Wednesday, March 5, 2014

Bleeding at menopause, మెనోపాజ్‌లో రక్తస్రావం

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Bleeding at menopause, మెనోపాజ్‌లో రక్తస్రావం -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    నెలసరి సమయంలో రక్తస్రావం కావడం ఎంత సహజమో.. మెనోపాజ్‌ వచ్చాక కొద్దిగానైనా సరే రక్తస్రావం కనిపించడం అంతే ప్రమాద సంకేతం. అంతకన్నా ముందు అసలు ఎలాంటి పరిస్థితుల్లో అలా జరుగుతుంది.. దాన్నుంచి బయటపడేందుకు ఏం చేయాలనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం..

మెనోపాజ్‌ దశ అంటే స్త్రీ శరీరంలోని అండాశయాల్లో నిల్వ ఉన్న అండాలన్నీ కరిగిపోయి విడుదల ఆగిపోతుంది. హార్మోన్ల ఉత్పత్తి కూడా ఉండదు. దాంతో పన్నెండు, పద్నాలుగేళ్ల వయసులో మొదలైన రుతుక్రమం నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో రక్తస్రావం కొద్దిగానైనా సరే కనిపించినప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే నలభైఏళ్లలోపు రుతుక్రమంలో మార్పు వచ్చినా క్యాన్సర్‌ రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ.. ఏళ్లు గడిచేకొద్దీ ఆ ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా అయితే యాభై, అరవైఏళ్లు దాటాక ఇలా రక్తస్రావం కనిపిస్తే.. ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం పది నుంచి పదిహేను శాతం వరకూ ఉంటుంది. అలాంటప్పుడు మందులివ్వడం, డీఅండ్‌సీ చేయడం లాంటి చిన్న చికిత్సలు సరిపోవు. కూలంకషంగా పరిశీలించి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ చేయించుకోవాల్సిన పరీక్షలు..
ఇలాంటి పరిస్థితుల్లో అల్ట్రాసౌండ్‌, ట్రాన్స్‌వెజైనల్‌ స్కాన్‌ చేస్తారు. ఈ పరీక్షలో గర్భాశయ పనితీరూ, ఎండోమెట్రియం పొర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్‌ దశ దాటిన స్త్రీలలో ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు కాబట్టి ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ వల్ల గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి గురించి తెలుస్తుంది. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరగడం, కణుతుల్లాంటివి ఉంటే అసహజమని భావించాలి.

స్కాన్‌ కాకుండా అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్‌ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఎలాంటి మత్తూ, ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా చిన్న గొట్టం ద్వారా నమూనాను సేకరిస్తారు. అయితే దీనివల్ల సమస్య ఉన్న నమూనానే రాకపోవచ్చు. దాంతో రిపోర్టు తప్పుగా రావచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ డీఅండ్‌సీ (డైలటేషన్‌ అండ్‌ క్యూరటార్జీ) పద్ధతిలో నమూనాలను సేకరించేవారు. అంటే విడివిడిగా గర్భాశయం పైభాగం, కిందిభాగం, గర్భాశయ ముఖద్వారం నుంచి సేకరించేవారు. అప్పుడూ నూటికి నూరుశాతం కచ్చితమైన ఫలితం వస్తుందని చెప్పలేం.

ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. గర్భాశయ ముఖద్వారం నుంచి సన్నని టెలిస్కోప్‌ని లోపలికి పంపి, కెమెరా ద్వారా మానిటర్‌పై చూస్తారు. భూతద్దంలో చూసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా సరైన చోటనుంచే సేకరించవచ్చు. గర్భాశయం లోపలి పొర మందం, పాలిప్‌, ఫైబ్రాయిడ్‌, క్యాన్సర్‌ కణితి లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా చిన్నచిన్న పాలిప్స్‌, ఫైబ్రాయిడ్ల లాంటివి గుర్తించడంతోపాటూ అదే సమయంలో చికిత్స కూడా చేయొచ్చు. సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్‌ ఇన్‌ఫ్యూజన్‌ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు.

ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించకపోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్‌ లాంటివి చేయాల్సి రావచ్చు. ఈ ఫలితాలను బట్టి ఏం చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు..

ఇతర కారణాలూ ఉంటాయి..
వృద్ధాప్యంలో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే చాలామందికి అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. అందుకే వైద్యులు ముందు జననేంద్రియభాగం చుట్టుపక్కల ఉండే ఇతర అవయవాలనూ వివరంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, అక్కడి నుంచి రక్తస్రావం అవుతుంది.

జననేంద్రియాల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్‌, ఉన్నా ఇలా జరుగుతుంది. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్‌ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది.

మెనోపాజ్‌ దశ దాటాక హార్మోన్లు (హెచ్‌ఆర్‌టీ) వాడే వారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ కోసం వాడే టామోక్సిఫిన్‌ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్‌, మరికొందరిలో ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా క్యాన్సర్లు వస్తాయి. ఈ పరిస్థితిని 'లించ్‌ సిండ్రోమ్‌' అంటారు.

సాధారణ కారణాలే అయితే..
ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్‌ ఫలితం మామూలుగానే ఉన్నప్పుడూ రక్తస్రావం కనిపించినా భయపడాల్సిన అవసరంలేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఎండోమెట్రియం పొర ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ అని తేలితే మళ్లీ ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసి ఆ క్యాన్సర్‌ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్‌ గ్రంథులూ, కాలేయం, వూపిరితిత్తులకూ చేరిందా అనేవి గమనిస్తారు వైద్యులు. దాన్ని బట్టి ఎలాంటి శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ ఉన్నా చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్‌, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది చెబుతారు. ఒకవేళ క్యాన్సర్‌ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే... పాలిప్స్‌, ఫైబ్రాయిడ్ల లాంటివి ఉంటే తొలగిస్తారు. ఎండోమెట్రియం పొర మందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్‌ హార్మోను సూచిస్తారు. లేదంటే హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి 'ఎట్రోఫిక్‌ ఎండోమెట్రియం' పరిస్థితి వస్తుంది. అప్పుడు హార్మోన్లు వాడమంటారు వైద్యులు.

ముందు జాగ్రత్తలు ముఖ్యమే..
అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం ఉన్నవారికి రెండు నుంచి నాలుగు రెట్లు సమస్య బారినపడే అవకాశాలెక్కువ. కాబట్టి వ్యాయామం చేయడం తప్పనిసరి.

పీసీఓడీ ఉన్న వారు తప్పనిసరిగా మందులు వాడాలి. పిల్లలు కలిగాక వైద్యుల సలహాతో గర్భనిరోధక మాత్రలు లేదా మిరేనా(ప్రొజెస్టరాన్‌ లూప్‌)ని వాడటం వల్ల ఎండోమెట్రియం పొర ఎదుగుదలను అదుపులో ఉంచొచ్చు. హెచ్‌ఆర్‌టీ తీసుకునే వారు ఈస్ట్రోజెన్‌తో పాటూ తప్పనిసరిగా ప్రొజెస్టరాన్‌ని వాడాలి.

కుటుంబంలో లింఛ్‌ సిండ్రోమ్‌ ఉన్న స్త్రీలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర గురించి తెలుసుకోవాలి.

  • Courtesy with Dr. prameladevi , Senior Gyanecologist ,Nellore
  • ================================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.