Tuesday, August 10, 2010

Heart attack and high cholesterol,గుండెపోటు-అధిక కొలెస్టిరాల్



  • Courtesy with -డా|| ఎ.వి.ఆంజనేయులు,సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,ఫోకస్‌ డయాగ్నస్టిక్స్‌,పంజగుట్ట, హైదరాబాద్‌ .

గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి.- దీనిని ఆదునిక వైద్యము లో " Ischemic Heart disease ' (Heart Attack) ఆంటారు .

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టి చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి.


గుండెపోటు ఎలా వస్తుంది :
* గుండె అనేది నిరంతరం కొట్టుకుంటూ ఉండే ఒక దృఢమైన కండరం. ఇది పనిచెయ్యాలన్నా.. దీనికీ రక్తం కావాల్సిందే. అందుకే ఈ గుండె కండరంలోనే మూడు కీలకమైన రక్తనాళాలుంటాయి.

* ఎప్పుడైనా ఈ రక్తనాళాల్లో పూడికలు వచ్చి... గుండె కండరానికి రక్తసరఫరాలో అవరోధం ఏర్పడితే.. గుండె పోటు వస్తుంది.

* ముఖ్యంగా గుండెలోని ఎడమవైపు ధమని(ఎల్‌ఏడీ)లో పూడికలు వచ్చే అవకాశాలు చాల ఎక్కువ. గుండెలో దాదాపు 40-45% కండరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ఇది! కాబట్టి మిగతా రక్తనాళాలతో పోల్చుకుంటే.. దీనిలో పూడిక వచ్చి.. అది మూసుకుపోయి, గుండెపోటు వస్తే గుండెకండరం దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

* గుండె పోటు రావటానికి మన చేతుల్లో ఉన్న కారణాలు కొన్ని. లేనివి కొన్ని. ఉదాహరణకు వంశపారంపర్యంగా గుండెపోటు రిస్కు ఉంటే దాని విషయంలో మనం చెయ్యగలిగింది తక్కువ. అలాగే స్త్రీలతో పోలిస్తే పురుషులకు రిస్కు ఎక్కువ. ఇలాంటి వాటిని మనం మార్చలేం. అదృష్టవశాత్తూ ఇలాంటివి చాలా కొద్ది సంఖ్యలోనే ఉన్నాయి. ఇవి కాకుండా.. మనం ముందస్తుగా జాగ్రత్త పడటానికి వీలైన అంశాలే చాలా ఉన్నాయి... హైబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌, ధూమపానం, మానసిక ఒత్తిడి, ఊబకాయం, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవటం.. ఇవన్నీ మనం నియంత్రించుకోవటానికి వీలైనవే కదా! మన నియంత్రణలో ఉండే రిస్కుల పట్ల కూడా మనం నిర్లక్ష్యం వహించటం మంచి విషయం కాదు.

* మధుమేహం, హైబీపీ రెండూ ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

* కొన్నిసార్లు రక్తంలో వచ్చే మార్పుల వల్ల కూడా రక్తనాళాల్లో రక్తం దానంతట అదే గడ్డకట్టే అవకాశం ఉంటుంది. అంతకు ముందు 30-40% పూడికలు ఉన్నా.. వాటి మీద ఈ రక్తం గడ్డ చేరి వెంటనే గుండెపోటు తెచ్చిపెట్టొచ్చు. ఒకసారి రక్తనాళంలో ఇలాంటిది అడ్డుగా తయారైతే.. ఇక కిందికి ఏ మాత్రం రక్తం వెళ్లక.. 5-10 నిమిషాల్లోనే ఆ కింది భాగం గుండె కండరమంతా చనిపోవటం ఆరంభమవుతుంది. ఇలా చనిపోయిన కండరాన్ని తిరిగి కోలుకునేలా చెయ్యటం చాలా కష్టం.

* గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే ఒక 'ఎకోస్ప్రిన్‌', లేదా 'సార్బిట్రేట్‌' బిళ్ల నోట్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, ముఖ్యంగా దానివల్ల నష్టమేం లేదు. ఛాతీలో నొప్పి అన్నది వచ్చిన తర్వాత.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆసుపత్రికి చేరాలి. ఎందుకంటే అది గుండెపోటు అయితే.. నిమిషాలు గడిచిన కొద్దీ గుండె కండరం చచ్చుబడిపోతుంటుందని మర్చిపోకూడదు. అది పొట్టలో అసిడిటీ వల్ల వచ్చిన నొప్పేమో, ఛాతీలో కండరం పట్టేసిందేమో.. ఇలా అనుకుంటూ తాత్సారం చెయ్యటం ఏమాత్రం మంచిది కాదు. చాలామంది నొప్పి మరీ తీవ్రంగా మారితేనేగానీ ఆసుపత్రికి రారు.. కానీ అప్పటికే చాలా నష్టం జరిగిపోయి ఉంటుంది. అలాకాకుండా వెంటనే ఆసుపత్రికి వస్తే.. 'ఈసీజీ' పరీక్షలో అది గుండెపోటు అని గుర్తిస్తే తక్షణం 'ప్రైమరీ యాంజియోప్లాస్టీ' చేసి, గుండె కండరం దెబ్బతినకుండా, వెంటనే నష్టాన్ని నివారించవచ్చు. గుండె కండరం ఒకసారి దెబ్బతిన్న తర్వాత.. యాంజియోప్లాస్టీ చేసినా, బైపాస్‌ సర్జరీ చేసినా.. ఏం చేసినా.. ఆ నష్టాన్ని పూర్తిగా సరిచెయ్యలేం. అప్పటికి దెబ్బ తిన్నది తిన్నట్టే. దెబ్బతినకుండా ఇంకా మిగిలి ఉన్న భాగాన్ని మాత్రమే రక్షించుకోగలం.

* ఇలా గుండె కండరంలో కొంతభాగం దెబ్బతిన్నప్పుడు మన ఆయుర్దాయం సహజంగానే కొంత తగ్గుతుంది. ఇలా జరగకుండా.. ఒకసారి గుండె కండరం దెబ్బతిన్నా కూడా దీర్ఘకాలం జీవించేందుకు, ఇతరత్రా దుష్ప్రభావాలు లేకుండా ఉండేందుకు ఎక్కువ మందులు వాడుతుండాలి, 'రీహాబిలిటేషన్‌' పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

రీహాబిలిటేషన్‌లో ఏం చేస్తారు?

ఆరోగ్యం అంచనా: ముందు రోగి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఏయే సమస్యలున్నాయన్నది అంచనా వేస్తారు. గుండె సామర్థ్యంతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తుల వంటి ఇతరత్రా అవయవాల పనితీరునూ క్షుణ్ణంగా పరీక్షిస్తారు. దీని ఆధారంగా రోగికి ఎటువంటి శిక్షణ అవసరం, ఎంత వరకూ ఇవ్వవచ్చన్నది నిర్ధారిస్తారు.

ఆహారం సలహాలు: రోజూ ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు? దానిలో కొవ్వు ఎంత? పండ్లూ కూరగాయలు తగినంతగా తింటున్నారా? లేదా? ముడిధాన్యం, చేపల వంటివి తీసుకుంటున్నారా? మద్యం అలవాటుందా? మధుమేహం, హైబీపీ వంటి సమస్యలున్నాయా? ఇవన్నీ పరిశీలించి అందుకు తగినట్లుగా రోజూ ఎటువంటి ఆహారం, ఎలా తీసుకోవాలో, కొలెస్ట్రాల్‌ వంటివి ఎలా తగ్గించుకోవాలో సిఫార్సు చేస్తారు. రీహాబిలిటేషన్‌లో ఈ 'డైట్‌ కౌన్సెలింగ్‌' చాలా కీలక అంశం.

బరువు: బీఎంఐ ఎక్కువుంటే క్రమేపీ బరువు తగ్గేందుకు సూచనలు చేస్తారు. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు లేని ఆహారం ఎలా తీసుకోవాలి, వ్యాయామం, శారీరక శ్రమ ఏ తీరులో పెంచాలన్నది సూచిస్తూ.. ఆశించిన మేర బరువు తగ్గేలా సలహాలిస్తారు.

మధుమేహం, బీపీ, కొలెస్ట్రాల్‌: గుండె జబ్బులకు సంబంధించి ఈ మూడింటినీ నియంత్రిణలో ఉంచుకోవటం అత్యంత కీలకమైన అంశం. ఈ మూడూ అదుపులో లేకపోతే- కొత్తగా అతికిన రక్తనాళాలు కూడా త్వరగానే పూడుకుపోతాయి, లేదా పాడైపోతాయి. అందుకే బీపీ ఎంత ఉంటోంది? చెడ్డ కొలెస్ట్రాల్‌, మంచి కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయి? మధుమేహం అదుపులో ఉంటోందా? పరీక్షిస్తుంటారు. వీటిని అదుపులోకి తేవటానికి మందులు, ఆహారం, వ్యాయామాల వంటివన్నీ సూచిస్తూ, అవి ఏ తీరులో తగ్గుతున్నాయో ఎప్పటికప్పుడు సరిచూస్తుంటారు.

పొగ: మరోసారి గుండెపోటు రాకుండా ఉండాలన్నా, దెబ్బతిన్న గుండె రక్తనాళాలు తిరిగి బాగవ్వాలన్నా పొగ మానెయ్యటం చాలా ముఖ్యం. దానితో వచ్చే ముప్పులేమిటో, మానేస్తే లాభాలేమిటో వివరిస్తూ దాన్ని వదిలించుకునే క్రమంలో తలెత్తే డిప్రెషన్‌, కోపం వంటి భావోద్వేగాలనూ నెగ్గుకురావటమెలాగో నేర్పిస్తూ.. క్రమేపీ ఆ వ్యసనాన్ని వదిలించుకునేలా సహకరిస్తారు.

మానసిక సాంత్వన: గుండె జబ్బు నుంచి కోలుకుంటున్న వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌, కోపం, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యలు ఎన్నో తలెత్తుతుంటాయి. వీటిని నెగ్గుకురావటానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి రీహాబిలిటేషన్‌లో భాగంగా ఇచ్చే కౌన్సెలింగ్‌ ఉపయోగపడుతుంది. యోగా, ధ్యానం, రోజూ కొంత సమయం కుటుంబంతో గడపటం, అప్పుడప్పుడు విహారానికి వెళ్లటం, ప్రశాంత వాతావరణంలో గడపటం వంటి వాటివల్ల ప్రయోజనం ఉంటుంది.

వ్యాయామం: గుండెకు అతిపెద్ద శత్రువు ఏ వ్యాయామమూ లేని జీవనశైలి! గుండెపోటుకు ఇది ముఖ్యమైన ముప్పు కారకం. అందుకే గుండె తిరిగి ఆరోగ్యంగా, సమర్థంగా తయారవ్వటానికి ఫిజియోథెరపిస్టులు, రీహాబిలిటేషన్‌ స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఇచ్చే వ్యాయామ శిక్షణ కీలకమని గుర్తించాలి. రెండోది- చాలామందికి వ్యాయామ సమయంలో గుండె సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంటుంది. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చెయ్యటం సురక్షితం. రోగి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, వ్యాధులను బట్టి ఎవరు ఏ స్థాయి వ్యాయామాలతో ఆరంభించాలి, ఎంతసేపు చెయ్యాలి, పరిమితులేమిటన్న సూచనలన్నీ స్పష్టంగా రూపొందిస్తారు. వ్యాయామం చేస్తున్నంత సేపూ ప్రత్యేక పరికరాల ద్వారా బీపీ, గుండె వేగం, ఊపిరితిత్తుల పనితీరు వంటివన్నీ ఎలా ఉంటున్నాయో పరిశీలిస్తూ ఉంటారు. క్రమేపీ ట్రెడ్‌మిల్‌, స్టేషనరీ సైకిల్‌ వంటి వాటితో ఏరోబిక్‌ వ్యాయామాలకు ప్రాధాన్యం ఇస్తూ.. దశల వారీగా తీవ్రత పెంచుతారు. తర్వాత దశలో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలూ చేయిస్తారు. ఇలా ఐదారు వారాల పాటు నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చెయ్యటం వల్ల తాము ఎంత వరకూ చెయ్యచ్చు? ఏ పరిమితి దాటకూడదన్నది రోగులకే అర్థమవుతుంది. ఆ తర్వాత రోజువారీ ఇంటి వద్ద తిరగటం, మెట్లు ఎక్కటం వంటివన్నీ ఎలా చెయ్యాలో నేర్పిస్తారు. వ్యాయామంతో శారీరక సామర్థ్యం మెరుగై గుండె కొట్టుకునే వేగం, బీపీ, గుండె కండరానికి ఆక్సిజన్‌ అవసరాల వంటివన్నీ మెరుగవుతాయి. వ్యాయామంతో మంచి కొలెస్ట్రాల్‌ పెరగటం, సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ తగ్గటం, మధుమేహం అదుపులోకి రావటం వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

మందులు: ఒకసారి గుండె జబ్బు పడినవారు జీవనశైలిలో మార్పులతో పాటు వైద్యుల సిఫార్సు మేరకు కొన్ని రకాల మందులు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి: రక్తనాళాలు సంకోచించకుండా కాస్త విప్పారినట్టు ఉంచే 'వేసో డైలేటర్స్‌', రక్తం గడ్డకట్టకుండా పల్చగా ఉండేలా చూసేందుకు తక్కువ డోసులో 'ఆస్పిరిన్‌', రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు, తద్వారా రక్తనాళాల్లో మళ్లీ కొవ్వు పూడికలు రాకుండా చూసేందుకు 'స్టాటిన్స్‌', గుండె కండరం విశ్రాంతిగా ఉంటూ.. సమర్థంగా రక్తాన్ని పంపింగ్‌ చేసేందుకు దోహదపడే 'బీటా బ్లాకర్స్‌' రకం మందులు అవసరం.

మరికొన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి - > గుండెపోటు

భారతీయుల్లో గుండెపోటు :
ప్రపంచ జనాభాతో పోలిస్తే... మన భారతీయులను చిన్నవయసులోనే గుండెపోటు కబళిస్తోందని తాజాగా ఎన్నో అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. నవతరం 20, 30 ఏళ్లు కూడా దాటక ముందే గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళనకర పరిణామం. ఇంటికీ, దేశానికీ వెన్నెముకగా నిలబడాల్సిన యువత ఇలా అర్ధాయుష్షుతో కుప్పకూలిపోతుండటం పెను విపత్తుకు చిహ్నం. అందుకే పరిశోధనా రంగం ఇప్పుడు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెడుతోంది.
దీన్ని అడ్డుకునేదెలా? దీనికి మనమేం చెయ్యాలి? ఈ రెండే ఇప్పుడు మన ముందున్న కీలక ప్రశ్నలు.

పది, పదిహేనేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం మన దేశంలో గుండెపోటు, గుండె జబ్బుల బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇది యువతీ యువకుల్లోనూ.. అంటే 20, 30, 40 ఏళ్ల వారిలోనూ ఎక్కువగా కనిపించటం ఆందోళనకర పరిణామం. ఒకప్పుడీ పరిస్థితి లేదు. అందుకే భారతీయ సంతతినీ - పాశ్చాత్యులనూ పోలుస్తూ అమెరికా, బ్రిటన్‌, కెనడాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. వీటిలో ఎన్నో ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైనఅంశాలు వెలుగు చూశాయి. పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులు 4 రెట్లు ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నట్టు తేలింది. చిన్నవయసులోనే రావటం, హఠాత్తుగా రావటం మాత్రమే కాదు.. భారతీయుల్లో గుండెపోటు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. వీరిలో చాలామందిలో గుండెలోని రక్తనాళాలు- ఆపరేషన్‌తో కూడా సరిచేయలేనంత విస్తృతంగా చాలా ప్రాంతాల్లో మూసుకుపోవటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. దీనిపై మన దేశంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడి కావటం విశేషం.
కారణాలు అనేకం
భారతీయులకు గుండె పోటు ఎందుకింత త్వరగా, తీవ్రంగా వస్తోంది? మిగతా జాతీయులతో పోలిస్తే వీరికి గుండెలోని రక్తనాళాలు పూడుకుపోవటమన్న సమస్య (సీఏడీ) ఎందుకు ఎక్కువగా ఉందన్న దానిపై లోతుగా అధ్యయనాలు జరుగుతున్నాయి.

* జన్యు స్వభావం: జన్యుపరంగానే భారతీయులకు గుండెపోటుకు కారణమయ్యే ముప్పులు(రిస్కులు) ఎక్కువగా ఉంటున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది మధుమేహం, చెడ్డకొలెస్ట్రాల్‌.

* మధుమేహం: ఐరోపా, అమెరికా జాతీయులతో పోలిస్తే భారత ఉపఖండంలో మధుమేహం 3-6 రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఊబకాయంతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే ఎంతోమంది మధుమేహం బారిన పడుతున్నారు. 50 ఏళ్ల వయసు వచ్చేసరికే జనాభాలో 50% మంది మధుమేహంతోనో, మధుమేహానికి దగ్గర్లోనో (ప్రీడయాబిటీస్‌) ఉంటున్నారు.

* చెడ్డ కొలెస్ట్రాల్‌: చిన్నవయసులో గుండెపోటుకు కారణమవుతున్న మరో ముఖ్యమైన అంశం, కొత్తగా గుర్తించిన అంశం- భారతీయుల్లో లైపోప్రోటీన్‌ 'ఎ' అనే రకం చెడ్డ కొలెస్ట్రాల్‌ చాలా ఎక్కువగా ఉంటుండటం. ఇది అత్యంత ప్రమాదకారి. (దీని గురించి బాక్సులో వివరంగా) మన దేశంలో సరైన తిండి లేని పేదల్లో కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి ఇది కొవ్వుపదార్థాల వంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల వచ్చేది కాదని, దీనికి జన్యు స్వభావం కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు.

* జీవన శైలి: నానాటికీ పాశ్చాత్య పోకడలను ఒంట బట్టించుకుంటూ శారీరక శ్రమకు దూరమవుతుండటం వల్ల ఊబకాయం, మధుమేహం, హైబీపీ వంటి రిస్కులు పెరిగి... అవి గుండెపోటుకు దారి తీస్తున్నాయి. పొగతాగటం, ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తినటం వంటివి వీటికి అదనం.

మన చేతుల్లో కీలకాంశాలు
* బొజ్జ: పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవటం గుండెకు చేటు. మన దేశంలో సుమారు 30 శాతం మందిలో ఈ బొజ్జ సమస్య ఉంది. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వంటి ఎన్నో రుగ్మతలను తెచ్చిపెడుతుంది, ఇవన్నీ కలిసి గుండెపోటు ముప్పు పెంచుతాయి. కాబట్టి నడుం కొలత పురుషుల్లో 90 సెం.మీ., స్త్రీలల్లో 80 సెం.మీ. మించకుండా చూసుకోవాలి. అందుకే 'వెయిస్ట్‌ లైన్‌ ఈజ్‌ యువర్‌ లైఫ్‌ లైన్‌' అనే నినాదం ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగని సన్నగా ఉండేవారిలో అధిక కొలెస్ట్రాల్‌ ఉండదనుకుంటే కూడా పొరబడ్డట్టే. వాళ్లూ కొలెస్ట్రాల్‌తో సహా గుండె రిస్కుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవటమే ఉత్తమం.

ఆహారం
* హాని చేసేవి: గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే.. కొవ్వు పదార్థాలు సాధ్యమైనంత తక్కువ తీసుకోవటం అవసరం. వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలు తక్కువ తీసుకోవాలి. ఆలివ్‌ నూనె, సోయాబీన్‌ నూనె, పొద్దు తిరుగుడు నూనె వంటివి గుండెజబ్బు ముప్పును నివారించటంలో బాగా ఉపయోగపడతాయి. అయితే వీటినీ చాలా మితంగానే తీసుకోవాలి. ఒకసారి బాగా కాచిన నూనెను తిరిగి వాడటం కూడా ప్రమాదకరం. కొవ్వు పదార్థాల్లో 'ట్రాన్స్‌ఫ్యాట్స్‌' చాలా ప్రమాదకరం. వనస్పతితో తయారయ్యే వాటిల్లో ఇవి ఎక్కువుంటాయి. పామాయిల్‌ కూడా హాని చేస్తుంది.
* కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్‌, వేపుళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
* శాకాహారులు కూడా.. మాంసం తినటం లేదన్న మిషతో... వెన్న నెయ్యి, చీజ్‌, పెరుగు, ఐస్‌క్రీమ్‌ వంటివి ఎక్కువెక్కువగా తినేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదకరమైనవే. కాబట్టి శాకాహారులు కొవ్వుల విషయంలో జాగ్రత్త వహించకపోతే గుండెజబ్బు కొని తెచ్చుకున్నట్టే.
* మేలు చేసేవి: ఎండు పప్పుల్లో (నట్స్‌) ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, విటమిన్లు, పొటాషియం.. మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో 45-80 శాతం కొవ్వు ఉన్నా ఇది అసంతృప్త కొవ్వు కావటం వల్ల రక్తనాళాలకు మేలు చేస్తుంది. కాబట్టి బాదం, వాల్‌నట్‌, వేరుశెనగ, పిస్తా వంటి వాటిని రోజుకి 40-70 గ్రాముల వరకు తినాలి.
* వారానికి కనీసం రెండు సార్త్లెనా చేపలు తీసుకోవటం మంచిది.
* పండ్లు, కూరగాయల్లో పీచు, బి విటమిన్లు, సి విటమిన్‌, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, హోమోసిస్టీన్‌ పెరగకుండా చూస్తాయి, మొత్తమ్మీద గుండె జబ్బు ముప్పునూ తగ్గిస్తాయి. పండ్లు, కూరగాయలు కలిపి రోజుకు 10 కప్పులైనా తీసుకోవటం మంచిది.
* దంపుడు బియ్యం తినాలి. తెల్లగా పాలిష్‌ పట్టించిన బియ్యం తినే వారిలో కంటే దంపుడు బియ్యం తినేవారిలో మధుమేహం 15-20 శాతం తక్కువ. గుండె జబ్బుల ముప్పు తక్కువని గుర్తించారు.
* పొగ మానేయటం తక్షణావసరం. రోజూ వ్యాయామం చేయటం, చేపల వంటి వాటిల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆసిడ్లను ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అప్పటికీ మంచి కొలెస్ట్రాల్‌ తక్కువ ఉంటుంటే వైద్యుల పర్యవేక్షణలో 'నియాసిన్‌' విటమిన్‌ తీసుకోవటం మేలు చేస్తుంది. పైగా ఇది ప్రమాదకరమైన లైపోప్రోటీన్‌-ఎ స్థాయినీ తగ్గిస్తుంది.
మనకు మధుమేహంలో టైప్‌-1, టైప్‌-2 అని రెండు రకాలుంటాయని తెలుసు. అలాగే గుండెపోటుకు దారి తీసే గుండె జబ్బులో కూడా మూడు రకాలున్నాయి.
* టైప్‌- 1: చాలా చిన్నవయసులోనే గుండెలోని రక్తనాళాలు కొవ్వుతో మూసుకుపోతుండే అత్యంత ప్రమాదకర రకం ఇది. సాధారణంగా గుండె జబ్బు 55-60 ఏళ్ల వారిలో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ రకం 45 ఏళ్ల లోపే.. చిన్నవయసులోనే ఆరంభమైపోతుంది. కొందరికి 30 ఏళ్లలోపే గుండెలోని రక్తనాళాల్లో 70% వరకూ మూసుకుపోయి తీవ్రమైన గుండె జబ్బు ఆరంభమైపోతుంది కూడా. మధుమేహం, హైబీపీ వంటి ముప్పులేమీ లేకుండా కూడా వీరిని గుండెజబ్బు కబళిస్తుండటం గుర్తించాల్సిన అంశం. పైగా ఒకసారి ఈ రకం గుండెజబ్బు బారినపడ్డారంటే ఎంత చికిత్స చేసినా ఆ దుష్పరిణామాలను తప్పించుకోవటం కష్టంగా కూడా ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన 'మాలిగ్నంట్‌' రకం గుండె జబ్బు అంటున్నారు. దీనికి చెడ్డ కొలెస్ట్రాల్‌లో భాగమైన 'లైపోప్రోటీన్‌ ఎ' అనేదే ప్రధాన కారణమవుతోంది.
* టైప్‌-2: వయసు పైబడిన వారిలో అంటే 50, 60 ఏళ్ల తర్వాత సాధారణంగా తరచూ చూస్తుండే రకం ఇది. వీరిలో హైబీపీ, మధుమేహం వంటి రిస్కులన్నీ ఉంటాయి.
* టైప్‌ 3: ఇందులో పైన పేర్కొన్న రెండు రకాల లక్షణాలూ కనిపిస్తాయి. ఇది 45-65 ఏళ్ల లోపు ముంచుకొస్తుంది, వీరిలో హైబీపీ, మధుమేహం వంటి రిస్కులే కాదు.. లైపోప్రోటీన్‌-ఎ వంటి ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న ముప్పులూ కనబడతాయి.

కొత్త ముప్పుపై కన్నేసి ఉంచండి!
లైపోప్రోటీన్‌ 'ఎ'
జన్యుపరంగా సహజంగానే భారతీయుల్లో చెడ్డకొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌) అధికంగా ఉంటోంది. దీనికి తోడు ట్రైగ్లిజరైడ్లు, ఏపీఓబీ, ఏపీఓఎ1 వంటివీ ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా ఉండాల్సిన మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌) తక్కువగా ఉంటోంది. ఇవన్నీ గుండెజబ్బుకు దారి తీసేవే. వీటికి తోడు గుండెలోని రక్తనాళాలు మూసుకుపోవటంలో కీలక పాత్ర పోషించే 'లిపోప్రోటీన్‌-ఎ' కూడా భారతీయుల్లో చాలా ఎక్కువగా ఉంటోంది. ఇది నేరుగా రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. సాధారణంగా ఇది 20 ఎంజీ కన్నా తక్కువ ఉండాలి. ఇది 100 ఎంజీకి చేరుకుంటే చాలా త్వరగా రక్తనాళాల్లో పూడిక తెప్పిస్తుంది. ఇలాంటి వారికి స్టెంట్స్‌ అమర్చినా అవి కూడా త్వరగా పూడుకుపోతుంటాయి. అందుకే ఇది చాలా ప్రమాదకరమైందని అనుకోవచ్చు. స్వతహాగా ఇది నష్టం కలిగించటమే కాదు.. 'అగ్నికి ఆజ్యం'లా ఇతరత్రా ముప్పులకు తోడై.. పరిస్థితి త్వరగా ముదిరేలా కూడా చేస్తోంది.
ఈ లైపోప్రోటీన్‌-ఎ ఎక్కువ ఉండటంతో పాటు...
* మంచి కొలెస్ట్రాల్‌ తక్కువ ఉంటే- రిస్కు 8 రెట్లు ఎక్కువ.
* చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే- ముప్పు 12 రెట్లు ఎక్కువ.
* మధుమేహం ఉంటే- ముప్పు ఏకంగా 16 రెట్లు ఎక్కువ.


ముఖ్యంగా...
* పైవేమీ లేకపోయినా.. కేవలం లైపోప్రోటీన్‌-ఎ ఒక్కటే అధికంగా ఉన్నా సరే.. గుండెపోటు వ్యాధి ముప్పు 3 రెట్లు ఎక్కువ.
అందుకనే ఇటీవలి కాలంలో చెడ్డకొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటివాటితో పాటు ఈ 'లైపోప్రోటీన్‌-ఎ' మీద కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. గుండె జబ్బుల ముప్పు ఎంత మేరకు ఉందని చెప్పేందుకు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పరీక్షలన్నింటినీ కలిపి 'కరోనరీ రిస్క్‌ ప్రొఫైల్‌' అని ఒకే పేరు కింద చేస్తున్నారు. దీన్ని 20-30 ఏళ్ల వయసు వారు ఒకసారైనా చేయించుకోవటం మంచిది. వీటిలో ఏవైనా ఎక్కువగా ఉన్నాయని గుర్తిస్తే వెంటనే చికిత్సతో చక్కదిద్దవచ్చు. పరిస్థితి గుండెపోటు వరకూ రాకుండా చూసుకోవటానికి ఇది ఉత్తమ పద్ధతి!
* వృద్ధుల్లో గుండెపోటు రావటానికి, యువకుల్లో రావటానికీ తేడా ఉంది. వృద్ధుల్లో గుండె నొప్పి, నడుస్తుంటే ఆయాసం రావటం, క్రమేపీ పనులు చేయలేకపోవటం వంటి ముందస్తు లక్షణాలు కనబడతాయి. కానీ యువకుల్లో ఇలాంటివేవీ కనిపించకుండానే హఠాత్తుగా గుండెపోటు ముంచుకొస్తోంది. పైగా ఈ వయసులో గుండె పోటు రాదన్న ధీమాతో దాన్ని ఎసిడిటీ సమస్యగా పొరబడే ప్రమాదం ఎక్కువ. అందుకే యువతలో గుండెపోటు మరణాల రేటూ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి రెండేళ్లకొక సారైనా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది.

--డా|| ఎ.వి.ఆంజనేయులు,సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,ఫోకస్‌ డయాగ్నస్టిక్స్‌,పంజగుట్ట, హైదరాబాద్‌ .

దీర్ఘకాలము మధుమేహంతో గుండెపోటు!
ఒకసారి గుండెపోటు వచ్చినవారికి రెండోసారి వచ్చే అవకాశం ఎక్కువేనన్నది తెలిసిన విషయమే. కానీ చాలాకాలంగా టైప్‌2 మధుమేహం గల మగవారికీ ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంటుందని బ్రిటన్‌లో చేసిన తాజా పరిశోధనలో వెల్లడైంది. మధుమేహం వచ్చి ఎంత కాలం అయింది? అన్న దాన్నిబట్టి గుండెపోటు ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. సగటున పదిహేడు ఏళ్లు, అంతకన్నా ఎక్కువకాలంగా మధుమేహంతో బాధపడుతుంటే ఈ ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఇది ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో ఉండే ముప్పుతో సమానం. ఇక ఐదేళ్లుగా మధుమేహం గలవారిలో 54 శాతం రిస్క్‌ ఎక్కువ. ఎనిమిదేళ్ల క్రితం నుంచి మధుమేహంతో బాధపడే పురుషుల్లో గుండె సమస్యలు గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. అంటే 60 ఏళ్ల కన్నా ముందు ఎంత త్వరగా మధుమేహం మొదలైతే గుండెపోటు వచ్చే అవకాశమూ అంతే అధికంగా ఉంటోందని దీని ద్వారా తెలుస్తోంది. అయితే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ రక్షణ ప్రభావం కారణంగా స్త్రీలల్లో ఈ ముప్పు కాస్త ఆలస్యంగా మొదలవుతుండటం విశేషం.

ట్రాఫిక్‌ కాలుష్యంతో గుండెపోటు
నగరాల్లో ట్రాఫిక్‌రద్దీ కారణంగా తలెత్తే వాయుకాలుష్యంతో గుండెపోటు సంభవించే ప్రమాదం ఉందని భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాయుకాలుష్యం ప్రభావం ఆరుగంటలపాటు ఉంటోందని పేర్కొన్నారు. లండన్‌ ఆరోగ్య, ఉష్ణమండల వైద్య పాఠశాలకు చెందిన కృష్ణన్‌ భాస్కరన్‌ తన సహచరులతో కలిసి.. గుండెపోటుకు కాలుష్యానికి మధ్య ఉన్న సంబంధంపై విస్తారంగా అధ్యయనం జరిపారు. దీంట్లో భాగంగా బ్రిటన్‌లో 2003-06 మధ్య కాలంలో సంభవించిన 80 వేల గుండెపోటు కేసులను పరిశీలించారు. గుండెపోటు వచ్చిన సమయాల్లో బ్రిటన్‌లోని వివిధ నగరాల్లో గంటగంటకూ నమోదైన వాయుకాలుష్యం మోతాదులను కూడా లెక్కలోకి తీసుకున్నారు.

గుండెను కాపాడే వెల్లుల్లినూనె

వెల్లుల్లి నూనెలోని ఒక భాగం గుండెపోటు తర్వాత గుండె చికిత్సకు ఉపయోగించొచ్చని ఎమోరి యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు తెలిపారు. గుండెపోటు తర్వాత గుండె సంరక్షణకు వెల్లుల్లి నూనెలోని 'డియలిల్‌ ట్రిసుల్‌ఫైడ్‌' గుండెపోటు తర్వాత గుండెను సంరక్షించే సంయోగపదార్థాలను విడుదల చేయడంలో సహకరిస్తుందని పేర్కొన్నారు.

ఆవేదనతోనూ గుండెపోటు-Heart attack with Depression

కుటుంబంలో అత్యంత సన్నిహితులు మరణించినప్పుడు ఎవరైనా విలవిల్లాడిపోవటం సహజమే. తీవ్ర ఆవేదనతో చాలారోజుల పాటు కుమిలిపోవటమూ తెలిసిందే. ఇలా ఆత్మీయులను కోల్పోయిన బాధను రచయితలు గుండెకోత, గుండె బరువెక్కటం వంటి పదాలతో వర్ణిస్తుంటారు కానీ.. ఇలాంటి సమయాల్లో నిజంగానే గుండెపోటు ముప్పూ పొంచి ఉంటుందంటే నమ్ముతారా? తాజా అధ్యయనంలో ఈ విషయమే బయటపడింది. గుండెపోటు మూలంగా ఆసుపత్రిలో చేరిన కొందరిపై ఇటీవల శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. పిల్లలు, భర్త, భార్య, తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ములు.. ఇలా కుటుంబంలో సన్నిహితులు ఎవరైనా ఇటీవలే మరణించారా? అనే విషయాన్ని పరిశీలించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆత్మీయులు మరణించిన నాడే ఆ బాధతో కుమిలిపోయేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం 21 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. రోజులు గడుస్తున్నకొద్దీ ఈ ముప్పు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. ఈ ప్రమాదం నెల వరకు కొనసాగుతుండటం గమనార్హం. తీవ్ర ఆవేదనకు లోనయ్యేవారిలో కుంగుబాటు, కోపం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అలాగే వీరిలో నిద్రలేమి, ఆకలి తగ్గటం, ఒత్తిడి హార్మోన్‌ కార్టిసోల్‌ అధిక స్థాయిలో ఉండటమూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు ప్రమాదాన్ని తెచ్చిపెట్టటానికి దోహదం చేస్తున్నాయి. అందువల్ల ఆవేదన, బాధలకు గురైన సమయాల్లో ఛాతీలో అసౌకర్యం, నొప్పి.. మెడ, దవడ, వెన్ను, చేతుల్లో అసౌకర్యం.. శ్వాసలో ఇబ్బంది.. వికారం.. కళ్లు తిరగటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ గుండెపోటు లక్షణాలను సూచించేవే అని మరవరాదు
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.