Thursday, May 13, 2010

ఫైలేరియా , Filaria







ఫైలేరియాసిస్- హెల్మెంత్ వర్గానికి చెందిన సన్నని పరాన్నజీవి వలన కలుగుతుంది. ఈ వ్యాధి మానవుని మరణానికి దారితీయకపోయినప్పటికీ, దీని వలన కలిగే దుష్పరిణామాలు మాత్రం చాలా తీవ్రమైనవి. వ్యాధి సంక్రమణను సరిగా అంచనా వేయడం, ప్రాథమిక దశలో గుర్తించడం కష్ట సాధ్యం. ఈ వ్యాధి నుండి పూర్తి విముక్తికి మార్గం లేదు. రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఈ వ్యాధి సోకిన వారి వ్యాధినిరోధక శక్తి లోపించి యితర వ్యాధులకు గురి కావడానికి అవకాశం ఎక్కువ అవుతాయి. వాపుల వలన సాధారణమైన పనులు చేసుకోలేకపోవడం, అంగవైకల్యం, శారీరక, మానసిక వ్యధ యీ వ్యాధి వలన కలిగే దుష్పరిణామాలు.


బోదకాలు : కాళ్ళు చేతులలోని శోషరస నాళాల్లో శోషరస గ్రంథుల్లో చేరిన క్రిములు పెద్ద సంఖ్యలో పెరిగిపోతాయి దీనితో ఆ భాగాలు ఉబ్బి పరిమాణం కూడా పెరుగుతుంది. దీనినే బోదవ్యాధి-ఫైలేరియా లేక ఏనుగుకాలు (ఎలిఫెంటియాసిస్‌) వ్యాధి అని అంటారు.

కాలానుగుణంగా దోమల వలన వచ్చే సీజనల్‌ వ్యాధులు : మెదడు వాపు వ్యాధి -(జపనీస్‌ ఎన్‌సెఫలైటీస్‌), బోదకాలు వ్యాధి -(ఏనుగుకాలు), డెంగ్యూ జ్వరం , ''మలేరియా జ్వరం'', చికున్‌ గున్యా జ్వరం ... మున్నగునవి .

  • బోదకాలు వ్యాధి -ఏనుగు కాలు (లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌)
ఫైలేరియా లేక బోదకాలు వ్యాప్తి : ముఖ్యంగా బోద వ్యాధి ''ఉచిరీరియా బాంక్రాప్టై'' అను సన్నని దారం లాంటి పరాన్నజీవి (క్రిమి) వలన కలుగుతుంది. ఈ క్రిమి ''క్యూలెక్స్‌'' దోమకాటు ద్వారా మన శరీరంలో ప్రవేశించి లింఫ్‌ నాళాలను పాడుచేస్తుంది. నిజానికి మన శరీరంలో లింఫ్‌ నాళాలు కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒక రకంగా ఇవి సమర్థంగా పనిచేసే డ్రైనేజి గొట్టాలాంటివి. రక్తనాళాల్లాగానే ఈ లింఫ్‌ నాళాలు కూడా ఒళ్లంతా ఉంటాయి. రక్త నాళాల నుండి లీక్‌ అవుతుండే స్రావాలను, కణవ్యర్థాలను తిరిగి గుండె దగ్గరికి తీసుకువెళ్తుంటాయి. ఫైలేరియా క్రిములు ప్రధానంగా ఈ లింఫ్‌ నాళాల్లోచేరి వీటిని పాడుచేస్తాయి, కాబట్టి సరైన డ్రైనేజి వ్యవస్థ లేక కణాల మధ్య లింఫ్‌ స్రావాలు ఎక్కడివక్కడే ఉండిపోయి ముందుగా కాలు ఉబ్బడం ఆరంభమవుతుంది. ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికి వస్తుంది. చిన్నతనంలో సోకిన ఈ వ్యాధి పెద్దయ్యాక రోగ లక్షణాలు బయటపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సుమారు 12 కోట్ల మంది ప్రజలు లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌కు గురౌతున్నారు. ప్రపంచంలో 80 దేశాల్లోకెల్లా భారతదేశంలోనే అత్యధికంగా కేసులు ఉన్నాయి. భారత్‌లో 28 రాష్ట్రాల్లో ఫైలేరియా కేసులు నమోదౌతున్నాయి. మన ఇంట్లో గాని, వీధిలో గాని, ఊరులో గాని ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉంటే చుట్టుపక్కల వారికి వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బోద వ్యాధి గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఫైలేరియా వ్యాధి లక్షణాలు : 1. శరీరంలో ఫైలేరియా క్రిములు ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనబడడానికి 8 నుండి 16 నెలలు పట్టవచ్చు. 2. తొలిదశలో కొద్దిపాటి జ్వరం, ఆయాసం రావడం, తలనొప్పి వణుకు, 3. శోషనాళాలు పాడైపోయి, లింఫ్‌ ప్రసరణ ఆగిపోయి కాళ్లు, చేతులు వాయడం, 4. వాచిన చోట నొక్కితే సొట్ట పడడం, 5. చర్మంపై మచ్చలు, పుండ్లు, కాయలు, దురద పెట్టడం, రసి కారడం, 6. వరి బీజము (బుడ్డ) మర్మావయాలు పాడవడం, 7. గజ్జల్లో, చంకల్లో బిళ్లలు కట్టడం మొదలైనవి.

వ్యాధి సంక్రమించే ఇతర శరీర భాగాలు : శరీరంలో ఏ భాగానికైనా ఫైలేరియా వ్యాధి రావచ్చును. ఈ బోద సమస్య ముఖ్యంగా కాళ్లు, చేతులు, జననాంగాలకు ఎక్కువ. పురుషులలో వృషణాల తిత్తికి (హైడ్రోసిల్‌), పురుషాంగానికి, స్త్రీలలో రొమ్ము యోని పెదవులకు రావచ్చు కానీ మొత్తం మీద ఈ సమస్య కాళ్లకే ఎక్కువ.

వ్యాధి నిర్ధారణ : ఈ వ్యాధి నిర్ధారణకు రాత్రిపూట రక్తపరీక్ష చేయించుకొని ఫైలేరియా క్రిములు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవాలి. వీలైతే రోగిని అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న సమయంలో లేపి రక్తపరీక్ష చేయించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ రక్త పరీక్షలో ఫైలేరియా క్రిములు కనబడకపోతే కాలువాపు వస్తే దానికి ఇతరత్రా కిడ్నీ వ్యాధులు, గుండె వైఫల్యం, లివర్‌ వైఫల్యం, థైరాయిడ్‌ సమస్యల వంటివి ఏమీ లేవని నిర్ధారించుకొని లక్షణాల ఆధారంగా చికిత్స ఆరంభించవలసి ఉంటుంది.

చికిత్స : ఫైలేరియా వ్యాధి ప్రాణాంతకమైంది కానప్పటికీ ఈ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే పద్ధతులు లేనప్పటికీ ఈ వ్యాధి తీవ్రత పెరగకుండా నియంత్రించడానికి మందుల్లో ఫైలేరియా సూక్ష్మక్రిములను నాశనం చేసేందుకు ఆల్బెండజోల్‌, ఐవర్‌ మెక్టిన్‌, డైఇథైల్‌ కార్బమజైన్‌ (DEC) -(హెట్రజన్‌), ఫ్లోరాసిడ్‌ మొదలైనవి ప్రసరణ మెరుగు పరిచేందుకు ''కౌమరిన్‌ డెరివేటివ్స్‌'' వంటి మందులను తొలిదశలో క్రమం తప్పకుండా తగిన మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం తీసుకోవడం చాలా అవసరం. ఈ మందులతో పాటు నిత్యం కాళ్లకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలాకాలం పాటు సైజు పెరగకుండా చూసుకోవచ్చు. మరీ కొండలా పెరిగితే మాత్రం సర్జరీ చేసి సైజును తగ్గించవచ్చును. ఈ సర్జరీ పద్ధతుల్లో మాత్రం ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతి వచ్చింది. సైజు తగ్గించే విషయంలో ఒకప్పటికంటే ఇప్పుడు ఫలితాలు చాలామెరుగ్గా ఉంటున్నాయి. బోద సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో '' డిఇసి '' మాత్రలు ఉచితంగా - మింగు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవంబర్‌ రెండవ వారంలో పెద్ద ఎత్తున అమలు పరచుచున్నారు. వయస్సుబట్టి 100 మి.గ్రా. నుండి 300 మి.గ్రాముల మోతాదు మాత్రలు మింగవలసి ఉంటుంది. మనిషికి మరియు దోమకు మధ్యగల జీవిత చక్రాన్ని తెంచుట ద్వారా వ్యాధి సంక్రమణను నిలుపుదల చేయుటయే డిఇసి చికిత్స ప్రధాన లక్ష్యం. ఈ డిఇసి మాత్రలు సంవత్సరానికి ఒకసారి ''ఎమ్‌డిఎ'' కార్యక్రమంలో తప్పకుండా 5 -7 సంవత్సరాలపాటు అర్హులైన వారందరూ మింగడం ఎంతో శ్రేయస్కరం. ఈ డిఇసి మాత్రలు రెండేళ్లలోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి ఇవ్వరాదు. ఖాళీ కడుపుతో డిఇసి మాత్రలు మింగరాదు. మరియు ప్రతి సంవత్సరం తేది 11 నవంబర్‌ జాతీయ ఫైలేరియా నివారణా దినంగా పాటిస్తున్నారు. (-జాతీయ బోదవ్యాధి నివారణ కార్యక్రమం)

  • ఫైలేరియా వ్యాధి ఉన్నవారు నిత్య జీవితంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
ఈ వ్యాధిగ్రస్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంత ప్రయోజనం ఉంటుంది. స్వచ్ఛమైన నీటిని ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా వ్యాధి సోకిన భాగాలను కాళ్లను తరచుగా మంచినీటితో శుభ్రంగా సబ్బుతో కడుక్కొని, పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకొని ఏదైనా యాంటీసెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌ పూయాలి. రోజూ క్రమం తప్పకుండా కాళ్లకు సంబంధించిన వ్యాయామం చేయాలి. కాలిని గోకడం, గీరటం వంటివేవీ చేయకూడదు. గోళ్ళను శరీరానికి సమంగా కత్తిరించాలి. పాదాలను పైకిఎత్తడం, దింపడం చేస్తూ ఉండాలి. రోజులో ఎక్కువ భాగం నిలబడకుండా కాళ్ళను పైకి పెట్టుకొని కూర్చోవాలి. కింద బాగా బిగువుగా పైన కొంత వదులుగా ఉండేలా కాళ్లకు రెండుపూటలా క్రేప్‌ బ్యాండేజ్‌ కడుతుండాలి. రాత్రిపూట బ్యాండేజ్‌ తీసేసి కాలిని ఎత్తులో పెట్టుకొని పడుకోవాలి. ఇటువంటి వ్యాయామాలు చేసేవారికి జ్వరం ఉండకూడదు. గుండె జబ్బులు ఉన్నవారు ఇటువంటి వ్యాయామాలు చేసేటప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. కాళ్లకు సరైన చెప్పులు వాడాలి.

అన్నిరకాల దోమలను కింది చర్యల ద్వారా అరికట్టవచ్చు :
  • మానవ నివాసాలకు పందులను ఊరికి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి.
  • దోమ గుడ్లను తినివేయి గప్పీ, గంబుషియా చేపలను బావులు, కొలనులు, పెద్ద పెద్ద నీటి గుంటల లోనికి వదలడం, పెంచడం,
  • దోమతెరలు వాడాలి.
  • ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు, తలుపులకు సన్నని జాలి బిగించుకోవాలి.
  • సంపూర్ణ వస్త్రధారణ,
  • ఓడామాస్‌ లాంటి ఆయింట్‌మెంట్లను, వేపనూనెను శరీరానికి పూసుకొని నిద్రించాలి.
  • ఇంట్లో జెట్‌, ఆల్‌ అవుట్‌, మస్కిటో కాయిల్‌ గాని ఉపయోగించాలి. సాయంత్రం వేళ కుంపట్లో గుప్పెడు వేపాకు పొగ వేసుకోవాలి,
  • సెప్టిక్‌ ట్యాంక్‌ గొట్టాలకు ఇనుప జాలీ బిగించడం.
  • ఇంటిలోపల, బయట పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూడడం, ఫ్లవర్‌వాజ్‌లో నీటిని ఎప్పటికప్పుడు మార్చడం, నీటి తొట్టెలను వారానికి ఒకసారి ఖాళీ చేసి మరలా నింపుకోవడం, (వారానికి ఒకరోజు డ్రై దినంగా పాటించాలి).
  • ఇంటిపైన ఓవర్‌హెడ్‌ ట్యాంకులు మొదలగు వాటిపై మూతలు ఉంచడం,
  • ఇంటి చుట్టుపక్కల మురికి నీరు నిల్వ ఉన్నట్లయితే ఆ నీటిలో ఆబేటు, బేటెక్స్‌, ''లార్విసైడ్‌'' మందులను స్ప్రే చేయాలి. లేదా కిరోసిన్‌, వేస్ట్‌ ఇంజన్‌ ఆయిల్‌ వేయాలి.
  • ఇళ్లలోని ఎయిర్‌ కూలర్స్‌, డ్రమ్ములు, కుండలు, రోళ్ళు, పూల కుండీలు, అలంకరణకై ఉపయోగించే మొక్కల కుండీలలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలి.
  • పక్షులు స్నానం కోసం వాడే నీటి పళ్ళాలు ఎప్పటికప్పుడు ఖాళీచేసి ఆరబెట్టడం,
  • త్రాగి పారవేసిన కొబ్బరి బొండాలు, కొబ్బరి చిప్పలు, ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు, పగిలిన సీసాలు, వాడి పడవేసిన పాత టైర్లు చెత్త కుండీలలో వేయాలి.
  • ఇళ్ళలో గోడలపై డిడిటి, మలాథియాన్‌, సింథటిక్‌ పైరత్రాయిడ్‌ పిచికారి (స్ప్రే) చేయించడం,
  • సాయంత్రంపూట పైరథ్రమ్‌ ఫాగింగ్‌ (పొగవదలడం) చేయాలి.
  • అన్నిటికంటే పరిసరాల పారిశుధ్యాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఈ పారిశుద్ధ్యం విషయంలో చెత్త నివారణ, మురికి నీరు, డ్రైనేజీ, పరిసరాల పరిశుభ్రత పాటించడంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలను చేపట్టాలి. పై మందులు చాలాప్రమాదకరమైనవి. ఆహార పదార్థాలపై ఈ మందులు పడకుండా జాగ్రత్త వహించాలి. చిన్న పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా భద్రపరచాలి. తాగునీటిలో ఈ మందులు చల్లరాదు. ఈ మందులు కలిపేటప్పుడు, చల్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.






  • ============================================

Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

Your comment is very important to improve the Web blog.