరల నిర్ణాయక సంస్థ 2010లో సిట్రిజన్‌ పది మాత్రలకు ఏడు రూపాయలను గరిష్ఠ ధరగా నిర్ణయించింది. ఈ మందు అత్యవసర మందుల జాబితాలో ఉంది. అంటే ప్రభుత్వం సూచించిన ధరకే విక్రయించాలి. కానీ, నియంత్రణ పరిధి నుంచి తప్పించుకోవటానికి కంపెనీలు సిట్రిజన్‌కు మరో మందును కొద్దిమోతాదులో కలిపి రూ.34-37కు అమ్ముతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అమలయ్యే కొత్త విధానం ప్రకారం సిట్రిజన్‌ను రూ.ఏడుకే విక్రయించాలి. కానీ, అమ్మకం ధరపై 20-25 శాతం వరకు మాత్రమే తగ్గిస్తామని మందుల కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. అంటే ఏడు రూపాయలకు అమ్మాల్సిన సిట్రిజన్‌ను రూ.27కు విక్రయిస్తామని చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థపైనా ఒత్తిడి తెస్తున్నాయి.


  • కంపెనీల ఎత్తులు, ప్రలోభాలు

ధరల నియంత్రణ పరిధిలో ఉన్న ఔషధాలను ఆ పరిధి నుంచి తప్పించి అమ్ముకోవటానికి ఔషధ కంపెనీలు రకరకాల పనులు చేస్తున్నాయి. ఉదాహరణకు, 'ఎ' అనే మందు ధరను ప్రభుత్వం నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే.. కంపెనీలు ఆ మందుకు 'బి' అనే మరో మందును కొద్దిమోతాదులో కలుపుతున్నాయి. దీంతో 'ఎ' ధరల నియంత్రణ పరిధిలో లేకుండా పోతోంది. నిబంధనలను అమలు చేస్తున్నామంటూ 'ఎ' మందును కొద్దిమొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి. అదే సమయంలో 'ఎ' మందును వైద్యులు సిఫార్సు చేయకుండా.. ఎ, బి మందులు కలిసి ఉన్న వాటినే సిఫార్సు చేయాలని చెబుతున్నాయి. దీనికోసం వైద్యులకు నగదు, బహుమతులు, విదేశీ పర్యటనలు వంటివి ఇస్తూ పలురకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. అలాగే, ధరల నియంత్రణ పరిధిలో ఒక మందు పదిమాత్రల ప్యాక్‌ ఉంటే.. పదిహేను మాత్రల ప్యాక్‌ను తయారుచేసి ఆ పరిధిలో లేకుండా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. నిమ్స్‌లైడ్‌ మందు విషయంలో ఇదే జరుగుతోంది.


  • మార్గదర్శకాలేవి?

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రప్రభుత్వం 348 మందులను ధరల నియంత్రణ పరిధి జాబితాలో చేర్చింది. దీనివల్ల దాదాపు 650 రకాల ఔషధాల ధరలు తగ్గడానికి అవకాశం ఉంది. అయితే, కంపెనీలు దీనిని అడ్డుకుంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు వారు కొన్ని పరిష్కారమార్గాలు కూడా సూచిస్తున్నారు. 1999 నాటి విధానం ప్రకారం అత్యవసర మందుల ధరలను నిర్ణయించిన తరవాత, ఒక్కో కంపెనీ ఈ మందులను తప్పనిసరిగా ఏడాదికి ఎంత పరిమాణంలో (క్వాంటిటీ) ఉత్పత్తి చేయాలనే దానిని కూడా స్పష్టం చేయాలని చెబుతున్నారు. దీనివల్ల కంపెనీలు తప్పించుకోవటానికి వీలుండదని అంటున్నారు.

భారతదేశంలో మందుల ఉత్పత్తి రూ.లక్ష కోట్లు దాటినా, జనాభాలో దాదాపు 50-65 శాతం మందికి అత్యవసర మందులు అందుబాటులో లేవు

  • - ప్రపంచ ఆరోగ్య సంస్థ

మందుల ధరలను నిర్ణయించడంలో ఒక నిర్దిష్టమైన విధానం లేదు. ఉత్పత్తివ్యయంతో పోల్చితే చాలారకాల మందుల ధరలు 1000 నుంచి 3000 శాతం అధికంగా ఉంటున్నాయి. దీనివల్ల రోగం వస్తే సామాన్యులు మందులు కొనలేకపోతున్నారు. ఈ విధానాన్ని మార్చాలని గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం. కంపెనీలు మందుల ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు గడిస్తున్నప్పుడు.. అత్యవసరమైన కొన్ని ఔషధాలనైనా కనీస లాభానికి ఇవ్వటానికి ముందుకు రావాలి. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిబంధనలు రూపొందించాలి.


- రావి ఉదయ్‌భాస్కర్‌, సెక్రటరీ జనరల్‌,అఖిల భారత ఔషధ నియంత్రణ అధికారుల సంఘం సమాఖ్య@ఈనాడు - హైదరాబాద్‌


  • =====================

 Visit my website - > Dr.Seshagirirao.com/