Thursday, February 3, 2011

Medicine updates(Telugu)

నెలసరి బాధలకు విరుగుడు మాత్ర :

నెలసరి వస్తుందనగానే కొందరు మహిళలు హడలిపోతుంటారు. చిరాకు, కుంగుబాటు, హఠాత్తుగా కోపం ముంచుకురావటం, కడుపునొప్పి, కడుపుబ్బరం, తలనొప్పి వంటి లక్షణాలతో తెగ ఇబ్బంది పడిపోతుంటారు. మరికొందరిలో మూడ్‌ మారిపోవటం, రాత్రిపూట చాక్లెట్ల వంటి తీయటి పదార్థాలు తినాలని అనిపించటమూ కనిపిస్తుంది. అయితే ఈ బాధల నుంచి త్వరలోనే విముక్తి కలగనుందని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఈ లక్షణాలను నివారించే మాత్రను రూపొందించటంలో ముందడుగు వేశామని చెబుతున్నారు. ఫ్యాటీ యాసిడ్లతో కూడిన ఈ మాత్ర ఇప్పటికే మంచి ఫలితాలు కనబరుస్తున్నట్టు బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనంలోనూ వెల్లడైంది. దీనిని ఆరునెలల పాటు వాడిన మహిళల్లో నెలసరి బాధలు అంత తీవ్రంగా కనబడలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. విటమిన్‌ ఇ, గామా లినోలెనిక్‌ యాసిడ్‌, ఓలెయిక్‌ యాసిడ్‌, లినోలెయిక్‌ యాసిడ్‌లతో ఈ మాత్రను రూపొందించారు.
----------------
మహిళల నెలసరి ముందు వచ్చేబాధలకు-విరుగుడు ,For premenstrual syndrome treatment

ఎంతోమంది మహిళలు నెలసరి ముందు వచ్చే బాధలతో ఇబ్బందులు పడుతుంటారు. వీటి బారి నుంచి కాపాడుకోవటానికి ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవటంతో పాటు హర్మోన్‌ మాత్రలు, కుంగుబాటును తగ్గించే మందులనే సైతం ఉపయోగిస్తుంటారు. అయితే ఇవేవీ అంతగా ఉపయోగపడటం లేదు. పైగా కొన్ని మందులతో దుష్ప్రభావాలూ పొడసూపుతున్నాయి. అయితే ఇటీవల చేసిన ఒక అధ్యయనం నెలసరి బాధల విషయంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వీటిని తగ్గించటంలో విటమిన్‌ ఇ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు బ్రెజిల్‌ పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. కొందరికి విటమిన్‌ ఇ, పాలీ అన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్లు గల మాత్రలు.. మరికొందరికి ఏ మందూ లేని మాత్రలు ఇచ్చి పరీక్షించారు. నెలసరి త్వరలో వస్తుందనగా రోజూ రాత్రిపూట రెండు మాత్రల చొప్పున వేసుకోవాలని సూచించారు. మూణ్నెళ్ల తర్వాత ఒకసారి, ఆర్నెళ్ల తర్వాత మరోసారి నెలసరి బాధల తీవ్రతను పరిశీలించారు. విటమిన్‌ ఇ, కొవ్వు ఆమ్లాలు గల మాత్రలు వేసుకున్నవారిలో నెలసరి బాధల తీవ్రత గణనీయంగా తగ్గటం విశేషం. దుష్ప్రభావాలు కూడా పెద్దగా కనిపించలేదు. ఈ మాత్రలు.. ఒంట్లో నీరు బయటకు పోకుండా అడ్డుకోవటానికి, రొమ్ముల్లో నొప్పికి కారణమయ్యే ప్రోలాక్టిన్‌ అనే హార్మోన్‌ను శరీరం తక్కువగా గ్రహించేలా చేయటమే దీనికి కారణమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు
============================================================
సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌ (సీఆర్‌పీ), C-Reactive protein(CRP) :
తరచుగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? కార్యాకారణాలను విశ్లేషించటంలో పొరపడుతున్నారా? అయితే రక్తంలో సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌ (సీఆర్‌పీ) మోతాదు ఎక్కువుందేమో ఓసారి పరీక్షించుకోండి. ఎందుకంటే ఆలోచనా పరమైన సమస్యలకూ రక్తంలో సీఆర్‌పీ స్థాయి అధికంగా ఉండటానికీ సంబంధం ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది మరి. ఈ అధ్యయనంలో భాగంగా 447 మంది వృద్ధుల మెదడు స్కానింగులతో పాటు రక్తంలో సీఆర్‌పీ మోతాదులను కూడా శాస్త్రవేత్తలు పరీక్షించారు. అలాగే వారు ఆలోచించే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం, ధారాళంగా మాట్లాడటం, సంభాషణలను గుర్తుపెట్టుకోవటం వంటి వివిధ అంశాలను పరిశీలించారు. సీఆర్‌పీ స్థాయులు ఎక్కువగా గలవారు నిర్ణయాలు తీసుకునే పరీక్షను పూర్తిచేయటంలో వెనకబడుతున్నట్టు గుర్తించారు. సీఆర్‌పీ తక్కువగా ఉండేవారితో పోలిస్తే ఎక్కువగా ఉండేవారిలో వయసుతో పాటు మెదడులో వచ్చే మార్పులు 12 ఏళ్లు ముందుగానే కనిపిస్తున్నట్టూ బయటపడింది. వ్యాయామం చేయటం, బరువును అదుపులో ఉంచుకోవటం, ఆస్ప్రిన్‌ లేదా స్టాటిన్స్‌ తీసుకోవటం వంటివి సీఆర్‌పీ మోతాదును తగ్గించుకోవటానికి తోడ్పడతాయని పరిశోధకులు వివరించారు.
===========================================================
ఆరోగ్యంపై బెంగ...Health phobia 05/feb/2011.

ఎక్కువగా టివి చూస్తూ వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన వార్తలు తిలకించేవారికి జీవితంపై నిరాసక్తత కలుగుతోందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. దీంతో వీరిలో ఉత్సాహంగా తగ్గి తరచుగా బెంగ పడుతుంటారని తేలింది. యూనివర్సిటీ ఆఫ్‌ రోడ్‌ ఐలాండ్‌ వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు చూస్తున్నవారిపై ఓ అధ్యయనం చేశారు. వివిధ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ కొన్నిసార్లు టివి ప్రేక్షకులు పలు అపోహ లకు గురవుతుంటారని తెలిసింది.
వీటిని తిలకించిన ప్రేక్షకులు తాము కూడా అటువంటి వ్యాధులకు గురవుతున్నామో ఏమో అని బెంగపడుతుంటారు. కొన్నిసార్లు వారు అతి జాగ్రత్తతో అనర్థాలకు కూడా గురవుతుంటారు. ఫలితంగా వారికి తమ జీవితంపై నిరాసక్తత కలుగుతుంది. కొన్నిసార్లు వారు వైరాగ్యంగా కూడా మాట్లాడు తుంటారని వారి స్టడీలో తేలింది. ఈ సర్వేను 18 నుంచి 31 సంవత్సరాల వయస్సున్న యువతపై నిర్వహించారు.
  • ------------------------------------------------------------------------------------------------
గుండెకు 'మందు'పోటు

అతిగా మద్యం తాగుతున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. దీంతో గుండె వేగం పెరగటమే కాదు, లయ కూడా అస్తవ్యస్తమయ్యే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా మద్యం తాగే అలవాటు గలవారికి గుండె పైగదులు వేగంగా, అస్తవ్యస్తంగా కొట్టుకోవటం (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌) అనే ముప్పు పొంచి ఉంటోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొత్తం 1,30,820 మందిపై చేసిన 14 అధ్యయనాల ఫలితాలను బట్టి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అంతగా మద్యం అలవాటు లేనివారితో పోలిస్తే అతిగా తాగేవారిలో ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ ముప్పు 50 శాతం వరకు పెరుగుతున్నట్టు గుర్తించారు. మద్యం మోతాదు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పూ పెరుగుతుండటం గమనార్హం. అయితే ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌కు మద్యం ఎందుకు కారణమవుతుందనేది తెలియరాలేదు. మద్యానికి సహజంగానే గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీసే గుణం ఉందని భావిస్తున్నారు. ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ మూలంగా ఛాతీ నొప్పి, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె విఫలం కావటం, పక్షవాతం వచ్చే అవకాశమూ ఎక్కువే. అందుకే గుండె ఆరోగ్యంగా ఉండటానికి అసలు మద్యం జోలికి వెళ్లకపోవటమే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

source : JIMA a medical magazine
  • ------------------------------------------------------------------------------------------------
రేడియేషన్‌ దుష్ప్రభావాలకు తెర!
క్యాన్సర్‌ బాధితులకు రేడియో థెరపీ సమయంలో దుష్ప్రభావాలు కనిపిస్తాయి. జుట్టు ఊడిపోవటం, వికారం, మతిమరుపు, ఆకలి తగ్గటం వంటి వాటితో ఎంతోమంది బాధపడుతుంటారు. అయితే ఈ దుష్ప్రభావాల నుంచి విముక్తి కలిగించే మందు త్వరలోనే అందుబాటులోకి రానుండటం ముదావహం.

క్యాన్సర్‌ నివారణకు ఉపయోగపడే 2-డియాక్సీ-డి-గ్లూకోజ్‌ (2-డీజీ) అనే దీనిని మనదేశంలోనే రూపొందించారు కూడా. సాధారణంగా క్యాన్సర్‌ కణాలు రక్తంలోని గ్లూకోజును గ్రహించి బలం పుంజుకుంటూ ఉంటాయి. ఈ 2-డీజీ మందును వేసుకున్నప్పుడు క్యాన్సర్‌ కణాలు దీనినే గ్లూకోజుగా భావించి స్వీకరిస్తాయి. ఇది శక్తిని ఇవ్వలేదు కాబట్టి క్యాన్సర్‌ కణాలు బలహీనపడతాయి. దీంతో రేడియేషన్‌ చికిత్స చేసినపుడు ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినకుండా క్యాన్సర్‌ కణాలు మాత్రమే నశిస్తాయి. 2-డీజీ మందు మూడు దశల ప్రయోగాల్లోనూ విజయవంతమైంది. మరో రెండు, మూడు నెలల్లోనే ఇది మార్కెట్‌లోకి రాగలదని భావిస్తున్నారు.
  • -------------------------------------------------------------------------------------
పెద్దల పొగతాగే అలవాటు..పిల్లల్లో రక్తపోటు, Adult smoking and B.P.in children
ఇంట్లో పిల్లల ముందు సిగరెట్లు తాగుతున్నారా? అయితే పరోక్షంగా వారి రక్తపోటు పెరగడానికి దోహదం చేస్తున్నట్టే. ఎందుకంటే మిగతా పిల్లలతో పోలిస్తే పొగతాగే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో రక్తపోటు ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది మరి. పర్యావరణంలోని నికొటిన్‌ 4-5 ఏళ్ల పిల్లల్లోనూ దుష్ప్రభావం చూపుతున్నట్టు జర్మనీ అధ్యయనంలో తొలిసారిగా బయటపడింది. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు తల్లులు పొగ తాగితే ఆ ప్రభావం పిల్లలపై మరింత ఎక్కువగా పడుతుండటం గమనార్హం. హీడెల్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇటీవల 4,236 మంది పిల్లలపై ఒక అధ్యయనం చేశారు. పొగతాగే అలవాటున్న తల్లిదండ్రులు గల 4-7 ఏళ్ల పిల్లలను ఇందుకు ఎంచుకున్నారు. ఎత్తు, బీఎంఐ, లింగభేదం, తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ముప్పు కారకాలు పిల్లల రక్తపోటుపై ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. వూబకాయులైన పిల్లల్లోనైతే సిస్టాలిక్‌ రక్తపోటు (పై అంకె) సుమారు రెండింతలు ఎక్కువగా ఉంటోంది కూడా. పొగతాగే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో సిస్టాలిక్‌ రక్తపోటు పెరిగే ముప్పు 21 శాతం అధికంగా ఉంటున్నట్టు తేలింది. ''ఇతర కారకాలకు పొగ కూడా తోడవుతోంది'' అని పరిశోధకులు చెబుతున్నారు. ముప్పు కారకాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ రక్తపోటు కూడా పెరుగుతోందని వివరిస్తున్నారు. పొగ రహిత పర్యావరణాల ఆవశ్యకతను ఈ అధ్యయనం మరోసారి నొక్కిచెప్పింది. ముఖ్యంగా ఇళ్లల్లో నికొటిన్‌ లేకుండా చూసుకోవటం పెద్దలకే కాదు పిల్లల ఆరోగ్యానికీ కీలకమేనని వివరిస్తోంది. పెద్దయ్యాక వచ్చే గుండెపోటు, పక్షవాతం వంటివాటికి చిన్నతనంలోనే బీజం పడుతున్న విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా ముప్పు కారకాలకు పిల్లలను దూరంగా ఉంచటం మేలని చెబుతున్నారు.
పక్షవాతం చికిత్స గంటలోపు చేస్తేనే...ఎక్కువ లాభము , Treatment with in one hour for paralysis is more benifit:

  • [paralysis-patient-tries-walking.jpg]

పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి చేర్చటం ఎంత కీలకమో.. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత కూడా ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత మెరుగైన ఫలితాలుంటాయి. ముఖ్యంగా గంటలోపు టిష్యూ ప్లాస్మినోజెన్‌ యాక్టివేటర్‌ (టీపీఏ) ఇంజెక్షన్‌ ఇస్తే మరణించే అవకాశాలు గణనీయంగా తగ్గుతున్నట్టు అమెరికాలో చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆసుపత్రికి వచ్చాక చికిత్స చేసే సమయం తగ్గుతున్నకొద్దీ (ప్రతి 15 నిమిషాలకు) మరణించే అవకాశం 5 శాతం తగ్గుతున్నట్టు తేలింది. అలాగే మెదడులో తరచూ రక్తస్రావం కావటాన్నీ తగ్గిస్తున్నట్టు బయటపడింది. పక్షవాతం బాధితులు ఆసుపత్రికి వచ్చాక కేవలం 26.6 శాతం మందికే గంటలోపు టీపీఏని ఇస్తున్నట్టు పరిశోధకుల విశ్లేషణలో బయటపడింది. మూడు గంటల్లోపు చికిత్స మొదలుపెడితే మంచి ఫలితాలు ఉంటాయని ఇప్పటివరకు భావిస్తున్నారు. కానీ అంతకన్నా ముందే చికిత్స ఆరంభిస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు.-----------02/03/2011
--------------------------------------------------------------------------------------------------
మద్యంతో కలత నిద్ర,Disturbed sleep with Alcohol.

  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjo7f6ypuo7vyHq7I6C3Sp0rwjUClHWU2geF4y7aRX9784T0I1KapG27Pr3W9qG7DwwWfsJ4JVweqyYb_g8NWU24KakrydNpXh4ILMg9drWgCWVeiV-rPh9S9SeQjbuwMZiVt0jsAzSqB4/s1600/Alcoholism.jpg
మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందని చాలామంది భావిస్తుంటారు. అందుకే నిద్రపట్టక సతమతమయ్యే కొందరు పడుకునేముందు మద్యం తాగటాన్నీ అలవాటు చేసుకుంటుంటారు. కానీ ఇది నిద్రా సమయాన్ని తగ్గించటమే కాదు, నిద్రాభంగాన్ని కూడా కలిగిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మద్యం తాగగానే నిద్ర పట్టేమాట నిజమే గానీ.. ఇది కొద్దిగంటలు మాత్రమే. ఆ తర్వాత వెంటనే మెలకువ వచ్చేస్తుంది. అలాగే పడుకున్నా కూడా సరిగా నిద్ర పట్టదు. ఈ దుష్ప్రభావాలు పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే అధికంగా ఉంటున్నట్టూ బయటపడింది. నిద్రపై మద్యం ప్రభావం అనే అంశంపై ఇటీవల మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. 20 ఏళ్ల యువతీ యువకులను ఎంచుకొని ముందురోజు మద్యం కలిపిన చల్లటి పానీయాన్ని తాగించారు. మర్నాడు ఆ పానీయంలో వాసన రావటానికి కేవలం కొన్ని చుక్కల మద్యం కలిపారు. అనంతరం వీరిని పరిశీలించగా.. వాళ్లు మద్యం తాగిన వెంటనే నిద్ర పోయినప్పటికీ ఆ తర్వాత చాలాసార్లు మేల్కొన్నట్టు గుర్తించారు. మగవారి కన్నా స్త్రీలు 19 నిమిషాల సేపు తక్కువ నిద్రపోయారు. కలత నిద్ర సమయం 4 శాతం పెరిగింది కూడా.
--(05/03/2011)
--------------------------------------------------------------------------
కొలెస్టరాల్‌ తగ్గించే మందులతో ప్రోస్టేట్‌ కేన్సర్‌కు చెక్‌, Check for Prostrate cancer with anti cholesterol drugs(statins)


రక్తంలో కొలెస్టరాల్‌ పరిమాణం అధికంగా ఉన్నట్లయితే ప్రోస్టేట్‌ కంతులు త్వరితగతిన పెరిగి కేన్సర్‌గా పరిణామం చెందుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రోస్టేట్‌ కేన్సర్‌పై కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కలిగే ప్రభావాలను అధ్యయనం చేసినప్పుడు ఈఅంశం వెల్లడైంది. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఎక్కువ మొత్తాల్లో ఉన్న కొలెస్టరాల్‌ కేన్సర్‌కు కారణ మవుతున్నట్లు స్పష్టంగా వెల్లడి కాకపోయినా, రక్తంలో ఎక్కువ పరిమాణంలో ఉండే కొవ్వు ప్రోస్టేట్‌ కేన్సర్‌ పెరుగుదలను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడైంది.మానవ ప్రోస్టేట్‌ కేన్సర్‌ కణాలను ఎలుకలలోకి ఇంజెక్షన్‌ ద్వారా ప్రవేశపెట్టారు. ఇది మనిషిలో కలిగే కేన్సర్‌కు ఖచ్చితమైన ప్రతిరూపం కాకపోయినప్పటికీ, కేన్సర్‌పై పరిశోధనలలో విస్తృతంగా ఈ విధానాన్ని అవలంబిస్తారు.

కొలెస్టరాల్‌ అధికంగా ఉన్న ఆహారాన్ని ఈ ఎలుకలకు ఇచ్చినప్పుడు కంతుల కణజాలం పైపొర చుట్టూ కొలెస్టరాల్‌ పేరుకుంది. ఈ విధంగా పేరుకున్న కొలెస్టరాల్‌ కణాల జీవన ప్రక్రియకు సంబంధించిన రసాయనిక చర్యను వేగవంతం చేసింది. దీనిని అక్ట్‌ (tmi) అంటారు.ప్రోస్టేట్‌ కేన్సర్‌కు దీనినే ప్రధాన మార్గంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రసాయనిక చర్య కారణంగా కంతి కణాలు ఆత్మవినాశనం (సెల్‌ సూసైడ్‌ లేదా ప్రోప్టోసిస్‌) చెందకుండా తట్టుకుని మరింతగా విజృంభించాయి.

ఆ ఎలుకలకు కణాల పొరలలో ఉన్న కొలెస్టరాల్‌ను తగ్గించడానికి స్టాటిన్‌ ఔషధాలను ఇచ్చినప్పుడు కంతుల పెరుగుదల ఆగిపోయింది.ప్రోస్టేట్‌ కేన్సర్‌ను నిరోధించడానికి కొలెస్టరాల్‌ను తగ్గించే ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయని ఈ అధ్యయనాల్లో వెల్లడించాయి. పురుషుల్లో అతి సర్వసాధారణంగా కనిపించే కనిపించే కేన్సర్లలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ ప్రధానమైనది.
  • -----------------------------------------------------------------------------------------------
సెరోటోనిన్ ప్రభావము , Serotonin-influence

శరీరం బరువు తగ్గడానికి డాక్టర్లు సూచించే రెండు రకాల మందులు మెదడులో ఉండే సెరోటోనిన్ స్థాయిని తగ్గిస్తున్నట్లు పరిశోధనలలో వెల్లడయ్యింది. సెరోటోనిన్ స్థాయి తగ్గడంవల్ల కోపం, చిరాకు వంటివి పెరుగుతాయి. మెదడు నిర్వహించే విధుల్లో సెరోటోనిన్ పాత్ర ఎంతో ఉంటుంది.

జ్ఞాపకశక్తి, కోపం, ఉత్సుకత, వేదన వంటి మానసిక స్థితులు బహిర్గతం చేయడం మెదడు చేసే పనుల్లో ముఖ్యమైనవి. శరీరం బరువు తగ్గడానికి వాడే డెక్స్‌ ఫిన్-ప్లురమైన్ (రిడక్స్), ఫెన్‌ఫ్లురమైన్ (పొండిమిన్) అనే మందులు కోతులు, ఎలుకలుపై ప్రయోగించినపుడు వాటి మెదళ్లలో సెరోటోనిన్ స్థాయి తగ్గినట్లు తేలింది.
సెరోటోనిన్ స్థాయి తగ్గడంవల్ల మనుషుల్లో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయనేది ఇంకా నిర్ధారణ కావలసి ఉంది. ఈ మందులు వాడాల్సిందిగా రోగులకు సూచించినపుడు వారి జ్ఞాపకశక్తి, మానసిక స్థితుల్లో హెచ్చుతగ్గులు, నిద్రపోయే విధానాల్లో మార్పులు వంటి అంశాలపై వైద్యులు దృష్టి నిలపాలని పరిశోధకులు వారిని హెచ్చరిస్తున్నారు.
ఈ మందుల వాడకం గుండె జబ్బులకు దారితీస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ రెండు మందులు ఒకేసారి వాడడంవల్ల గుండె కవాటాలు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు.
ఆకలి తగ్గడానికి ఈ రెండు మందులు వాడతారు. స్వల్పకాలం ఈ రెండు మందులు వాడడంవల్ల ఇబ్బంది ఉండదు. అయితే ఈ మందులు దీర్ఘకాలం వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సలహాలు ఇస్తున్నారు వైద్య పరిశోధకులు.

షాపింగ్‌ చేస్తే ఆయుస్సు పెరుగుతుంది ,Life-expectancy increase with shoping :

షాపింగ్‌ చేద్దాం రండి...! అంటే.. మీవారు వూరికే చిరాకు పడిపోతూ, ఎందుకోయ్‌ డబ్బులు దండగ అంటున్నారా? అయితే మీకూ, మీవారికీ ఓ శుభవార్త. నిత్యం షాపింగ్‌ చేసేవారు దీర్ఘాయుష్మంతులు అవుతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎవరికి వారు ఒంటరి ప్రపంచంలో మగ్గిపోతున్న ఈ రోజుల్లో సమాజంతో సత్సంబంధాలు ఏర్పడడానికి షాపింగ్‌ సహకరిస్తుందట. అంతేకాదు సాధారణ వ్యక్తులతో పోలిస్తే తరచూ కొనుగోళ్లు చేసేవారిలో జీవితకాలం అధికంగా ఉంటోందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన నిపుణులు అంటున్నారు. ఎవ్వరితో మాట్లాడకుండా ఇంట్లోనే కాలం గడిపేవారితో పోలిస్తే తరచూ షాపింగ్‌మాళ్లకి.. వస్త్రదుకాణాలకి, పచారీ కొట్లకి వెళ్లేవారు 27 శాతం అధికంగా జీవిస్తారని తైవాన్‌ నేషనల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ పదేళ్లపాటు పరిశోధనలు జరిపిన తర్వాత ఈ విషయాన్ని నిర్థరించింది. ముఖ్యంగా కొనుగోళ్ల పట్ల మహిళలు చూపించిన ఆసక్తి పురుషులు చూపించరు కానీ.. దీనివల్ల మగవారికే ఎక్కువ మేలట.. అందుకనిషాపింగ్‌కి మీరొక్కరే వెళ్లడం కాకుండా మీవారిని కూడా వెంటబెట్టుకొని వెళితే మేలు. 'షాపింగ్‌ అంటే వేలకు వేలు ఖర్చుపెట్టి మాల్స్‌లోనే కాలం వెళ్లబుచ్చమని కాదు. పప్పు, ఉప్పు.. ఓ చిన్న చాక్లెట్‌ ఏదైనా సరే.. బయటకు వెళ్లికొనుగోలు చేయడం వల్ల నలుగురితో ధైర్యంగా మాట్లాడటం, కొనుగోళ్ల వ్యవహారత అలవడుతుంది. విండో షాపింగ్‌తో మెదడు చురుగ్గా ఉంటుంది' అంటున్నారు ఈ పరిశోధనను చేపట్టిన మౌరీన్‌హిన్‌టన్‌.(Eenadu news paper)



తినగానే పడుకుంటే పక్షవాతం ముప్పు,
Sleeping soon after meals may lead to paralysis.


భోజనం చేసిన వెంటనే పడుకోవద్దని పెద్దవాళ్లు చెప్పటం వినే ఉంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో మంచిదని పరిశోధకులు కూడా చెబుతున్నారు. తిన్నాక గంట తర్వాత పడుకుంటే పక్షవాతం ముప్పు మూడింట రెండు వంతులు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు గంట తర్వాత అదనంగా ప్రతి 20 నిమిషాల వ్యవధి పెరుగుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు మరో 10 శాతం మేరకూ తగ్గుతోందని గ్రీస్‌లోని అయోనియా విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టినా-మరియా క్యాస్టోరినీ అంటున్నారు. ఈ అధ్యయనంలో 500 మంది ఆరోగ్యవంతులు, 250 మంది పక్షవాతం బాధితులు, 250 మంది తీవ్ర గుండె రక్తనాళ జబ్బు గలవారిని పరిశీలించారు. వీరి ఆహార అలవాట్లు, పడుకునే సమయం వంటి వివరాలను సేకరించారు. వీరిలో భోజనం చేశాక 60-70 నిమిషాల తర్వాత నిద్రపోయేవారికి పక్షవాతం ముప్పు 66% తక్కువగా ఉంటున్నట్టు తేలింది. 70 నిమిషాల నుంచి రెండు గంటల వరకు వేచి ఉండేవారికి 76% ప్రమాదం తక్కువగా ఉంటోంది.

భోజనం చేసిన వెంటనే నిద్రపోయేవారికి గొంతులో పుల్లటి త్రేన్పులు, మంట (రిఫ్లక్స్‌) వచ్చే అవకాశం ఎక్కువ. ఇది నిద్రలేమికి దారి తీస్తుందని, పక్షవాతం రావటానికి ఇదొక కారణమవుతుందని క్యాస్టోరినీ చెబుతున్నారు. తిన్న తర్వాత రక్తంలోని గ్లూకోజులో, కొలెస్ట్రాల్‌ మోతాదు, రక్త ప్రవాహంలో మార్పులు జరుగుతాయి. ఇలాంటి తాత్కాలిక మార్పులన్నీ పక్షవాతం ముప్పుని తెచ్చిపెడతాయని అమెరికన్‌ కాలేజీ ఆఫ్‌ కార్డియాలజీ అధ్యక్షుడు డేవిడ్‌ హోమ్స్‌ వివరిస్తున్నారు.


-----------------------------------------------------
కొత్త పరికరం మెలఫైండ్ (Melafind device) తో చర్మ క్యాన్సర్‌ గుర్తింపు తేలిక:


చర్మ క్యాన్సర్‌.. పాశ్చాత్య దేశాలలో చాలా ఎక్కువ, వాటితో పోలిస్తే మన దేశంలో కొంత తక్కువ. తొలి దశలో లక్షణాలు అస్పష్టంగా ఉండటం వల్ల చాలా మందిలో దీన్ని తొలిదశలో పట్టుకోవటం కష్టమవుతోంది. ఇలాంటి లక్షణాలను గుర్తించటానికి వైద్యులకు దీర్ఘకాలం శిక్షణ అవసరమవుతోంది కూడా. ఇప్పుడీ కష్టాలను తీర్చేందుకు కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. 'మెలఫైండ్‌' అనే ఈ పరికరానికి ఇటీవలే ఎఫ్‌.డీ.ఏ. ఆమోదించింది. ఇది చర్మ క్యాన్సర్‌ అనుమానం ఉన్నప్పుడు అక్కడి నుంచి ముక్క తీసి పరీక్ష (బయాప్సీ) చెయ్యటం అవసరమో కాదో అనేది నిర్ధరించటంలో తోడ్పడుతుంది. కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ను నిక్షిప్తం చేసిన ఇందులో చేత్తో పట్టుకోవటానికి వీలుండే స్కానర్‌ కూడా ఉంటుంది. చర్మంపై దెబ్బతిన్న భాగాలను స్కాన్‌ చేసి ఆ దృశ్యాలను విశ్లేషిస్తుంది. వాటి ఆధారంగా బయాప్సీ చేయాల్సిన అవసరముందో లేదో చెబుతుందన్న మాట. ప్రయోగాల్లో ఇది బాగా పనిచేస్తున్నట్టు తేలింది. బయాప్సీ అవసరమైన చర్మక్యాన్సర్లను గుర్తించటంలో ఇది 2% మాత్రమే తప్పుగా చూపించింది. ఈ పరికరం ద్వారా అనవసరంగా బయాప్సీ పరీక్షలు చేయటం తగ్గుతుందని ఎఫ్‌డీఏ భావిస్తోంది.
  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

Your comment is very important to improve the Web blog.