Showing posts with label Why do children cry?. Show all posts
Showing posts with label Why do children cry?. Show all posts

Monday, March 7, 2011

పిల్లలెందుకు ఏడుస్తారు?,Why do children cry?



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పిల్లలెందుకు ఏడుస్తారు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పిల్లలందరూ ఏడుస్తారు. కొంతమంది చీటికీ మాటికీ ఏడిస్తే, మరికొంతమంది అప్పుడప్పుడూ ఏడుస్తారు. పిల్లలు అసలు ఏడవకపోయినా, విపరీతంగా ఏడుస్తున్నా ఏదో తేడా ఉందనిఅర్థం. పిల్లలు బిగ్గరగా, గొంతు చించుకు ఏడుస్తున్నప్పుడు దానికి వెనుక ఉన్న కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేయాలి.

సాధారణంగా పిల్లలంతా ఆకలి వేస్తే ఏడు స్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ, నిజంగా ఆకలి వేసి

ఏడుస్తున్నట్లు గుర్తించడం ఎలా?
దీనికి మీరు మీ పాపాయికి ఎప్పుడు ఆహారం తినిపించారో లేదా పాలు పట్టారో గుర్తుకు తెచ్చుకోండి. ఎప్పుడూ తీసుకునేంత ఆహారం తీసుకుందా లేదా అనే విషయాన్ని గమనించండి. మీ పాపాయి అదేపనిగా ఆకలితో ఏడుస్తున్నా, ఇచ్చిన పాలతో సంతృప్తి చెందకపోయినా పాలతోపాటు ఘనాహారం కూడా మొదలు పెట్టాలని అర్థం.

సాధారణంగా పాపాయికి ఆరు నెలల వయస్సు వచ్చిన తరువాత ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పాపాయి ఆరోగ్యంగా, బలంగా పెరుగుతున్నట్లయితే మరింత ముందుగానే ఘనాహారాన్ని ప్రారంభించవలసిన అవసరం రావచ్చు.
పాపాయికి పట్టే పాలు, పండ్ల రసాలు, నీళ్లు - వీటి అవసరం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, గదిలోని వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పుడు, పాపాయికి మందమైన బట్టలు తొడిగినప్పుడు చెమట ఎక్కువ పట్టి శరీరంలోని జలీయాంశం వేగంగా బైటకు వెళ్లిపోతుంది.

అలాగే జ్వరం వచ్చినప్పుడు కూడా శరీరాన్ని చల్లబరచటం కోసం చెమటపట్టి, ఫలితంగా నిర్జలీయత ప్రాప్తిస్తుంది. ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు పాపాయి తనకు దాహం వేస్తున్న సంగతిని ఏడుపు ద్వారా తెలియజేస్తుంది.
అప్పుడు గది చల్లగా ఉండేలా చూడటం, తడిబట్టతో శరీరాన్ని తుడవటం, ద్రవాహారాలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి.

బట్టలలో మలమూత్ర విసర్జన చేసినప్పుడు కూడా పిల్లలు చిరాకుతో ఏడుస్తారు. మలమూత్రాలలో ఉండే ఆమ్లాలు, క్షారాల వలన పసిపిల్లల శరీరం కందిపోయి మంట పుడుతుంది. దీనిని డైఫర్‌ రాష్‌ అంటారు. ఈ కారణంగానే పిల్లలు చిరాకుతో ఏడుస్తారు.
పిల్లలు నిద్ర పోవాల్సిన సమయంలో నిద్ర పోకపోయినా, ఆందోళనగా ఉన్నా, భయపడినా, చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా అసౌకర్యంగా ఉండి ఏడుస్తారు.

పిల్లల్లో సాధారణమైన ఏడుపు, నొప్పితో ఏడ్చే ఏడుపులలో తేడా ఉంటుంది. నొప్పి ఉన్నప్పుడు పిల్లలు పెద్దగా ఏడుస్తారు.
చెవి ఇన్‌ఫెక్షన్లు, దంతాలు రావడం, డైపర్ల వలన చర్మంపై ఇన్‌ఫెక్షన్లు ఏర్పడటం, ఆహారం జీర్ణం కాక కడుపు నొప్పి రావటం వంటివి పిల్లల్లో నొప్పిని కలిగించే సాధారణ కారణాలు. వీటిని జాగ్రత్తగా పరీక్షించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి
  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/