Friday, December 17, 2010

దీర్ఘాయుస్సుకు దశసూత్రాలు , Ten tips for long-live



ప్రతి వారు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించాలని ఆశిస్తారు. అయితే ఆ కోరిక కొందరికి మాత్రమే నెరవేరుతుంది. ఆధునిక కాలంలో అధికశాతం నడివయస్సుకే నడుము వొంగిపోయి, నరాలు బలహీనపడి, మనసు కృంగిపోయి, రోగాలు మూట కట్టుకుని కుమిలిపోతుంటారు. అయితే ప్రతివారు తమ జీవన విధానాన్ని చక్కదిద్దుకోవడం ద్వారా యశస్సును పొందవచ్చు. అందుకు దశ సూత్రాలు దోహదపడతాయ. వాటిని చూడండి.

వేదకాలం నుంచీ మన జీవన విధానాలు, నైతిక విలువలు, నడవడిక తదితర అంశాల గురించి తాత్వికులు బోధిస్తూనే ఉన్నారు. పతంజలి యోగి అష్టాంగ యోగాలు, బుద్ధుని అష్టాంగ మార్గాలు లాంటివి ఎన్నో మన పెద్దలు రూపొందించి అందిస్తున్నారు. అయితే వాటిని ఆచరించడంలో మనం నిర్లక్ష్యం వహిస్తుంటాం. ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలం జీవించిన వారిని పరిశీలిస్తే మనకు అనేక సానుకూల అంశాలు స్ఫురిస్తాయి. అలాంటి సానుకూల అంశాలు స్ఫురిస్తాయి. అలాంటి వాటిలో పది విషయాలను ప్రముఖంగా గుర్తించవచ్చు.


* 1.సానుకూల వ్యవహారం: సానుకూల ఆలోచనలు, వైఖరి, దృక్పథం మన వ్యవహార శైలిని ప్రభావితం చేస్తాయి. జీవన విధానం, ప్రజా సంబంధాలు, ఇతర బాంధవ్యాలు బాగున్న వ్యక్తి జీవితం సుఖ సంతోషాలకు నిలయంగా వుంటుంది. అలాగే ప్రతికూల ఆలోచనలు, వ్యవహార విధానం మనలో మానసిక వైఫల్యాలను పెంచి పోషిస్తాయి. మానసిక ఒత్తిళ్ళు, ప్రతికూల సంబంధాల వల్ల మనో శారీరక రుగ్మతులు తలెత్తి ఆరోగ్యాన్ని ఆయుష్షును క్షీణింపచేస్తాయి. ఈర్ష్య, ద్వేషం, కోపం, ఆవేశం లాంటి ప్రతికూల భావోద్వేగాలు అధికంగా ఉన్నవారు త్వరగా జబ్బులకు గురవుతుంటారు.

* 2.మంచి వ్యాపకం: నిత్యం నచ్చిన పనులతో తీరిక లేకుండా గడిపేవారు. పనిలేని సోమరులు నచ్చని పనులతో విసిగిపోయే వారికంటే ఆరోగ్యంగా ఉన్నట్టు పనులు సర్వేలు వెల్లడించాయి. అందుకే ఇష్టమైన పనులను చేపట్టాలి లేదా చేసే పనుల పట్ల ఇష్టమైనా పెంచుకోవాలంటారు అనుభవజ్ఞులు. ఏ పనీ లేకుండా ఖాళీగా తిరిగే వారు వ్యసనపరులుగా తయారయ్యే ప్రమాదముంది. లేదా సోమరిపోతులుగా తయారయ్యి, నిరాశ, నిస్పృహలకు గురవుతుంటారు. దీనివల్ల జీవితం దుర్భరంగా మారిపోతుంది.

* 3.ఆహార నియమాలు: సానుకూల ఆలోచనలకు ఆహార నియమాలు తోడైతే మందుల అవసరం తగ్గిపోతుంది. సాత్విక, సమతులాహారం తీసుకునేవారు మిగిలిన వారికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. మాంసాహారుల కంటే శాఖాహారులు, అధికంగా భుజించే వారికంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకునేవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

* 4.సంతోషాన్ని ఆస్వాదించడటం: పదిమందితో కలుపుగోలుగా మెలగడం, సంతోషాన్ని పంచుకోవడం, తృప్తిగా గడపడం, ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. హాయిగా నవ్వగలిగేవారి జీవితం ధన్యమని అందుకే అంటారు.

* 5.సక్రమమైన నిద్ర: అవసరమైనంత నిద్ర, శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంటుంది. ప్రతిరోజు రాత్రి త్వరగా పడుకుని ఉదయం త్వరగా నిద్రలేవడం అలవరచుకోవాలి.

* 6.యోగా, ధ్యాన సాధన: శరీరానికి తగినంత వ్యాయామం, మనస్సుకు ప్రశాంతత చేకూర్చే యోగ, ధ్యాన సాధన వల్ల జీవితానికి ఔన్నత్యం చేకూరుతుంది.

* 7.దైవ చింతన, ప్రకృతి ఆరాధన: దైవ భక్తి లేదా ప్రకృతి ఆరాధన మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. తద్వారా ఆయురారారోగ్యాలు సిద్ధిస్తాయి.

* 8.వ్యాకులతను అధిగమించడం: మానసిక ఆందోళన, వ్యాకులత, ఒత్తిళ్ళను అధిగమించి, వాటికి దూరంగా వుండగలిగే వారు మిగిలిన వారికంటే చాలా ఆరోగ్యంగా వుంటారు.

*9.సత్సంబంధాలు: సామాజిక జీవనంలో సత్సంబంధాలు కలిగి వున్నవారి జీవితం సుఖమయమవుతుంది. దీనివల్ల ఆరోగ్యం, ఆయుష్షు, వృద్ధి పొందుతాయి.

*10.మరణచింతన లేకపోవడం: మరణంపట్ల చింతపడటం మానేసిన వారు మరింతకాలం జీవిస్తారంటారు. సాధారణంగా నడివయస్సు వచ్చిన వారు అప్పుడప్పుడు చావు పట్ల భయపడుతుంటారు. అలాంటి వారు చావుకు భయపడటం మాని బ్రతికినంత కాలం హాయిగా జీవించడానికి సన్నద్ధం కావాలి.

  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

Your comment is very important to improve the Web blog.